ఏపీ లిక్కర్ స్కాం కేసు: ఎంపీ మిథున్ రెడ్డికి జైల్లో కల్పించమన్న ప్రత్యేక సదుపాయాలు ఏంటి, ఏయే ఖైదీలకు ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తారు?

ఫొటో సోర్స్, Peddireddy Midhun Reddy/FB
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఏపీ లిక్కర్ స్కాం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి 'ప్రత్యేక' సదుపాయాలు కల్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.
ప్రస్తుతం మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.
''ఇంటి భోజనం, అల్పాహారం, మెడిసిన్స్ (మందులు), ప్రొటీన్ పౌడర్, దోమతెర, యోగా మ్యాట్, ప్యూరిఫైడ్ వాటర్ బాటిల్స్, దిండ్లు'' వంటివి తెచ్చుకునేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది.
అంతేకాదు, ఇనుప మంచం, పరుపు, కుర్చీ, టీవీ ఉన్న గది, వార్తా పత్రికలు, టేబుల్, తెల్ల కాగితాలు, పెన్నులు కూడా ఇవ్వాలని రాజమండ్రి జైలు అధికారులకు స్పష్టం చేసింది.
గతంలో చంద్రబాబు నాయుడు సహా వివిధ ప్రముఖులకు స్పెషల్ క్లాస్ కేటగిరీ కల్పించేందుకు కోర్టులు ఆదేశాలు జారీ చేశాయి.
ఇలా ఏ ప్రముఖులు లేదా ప్రజాప్రతినిధులు అరెస్టయినా వారిని జైలులో 'వీఐపీ'లుగా పరిగణిస్తారా? ఏ సందర్భంలో వారికి 'ప్రత్యేక' సదుపాయాలు కల్పించేందుకు అనుమతిస్తారు? అలా అనుమతిస్తే వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు?.


ఫొటో సోర్స్, SB Rajeswara Rao

దేశంలో 1894లో ప్రిజన్స్ యాక్ట్ (జైళ్ల చట్టం) అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత వివిధ సందర్భాల్లో ఆ చట్టానికి సవరణలు జరిగాయి. అయితే జైళ్ల శాఖ నిబంధనావళిలో ఎక్కడా 'వీఐపీ ఖైదీ' అని ఉండదని జైళ్ల శాఖ మాజీ ఐజీ సైదయ్య చెప్పారు.
"ఖైదీకి ఉన్న ఆర్థిక స్థాయి, స్థోమత, జీవనశైలి, హోదాను పరిశీలించి స్పెషల్ క్లాస్ ప్రిజనర్ (ప్రత్యేక శ్రేణి ఖైదీ)గా పరిగణిస్తారు. అందుకు సదరు వ్యక్తి ముందుగా న్యాయస్థానం నుంచి ప్రత్యేక అనుమతి తెచ్చుకోవాలి" అని చెప్పారు.
జైళ్లలో ప్రముఖుల కోసం ప్రత్యేక బ్యారక్లు ఉంటాయి. స్పెషల్ క్లాస్ కింద కోర్టు పరిగణిస్తే.. జైలులో ప్రత్యేక గది, బెడ్, రీడింగ్ టేబుల్, కప్బోర్డు, ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ వంటి సౌకర్యాలు కల్పిస్తారు.
"ఇంటి నుంచి సరుకులు తెప్పించుకుని జైలులో వండించుకుని తినొచ్చు. వంట వండే వ్యక్తిని జైలు తరపున ఇస్తారు లేదా న్యాయస్థానం అనుమతితో ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవచ్చు" అని సైదయ్య వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images

ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలనే నిబంధన జైళ్ల శాఖ పరిధిలోనిది కాదని తెలంగాణ జైళ్ల శాఖ మాజీ ఐజీ నర్సింహ చెప్పారు.
"కోర్టు అనుమతి మేరకే ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు. గదులకు అనుసంధానంగా మరుగుదొడ్లు ఉంటాయి. బట్టలు ఉతకడానికి ప్రత్యేకంగా మనిషిని ఇస్తారు" అని ఆయన చెప్పారు.
అయితే.. స్పెషల్ క్లాస్ అనేది అడిగిన వారందరికీ ఇవ్వకపోవచ్చని జైళ్ల శాఖాధికారులు చెబుతున్నారు. ఈ సౌకర్యాలు కావాలంటే ఐటీ రిటర్న్స్ సహా కోర్టు అడిగిన అన్ని రకాల పత్రాలు సమర్పించాలన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ప్రజాప్రతినిధులు గానీ, ప్రముఖులు గానీ జైలులో ఖైదీలుగా లేదా రిమాండ్ ఖైదీలుగా ఉన్నప్పుడు వారికి కేటాయించిన భద్రతా సిబ్బంది అక్కడ కూడా విధులు నిర్వర్తిస్తారా? అని అడిగితే.. 'అలా కుదరదు' అని జైలు అధికారులు బదులిచ్చారు.
ఒకసారి జైలులోకి ప్రవేశించిన తర్వాత వారి భద్రత పూర్తిగా జైళ్ల శాఖపైనే ఉంటుంది. వారికి కేటాయించిన లేదా వారి వ్యక్తిగత భద్రతా సిబ్బందిని లోనికి రానివ్వరు.
ఆయుధాలతో జైలులోకి రావడం చట్ట విరుద్ధం, అందుకే భద్రతా సిబ్బందిని రానివ్వరు.

ఫొటో సోర్స్, Getty Images

ఒక వ్యక్తిని రిమాండ్ చేశాక లేదా శిక్ష విధించిన తర్వాత జైలుకు తరలిస్తారు. జైలులో ఖైదీకి నంబరు కేటాయించే విధానం వరుస క్రమ సంఖ్య ప్రకారమే ఉంటుంది.
ప్రధానంగా ఖైదీలను నాలుగు రకాలుగా విభజిస్తారు.
- రిమాండ్ ప్రిజనర్స్ (రికార్డులో ఆర్.పి. అక్షరాల తర్వాత నంబర్ ఉంటుంది.)
- కన్విక్టెడ్ ప్రిజనర్స్ (సి.పి. అక్షరాల తర్వాత నంబర్)
- డిటెన్యూ ప్రిజనర్స్ (కలెక్టర్ లేదా ఆర్డీవో, తహసీల్దార్ రిమాండ్ చేసిన వారిని ఈ విధంగా పిలుస్తారు.)
- విమెన్ ప్రిజనర్స్ (మహిళా ఖైదీలు)
రిమాండ్ అంటే, "నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తిపై కచ్చితమైన ఆధారం దొరికితే పోలీసులు అతన్ని అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు లేదా కోర్టులో ప్రవేశ పెడతారు. దానిని రిమాండ్ చేయడం అంటారు. అక్కడ న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తే జైలుకు తరలిస్తారు. అలాగే, పోలీసులు విచారణ కోసం కస్టడీకి అడిగితే ఇవ్వొచ్చు" అని తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది చింతపల్లి లక్ష్మీనారాయణ బీబీసీతో చెప్పారు.
"గతంలో నక్సలైట్లు ఉన్నప్పుడు ఎన్ఎక్స్ ప్రిజనర్స్ కేటగిరీ ఉండేది. ఇప్పుడు వారికి కూడా పైన చెప్పిన నాలుగు కేటగిరీల కిందనే నంబర్లు కేటాయిస్తున్నారు. జైలు ఏర్పాటు చేసినప్పటి నుంచి వస్తున్న ఖైదీల క్రమసంఖ్య ఆధారంగా ఆయా కేటగిరీల కింద నంబర్ కేటాయిస్తారు" అని తెలంగాణ జైళ్ల శాఖ మాజీ డీఐజీ ఒకరు చెప్పారు.

ఫొటో సోర్స్, SB Rajeswara Rao

సాధారణంగా జైళ్లు మూడు రకాలుగా ఉంటాయని జైళ్ల శాఖ మాజీ ఐజీ నర్సింహ చెప్పారు. అవి..
సబ్ జైలు
జిల్లా జైలు (జిల్లా కారాగారం)
సెంట్రల్ జైలు (కేంద్ర కారాగారం)
ఇవి కాకుండా ఓపెన్ జైలు, స్పెషల్ జైలు, విమెన్ జైలు, బోర్సటల్ స్కూల్, ఇతర కేటగిరీలో జైళ్లూ దేశంలో ఉన్నాయని చెప్పారు.
నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి పడే శిక్షలు, రిమాండ్ ఆధారంగా ఆయా జైళ్లకు పంపిస్తారు.
సబ్ జైలు:
సాధారణంగా సబ్ జైలులో రిమాండ్ ఖైదీలను ఉంచుతారు. నెల రోజుల్లోపు శిక్ష పడిన ఖైదీలను కూడా ఈ జైళ్లలో ఉంచుతారు.
జిల్లా జైలు:
నెల రోజులకు పైన, రెండేళ్లలోపు శిక్ష పడిన ఖైదీలను ఇక్కడ ఉంచుతారు. అలాగే జిల్లా జైలు లేదా సెషన్స్ కోర్టులో ట్రయల్స్ నడుస్తున్నప్పుడు రిమాండ్ ఖైదీలను ఈ జైలులో ఉంచుతారు.
సెంట్రల్ జైలు:
రెండేళ్లకు పైగా శిక్ష పడిన ఖైదీలను సెంట్రల్ జైలులో ఉంచుతారు.
"కొన్నిసార్లు ప్రముఖులు వివిధ కేసుల్లో రిమాండ్ ఖైదీలుగా ఉంటారు. అలాంటప్పుడు భద్రత దృష్ట్యా వారిని సబ్ జైలు, జిల్లా జైళ్లలో ఉంచడం సాధ్యం కాదు. అందుకే భద్రత ఎక్కువగా ఉన్న సెంట్రల్ జైలుకు తరలిస్తారు.
గతంలో చంద్రబాబు, ప్రస్తుతం మిథున్ రెడ్డి విషయంలోనూ కోర్టు విజయవాడలో ఉన్నప్పటికీ, రిమాండ్ విధించిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు" అని తెలంగాణ జైళ్ల శాఖలో డీఐజీగా పనిచేసి రిటైర్ అయిన అధికారి ఒకరు బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

సబ్ జైలు, జిల్లా జైలు, సెంట్రల్ జైళ్లలో ఖైదీల విభజన పరంగానే కాకుండా వసతుల పరంగానూ కొన్ని తేడాలను గమనించవచ్చని అధికారులు చెబుతున్నారు.
జిల్లా జైలు, సెంట్రల్ జైళ్లలో లైబ్రరీ, ప్లే ఏరియా, యోగా, వ్యాయామ సాధన శిబిరం వంటివి ఉంటాయి. ఇలాంటి సౌకర్యాలు సబ్ జైళ్లలో ఉండవు.
"సబ్ జైలు అనేది రెండు లేదా మూడు బ్యారక్లతో ఉంటుంది. ఇక్కడ 20 లేదా 30 మంది వరకు ఖైదీలు ఉంటారు. జిల్లా జైలులో 200 నుంచి 400 మందికి సరిపడా బ్యారక్లు ఉంటాయి. ఇక సెంట్రల్ జైల్లో బ్యారక్లు 1000 నుంచి 2000 మంది పట్టేలా ఉంటాయి" అని మాజీ ఐజీ సైదయ్య చెప్పారు.
"జిల్లా జైలులో ప్రత్యేకంగా వైద్యులు ఉంటారు. జైలులోనే హాస్పిటల్ ఉంటుంది. కొన్ని వృత్తి శిక్షణ పరిశ్రమలు ఉంటాయి. సబ్ జైలులో ఈ తరహా సౌకర్యాలు ఉండవు.
ఇక భోజనం, ములాఖత్ వంటి విషయంలో అన్ని జైళ్లలో ఖైదీలందరికీ ఒకే తరహా నిబంధనలు ఉంటాయి" అని సైదయ్య చెప్పారు.
అలాగే, బ్యారక్ల సైజును బట్టి కొన్నింటిలో నలుగురు ఖైదీలే ఉంటారు. మరికొన్నింటిలో 20 నుంచి 25 మంది వరకు ఉంచుతారు.
ములాఖత్: ములాఖత్ అంటే జైలులో రిమాండ్ లేదా శిక్ష పడిన వ్యక్తిని కుటుంబ సభ్యులు, బంధువులు లేదా న్యాయవాదులు కలవడం.
ములాఖత్ విషయంలో ముందుగా ఖైదీగా ఉన్న వ్యక్తి అంగీకారం అడుగుతారు. ములాఖత్ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఉంటుంది. ములాఖత్కు అనుమతించే విషయం కొన్ని సందర్భాల్లో జైలు సూపరింటెండెంట్పై ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఈ విషయంపై సైదయ్య బీబీసీతో మాట్లాడుతూ.. "రిమాండ్ ఖైదీకి వారానికి రెండుసార్లు, శిక్ష పడిన ఖైదీకి వారానికొకసారి ములాఖత్కు అవకాశం ఉంటుంది. న్యాయవాదులు ఎప్పుడైనా రావొచ్చు" అన్నారు.
జైలు పరిమాణాన్ని బట్టి సెక్యూరిటీ ఆధారపడి ఉంటుంది. సబ్ జైలుకు భద్రతగా పది మంది వరకూ సిబ్బంది ఉంటారు. ఇక్కడ ఎస్సై లేదా సీఐ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుంది.
జిల్లా జైలుకు 50-60 మందితో భద్రత ఉంటుంది. దీనికి డీఎస్పీ లేదా ఏఎస్పీ స్థాయి అధికారి సూపరింటెండెంట్గా ఉంటారు.
సెంట్రల్ జైలులో 150 నుంచి 200 మంది వరకు భద్రతా సిబ్బంది ఉంటారు. ఇక్కడ ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














