రైలు ప్రమాదం: ఉత్తరప్రదేశ్లో పట్టాలు తప్పిన చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్...

ఫొటో సోర్స్, SATISH MISHRA
ఉత్తరప్రదేశ్లోని గోండా రైల్వే స్టేషన్ సమీపంలో చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్కు చెందిన కోచ్లు పట్టాలు తప్పాయి.
గోండా జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ అందించిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
వీరితోపాటు మరో 26 మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారని గోండా జిల్లా సీఎంఓ రష్మీ వర్మ తెలిపారు.
సంఘటనా స్థలంలో ప్రత్యక్షసాక్షిగా ఉన్న వ్యక్తి పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదం మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగింది.
రైల్వే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ( ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ) చెప్పినదాని ప్రకారం ప్రమాదం జరగడానికి ముందు రైలులో పేలుడు శబ్దాలను విన్నట్లు లోకో పైలట్ చెప్పారు.
అయితే, ఈ వ్యవహారంలో ఇంకా సమాచారం అందాల్సి ఉందని, అప్పుడే పూర్తి వివరాలు చెప్పగలమని డైరెక్టర్ తెలిపారు.
ప్రమాదం జరిగిన ప్రాంతం గోండా పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రమాదంలో నాలుగు నుంచి అయిదు బోగీలు పట్టాలు తప్పాయి.
ఉత్తరప్రదేశ్లో దిబ్రూగఢ్-చండీగఢ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన విషయంపై అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మకు సమాచారం అందించినట్లు అస్సాం ముఖ్యమంత్రి కార్యాలయం తన అధికారిక పోస్ట్లో తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది


ఫొటో సోర్స్, SATISH MISHRA
దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనకు సంబంధించి హెల్ప్లైన్ నంబర్లు జారీ చేసినట్లు రైల్వే శాఖ ఎక్స్ పోస్ట్ ద్వారా తెలిపింది.
దిబ్రూగఢ్-చండీగఢ్ ఎక్స్ప్రెస్ కోచ్లు పట్టాలు తప్పిన ఘటనపై నార్త్ ఈస్టర్న్ రైల్వే సీపీఆర్వో పంకజ్ సింగ్ మాట్లాడుతూ...‘‘చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్ వెళ్లే రైలు మోతీగంజ్, జిలాయ్ మధ్య పట్టాలు తప్పింది. రైల్వే మెడికల్ వ్యాన్ అక్కడికి చేరుకుంది. సహాయక చర్యలు ప్రారంభించాం." అని వెల్లడించారు.
"రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, 4-5 కోచ్లు పట్టాలు తప్పాయి. వైద్య బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించింది." అని పంకజ్ సింగ్ తెలిపారు.
రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, బోగీల్లో ఉన్న ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చడానికి బస్సులతో సహా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కూడా ఆయన తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ఇప్పటి వరకు రెండు రైళ్లను కూడా దారి మళ్లించారు.
(ఈ కథనం అప్డేట్ అవుతోంది)














