ఇరాన్‌పై పాకిస్తాన్ ప్రతిదాడులు, నలుగురు చిన్నారులు సహా ఏడుగురు మృతి

ఇరాన్ భూభాగం మీద పాకిస్తాన్ దాడులపై పాక్ మీడియాలో వార్తలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇరాన్ భూభాగం మీద పాకిస్తాన్ దాడులపై పాక్ మీడియాలో వార్తలు

ఇరాన్‌పై పాకిస్తాన్ ప్రతిదాడులకు దిగింది.

పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఇరాన్ భూభాగంలో జరిపిన ఈ దాడుల్లో నలుగురు చిన్నారులు సహా ఏడుగురు చనిపోయారని వార్తలు వస్తున్నాయి. వీరెవరూ తమ పౌరులు కాదని ఇరాన్ చెప్పిందని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.

ఇరాన్‌లోని సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉన్న ‘టెర్రరిస్టుల రహస్య స్థావరాలు’ లక్ష్యంగా నిర్దేశిత వైమానిక దాడులు చేసినట్లు పాకిస్తాన్ విదేశీ వ్యవహారాలశాఖ తెలిపింది.

గురువారం ఉదయం ఈ దాడులు జరిపినట్లు పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఇరాన్ మంగళవారం తమ భూభాగంపై జరిపిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ ఈ దాడులు చేసినట్లు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులను ఉటంకిస్తూ ఏఎఫ్‌పీ వార్తాసంస్థ వెల్లడించింది.

ఇరాన్‌లోని బలూచిస్తాన్ వేర్పాటువాద గ్రూపులకు చెందినవిగా చెప్తున్న శిబిరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని పేర్కొంది.

బలూచిస్తాన్‌లో భద్రతా సిబ్బంది

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, సరిహద్దు ప్రాంతంలో ఇరాన్ క్షిపణి దాడులు జరిపిన తర్వాత బలూచిస్తాన్‌లో భద్రతా ఏర్పాట్లను పాకిస్తాన్ పెంచింది.

ఇరాన్ నుంచి రాయబారిని వెనక్కు రప్పించిన పాక్

ఇరాన్ భూభాగంలో బలూచిస్తాన్ మిలిటెంట్లు దాక్కున్న ప్రాంతాలు లక్ష్యంగా పాకిస్తాన్ వైమానిక దాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

మిలిటెంట్ గ్రూప్ ‘జైష్ అల్ అదిల్’ లక్ష్యంగా ఇరాన్ మంగళవారం పాకిస్తాన్ భూభాగంలో డ్రోన్, క్షిపణి దాడులు చేసిన తరువాత రెండు రోజులకు గురువారం పాకిస్తాన్ దాడులు చేసింది.

ఇరాన్ దాడుల తరువాత పాకిస్తాన్ ఇప్పటికే తమ నిరసనను వ్యక్తం చేసింది. పాకిస్తాన్ సార్వభౌమత్వానికి ఎవరు భంగం కలిగించినా తీవ్ర పర్యవసానాలు తప్పవని హెచ్చరించింది. ‘‘పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా పాల్పడిన ఈ తీవ్ర ఉల్లంఘనలకు, పర్యవసానాలకు ఇరానే పూర్తిగా బాధ్యత వహించాలి’’ అని పేర్కొంది.

ఇరాన్‌లోని తమ రాయబారిని కూడా పాక్ ఇప్పటికే వెనక్కు రప్పించి దౌత్యపరంగా నిరసన తెలిపింది. ఇరాన్ రాయబారిని దేశం నుంచి బహిష్కరించింది.

సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఒక గ్రామంపై పాకిస్తాన్ వైపు నుంచి క్షిపణులు వచ్చి పడ్డాయని ఇరాన్ చెప్పిందని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.

ఈ దాడులలో ముగ్గురు మహిళలు, నలుగురు చిన్నారులు మరణించారని, వారెవరూ ఇరాన్ పౌరులు కారని ఇరాన్ చెప్పినట్లుగా చెప్పింది.

missile

ఫొటో సోర్స్, Reuters

జనసాంద్రత తక్కువగా ఉండే పాకిస్తాన్, ఇరాన్ సరిహద్దులలో జైష్ అల్ అదిల్, ఇతర వేర్పాటువాద గ్రూపులపై ఈ రెండు దేశాలు దశాబ్దాలుగా పోరాడుతున్నాయి.

సుమారు 900 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు వెంబడి భద్రత విషయంలో రెండు దేశాలకూ అనేక ఏళ్లుగా ఆందోళనలున్నాయి.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్ మీద ఇరాన్ మిసైల్ దాడులపై చైనా ఏమంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)