Future City: ఎఫ్‌సీడీఏ భవన నిర్మాణానికి తెలంగాణ సీఎం శంకుస్థాపన, ఈ కొత్తనగరం వచ్చేదెక్కడ, హైదరాబాద్‌కి ఎటువైపు ఉంటుంది?

హైదరాబాద్, సైబరాబాద్, ఫ్యూచర్ సిటీ, రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ భవన నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈరోజు (సెప్టెంబర్28,2025) శంకుస్థాపన చేశారు.

మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఇందుకు అవసరమైన భూ సేకరణ చేస్తామని ప్రభుత్వం చెబుతుండగా.. రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్న ఎత్తుగడంటూ విమర్శలు చేస్తోంది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ.

అసలేమిటీ ఫ్యూచర్ సిటీ? ఇదెక్కడ రాబోతోంది? హైదరాబాద్‌కి ఎటువైపు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఏమిటీ ఫ్యూచర్ సిటీ..

హైదరాబాద్ నగరం మొదటగా ఏర్పడింది. చారిత్రక ఆనవాళ్లు పరిశీలిస్తే.. నగరానికి భాగ్యనగరం లేదా ముత్యాల నగరంగా కూడా పేరుంది. హైదరాబాద్‌ను 1591లో మొహమ్మద్ కులీకుతుబ్ షా కట్టినట్లుగా చారిత్రక అధారాలున్నాయి.

1990ల చివర్లో సైబరాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందుతూ వచ్చింది. దీన్ని హైటెక్ సిటీగా పిలుస్తుంటారు. అప్పట్నుంచి హైదరాబాద్ నగరాన్ని మూడు ప్రాంతాలుగా పిలుస్తున్నారు ఇక్కడి ప్రజలు.

గత 20, 30 ఏళ్లుగా హైదరాబాద్ నగరం విస్తరిస్తోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాలు నివాసప్రాంతాలుగా రూపాంతరం చెందాయి.

2011 జనాభా లెక్కల ప్రకారం 67,31,790 మంది హైదరాబాద్ నగరంలో నివసిస్తుండగా.. ఇప్పుడు ఆ సంఖ్య కోటికి చేరి ఉంటుందని అంచనా.

హైదరాబాద్ శివారు ప్రాంతాలు వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొత్త నగరం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 650 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. దీనికితోడు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) 7,257 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది.

ఇప్పుడు హెచ్ఎండీఏలోని కొన్ని ప్రాంతాలను విడదీసి ఫ్యూచర్ సిటీగా ఏర్పాటు చేస్తున్నామని చెబుతోంది ప్రభుత్వం.

హైదరాబాద్, ఫ్యూచర్ సిటీ, రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, UGC

ఫ్యూచర్ సిటీ ఎక్కడ రానుంది?

ఔటర్ రింగు రోడ్డు వెలుపల ఏర్పాటు కానుంది ఫ్యూచర్ సిటీ. ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్-నాగార్జున్ సాగర్ హైవే నుంచి హైదరాబాద్- శ్రీశైలం హైవే మధ్య ఉన్న ప్రాంతమిది.

తెలంగాణ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీజీఐఐసీ) ఆధ్వర్యంలో దీన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనిని మొత్తం 12 జోన్లుగా విభజించనున్నారు.

''ఫ్యూచర్ సిటీ అనేది ప్రణాళికాబద్దమైన నగరం. మల్టీమోడల్ కనెక్టివిటీ.. బస్సు, మెట్రో రైల్, మోడ్రన్ అర్బన్ ఎమినిటీస్, రేడియల్ రోడ్స్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, క్రికెట్ స్టేడియం, ఎడ్యుకేషన్ హబ్, హెల్త్ హబ్ వస్తాయి.'' అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

గతంలో దీన్ని ఫోర్త్ సిటీగా పిలవగా.. ఇప్పుడు ఫ్యూచర్ సిటీగా పేరుమార్చింది ప్రభుత్వం.

ఇప్పటికే ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దీనికి ఎయిర్ పోర్టు నుంచి మెట్రో రైల్ కనెక్టివిటీ ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. అందుకోసం క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేశారు.

అయితే, ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఉన్నాయని.. ఫ్యూచర్ సిటీ అవసరం లేదని అభిప్రాయపడ్డారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి.

''ప్రస్తుతం ఉన్న నగరంలో చాలా వరకు బస్తీలు, కాలనీల్లో మౌలిక వసతులు లేవు. ముందుగా వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి'' అన్నారాయన.

హైదరాబాద్, ఫ్యూచర్ సిటీ, రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, UGC

ఫ్యూచర్ సిటీ పరిధి..

ఈ ఏడాది మార్చి 12వ తేదీన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 765.28 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇది ఉంటుంది.

మొత్తం 3 అసెంబ్లీ నియోజకవర్గాలు, 7 మండలాల పరిధిలో 56 గ్రామాలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ ఏరియా నుంచి మినహాయించి, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కిందకు తీసుకొస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది.

ఇందులో రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆమనగల్, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం మండలాలున్నాయి.

ఫ్యూచర్ సిటీ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి చైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు.

వైస్ చైర్మన్‌గా మునిసిపల్ శాఖ మంత్రి, సభ్యులుగా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ(ఫైనాన్స్), పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్, టీజీఐఐసీసీ ఎండీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, డీటీసీపీ-హైదరాబాద్, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ ఉంటారు.

దీనిని భారతదేశ మొదటి నెట్ జీరో స్మార్ట్ సిటీగా పేర్కొన్నారు.

‘‘లైవ్, లెర్న్, వర్క్, ప్లే’’ అనే కాన్సెప్ట్‌తో పరిశ్రమలు, పాఠశాలలు, ఆస్పత్రులు, పార్కులు, షాపింగ్ సెంటర్లు ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. పచ్చదనం, స్థిరమైన అభివృద్ధిలో భాగంగా స్పాంజ్ పార్కులు, అర్బన్ ఫారెస్టులు, జీరో డిశ్చార్జ్ వాటర్ సిస్టమ్స్, నీటి పునర్వినియోగం, సహజవనరుల సంరక్షణ ఉంటాయి.

ఉద్యోగాలు, పెట్టుబడుల కింద లక్షల కొద్దీ ఉద్యోగాల సృష్టి, తెలంగాణను ఇన్నోవేషన్, పెట్టుబడుల కేంద్రంగా మార్చడం, ప్రపంచబ్యాంకు, జేఐసీఏ వంటి అంతర్జాతీయ భాగస్వాములను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

ఈ ప్రాజెక్టు అమలులో ఎదురయ్యే అడ్డంకులను తొలగించడం, అనుమతులను వేగంగా ఇవ్వడం, సింగిల్ విండో ద్వారా పారదర్శకత పాటించడం వేగవంతమైన, న్యాయమైన , సమానమైన పాలన అందించడం తన పాత్ర అని ప్రభుత్వం పేర్కొంది.

హైదరాబాద్, ఫ్యూచర్ సిటీ, రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, TG govt

''చండీగఢ్ తర్వాత దేశంలో ప్రణాళికాబద్దమైన నగరం మరోటి రాలేదు. ఫ్యూచర్ సిటీ ప్రణాళికాబద్దంగా ఉంటుంది. దీన్ని లక్ష ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించాం. అన్ని రకాల పరిశ్రమలు, సాంకేతిక నైపుణ్యంతో పోటీ పడేలా ప్రణాళికలు రచిస్తున్నాం.'' అని చెప్పారు రేవంత్ రెడ్డి.

మరోవైపు, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీకి తెలంగాణ బడ్జెట్ 2025-26లో రూ.4701.92 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.

అయితే, ఫ్యూచర్ సిటీకి ఏ ప్రాతిపదికన భూములు సేకరిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

'' గతంలో హెచ్ఎండీఏకు విధివిధానాలు ఉండేవి. ఇప్పుడు అలాంటివి చెప్పడం లేదు. 3000 ఎకరాలకు మరోసారి నోటిఫికేషన్ ఇచ్చారు. సగం గ్రామాలు ఫ్యూచర్ సిటీలో కలిపి.. మిగిలిన గ్రామాలను బయట ఉంచి అయోమయానికి గురిచేస్తోందీ ప్రభుత్వం'' అన్నారు సబితా రెడ్డి.

హైదరాబాద్, ఫ్యూచర్ సిటీ, రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, UGC

ఫార్మాసిటీ ఏమైంది?

గతంలో కందుకూరు, యాచారం మండలాల పరిధిలో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పట్లో భూసేకరణ కూడా చేపట్టింది.

మొత్తం 19,333 ఎకరాల్లో 5.6 లక్షల మందికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి కల్పించే ఉద్దేశంతో హైదరాబాద్ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దీనికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్) హోదాను సైతం ఇచ్చింది.

అయితే, ఈ ఫార్మాసిటీ స్థానంలోనే ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తోంది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.

ఫార్మాసిటీ రద్దు చేస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో నిరుడు సెప్టెంబర్‌లో ప్రభుత్వం నివేదిక సమర్పించింది. దాని ప్రకారం, మొత్తం ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని, 1700 ఎకరాల్లో మాత్రమే ఫార్మసిటీ కొనసాగుతుందని నివేదించింది. అది కూడా గ్రీన్ ఫార్మాసిటీగా కొనసాగుతుందని చెప్పింది.

''నెట్ జీరో నగరంగా.. అంటే కాలుష్యం లేని నగరంగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతాం'' అని చెప్పారు రేవంత్ రెడ్డి.

కానీ, ఇప్పటికే ఉన్న నగరాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు పద్మనాభరెడ్డి.

''నగరం కట్టడం అంటే ఒక్కరోజులో అయ్యేది కాదు, ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్, అప్పుల నేపథ్యంలో కొత్త నగరానికి ఖర్చు పెట్టడం ఏ మేరకు సాధ్యమనేది ఆలోచించాలి. దీనికి చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది'' అని చెప్పారు.

మరోవైపు, ఫ్యూచర్ సిటీ విషయంపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్. తమ భూములకు రియల్ ఎస్టేట్ పెంచుకునేందుకే ఫ్యూచర్ సిటీని తీసుకొచ్చారని ఫిబ్రవరిలో రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌లో జరిగిన సభలో అన్నారు.

ఈ ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖండించింది.

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఫ్యూచర్ సిటీ ప్రతిపాదన చేశామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు చెప్పారు.

''ఫ్యూచర్ సిటీ ద్వారా ఎకనమిక్ గ్రోత్ తీసుకురావాలని భావిస్తున్నాం'' అన్నారాయన.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)