ముంబయిలోని బాంద్రా రైల్వే స్టేషన్లో తొక్కిసలాట, 9 మందికి గాయాలు

ఫొటో సోర్స్, ANI
ముంబయిలోని బాంద్రా రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది.
బాంద్రా నుంచి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ వెళ్లే అంత్యోదయ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫాం మీదికి రాగానే రైలు ఎక్కేందుకు ప్రయాణికులు ఎగబడ్డారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారని, వారు బాంద్రాలోని భాభా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు.


దీపావళి, ఛట్ పూజ కోసం భారీ సంఖ్యలో ప్రజలు ఉత్తరాది రాష్ట్రాల్లోని తమ సొంతూళ్లకు వెళ్తుంటారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పశ్చిమ రైల్వే శనివారం తెలిపింది.
పశ్చిమ రైల్వే పరిధిలోని ముంబయి డివిజన్ అధికారి అభయ్ సింగ్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం, ఇద్దరు ప్రయాణికులు బాంద్రా వద్ద కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించినప్పుడు ఈ ప్రమాదం జరిగింది.
ప్రయాణికులు కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించవద్దని అభయ్ సింగ్ చౌహాన్ కోరారు.
గోరఖ్పూర్ వెళ్లేందుకు యార్డ్ నుంచి ప్లాట్ఫాం మీదకు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెప్పారు.
‘‘ఉదయం 5.15 గంటలకు ఈ రైలు గోరఖ్పూర్ బయలుదేరాల్సి ఉంది. కానీ, పండగ సీజన్ కావడంతో మూడు గంటల ముందే రైళ్లను ప్లాట్ఫాం మీదికి తీసుకొస్తున్నాం’’ అని పశ్చిమ రైల్వే ప్రతినిధి వినీత్ అభిషేక్ చెప్పారు.
బాంద్రా నుంచి గోరఖ్పూర్ వెళ్లే అంత్యోదయ ఎక్స్ప్రెస్ పూర్తిగా అన్రిజర్వుడ్ రైలు. అంటే రైలులో బోగీలన్నీ జనరల్ బోగీలే.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కేంద్ర ప్రభుత్వంపై శివసేన విమర్శలు
నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా 25కి పైగా రైలు ప్రమాదాలు జరిగాయని శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఈ ప్రమాదాల్లో వందల మంది మరణించారని, వేల మంది గాయపడ్డారని చెప్పారు.
‘‘మీరు హైస్పీడ్ రైళ్ల గురించి మాట్లాడుతారు. గాలిలో ఎగిరే బస్సుల గురించి చర్చిస్తారు. మరి నేలపై జరిగే వాటిని ఎవరు పట్టించుకుంటారు?’’ అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే అడ్మినిస్ట్రేషన్లపై శివసేన అధికార ప్రతినిధి ఆనంద్ దుబే విమర్శలు చేశారు. పేదల జీవితాలంటే ప్రభుత్వానికి అసలు పట్టింపే లేదని ఆయన అన్నారు.
దీపావళి, ఛట్ పూజ కోసం పేదలు తమ గ్రామాలకు వెళ్లాలనుకుంటే, వారు రైలు ఎక్కలేకపోతున్నారని, తొక్కిసలాట బాధితులుగా మారుతున్నారని ఆనంద్ దుబే అన్నారు.
‘‘ఈ ఘటనకు బాధ్యులు రైల్వే అడ్మినిస్ట్రేషనా? రైల్వే పోలీసులా? రైల్వే మంత్రినా?’’ అని ప్రశ్నించారు.
‘‘మహారాష్ట్ర బీజేపీకి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇన్-ఛార్జ్గా ఉన్నారు. వారు ఎన్నికల కోసం వస్తున్నారు. కానీ, ప్రజల జీవితాలపై వారికసలు శ్రద్ధే లేదు’’ అని ఆనంద్ దుబే విమర్శించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














