ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్‌‌ను కాల్చి చంపిన దుండగులు

అమెరికా, చార్లీ కిర్క్, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్‌ను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఆయన కుటుంబానికి సన్నిహితుడిగా చెబుతారు (ఫైల్ ఫోటో)

యూటాలో జరిగిన కాల్పుల్లో కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ చనిపోయారు.

కిర్క్‌ను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడిగా చెబుతారు. అమెరికా వ్యాప్తంగా వివిధ క్యాంపస్‌లలో చర్చా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆయన ప్రఖ్యాతిగాంచారు.

యూటా కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయనపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 31 ఏళ్ల చార్లీ కిర్క్ ప్రాణాలు కోల్పోయారు.

"గొప్ప వ్యక్తి, లెజండరీ చార్లీ కిర్క్ ఇక లేరు" అని ట్రంప్ సోషల్ మీడియా పోస్టులో రాశారు. అమెరికన్ యువతను చార్లీ అర్థం చేసుకున్నంతగా ఇంకెవరూ చేసుకోలేదు, ప్రేమించలేదని ఆయన పేర్కొన్నారు.

కాల్పులకు సంబంధించి ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, విచారణ అనంతరం విడుదల చేసినట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తెలిపారు.

కాల్పుల అనంతరం ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వీడియోను బీబీసీ వెరిఫై పరిశీలించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికా, డోనల్డ్ ట్రంప్, చార్లీ కిర్క్

ఫొటో సోర్స్, Getty Images

ట్రంప్ ఆగ్రహం

కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ మరణంపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఇది అమెరికాకు గడ్డు సమయమని అన్నారు.

సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేసిన ఆ వీడియోలో "చార్లీ కిర్క్ దారుణ హత్య బాధ, ఆగ్రహం కలిగించాయి" అన్నారు.

"చార్లీ లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచాడు. చార్లీ నిజమైన దేశభక్తుడు. తన జీవితాన్ని బహిరంగ చర్చకు, తన దేశానికి, అమెరికాకు అంకితం చేశారు" అన్నారు ట్రంప్.

రాజకీయ హింస గురించి కూడా ట్రంప్ మాట్లాడారు.

ఇందుకు కారణమైన ఏ ఒక్కరినీ తమ ప్రభుత్వం విడిచిపెట్టదని, ఇతర రాజకీయ హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నవారిని కూడా వదిలిపెట్టబోమని అన్నారు.

డోనల్డ్ ట్రంప్, చార్లీ కిర్క్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌‌తో చార్లీ కిర్క్

కిర్క్ తన 18 ఏళ్ల వయసులో, 2012లో కొందరితో కలిసి టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ(TPUSA) కన్జర్వేటివ్ గ్రూప్‌ను స్థాపించారు. అమెరికాలో లిబరల్ భావజాలమున్న కాలేజీల్లో కన్జర్వేటివ్ సిద్ధాంతాల వ్యాప్తిని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

ఆర్కిటెక్ట్ కుమారుడైన కిర్క్.. షికాగో శివారు ప్రాంతమైన ప్రాస్పెక్ట్ హైట్స్‌లో పెరిగారు షికాగోకి సమీపంలోని కాలేజీలో చదువుకున్నారు. రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడం కోసం ఆయన చదువును ఆపేశారు. అమెరికాలోని ప్రముఖ మిలిటరీ అకాడమీ అయిన వెస్ట్ పాయింట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ అందులో సఫలం కాలేదు.

పోస్ట్ మోడరనిజం వంటి అంశాలపై విద్యార్థులు, విద్యావేత్తలతో చర్చల్లో పాల్గొన్న సమయంలో తనకు డిగ్రీ లేకపోవడం గురించి కిర్క్ సరదాగా ప్రస్తావించేవారు.

2012లో అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండోసారి ఎన్నికైన తర్వాత TPUSAలో ఆయన మరింత కీలకంగా మారారు.

విద్యార్థులను సమీకరించి "ఆర్థిక బాధ్యత, స్వేచ్చా మార్కెట్లు, పరిమిత ప్రభుత్వం" వంటి వాటిని ప్రోత్సహించడం లాభాపేక్ష లేని ఈ సంస్థ లక్ష్యం. TPUSA‌కి ఇప్పుడు 850కిపైగా కాలేజీల్లో శాఖలు ఉన్నాయి.

దేశవ్యాప్తంగా పర్యటిస్తూ, రిపబ్లికన్ కార్యక్రమాల్లో పాల్గొనేవారు కిర్క్. ఆయన కన్వజర్వేటివ్ టాక్ రేడియో షో‌కు సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారని సీబీఎస్ న్యూస్ తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)