సుదీక్ష కోణంకి: ఈ భారత పౌరురాలి మిస్సింగ్ కేసులో డొమినికన్ రిపబ్లిక్ పోలీసులు ఏం చేస్తున్నారు?

ఫొటో సోర్స్, Defensa Civil Dominicana
- రచయిత, రాచెల్ లుక్కర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
డొమినికన్ రిపబ్లిక్లో కొద్దిరోజుల కిందట అదృశ్యమైన భారతీయ సంతతికి చెందిన సుదీక్ష కోణంకి చనిపోయినట్లు ప్రకటించాలని ఆమె కుటుంబం అక్కడి పోలీసులను కోరింది.
అమెరికాలోని పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థి అయిన సుదీక్ష కోణంకి(20) గత రెండు వారాల నుంచి కనిపించడం లేదు. అప్పటి నుంచి పోలీసులు సుదీక్ష కోసం గాలింపు చేపట్టారు.
డొమినికన్ రిపబ్లిక్లో మార్చి 6న తెల్లవారుజామున 4:00 గంటల ప్రాంతంలో ఆమె చివరిసారిగా ఒక హోటల్ సమీపంలో కనిపించారు.
అయితే, రెండు వారాల పాటు వెతికినా సుదీక్ష ఆచూకీ దొరకలేదు. దీంతో, ఆమె చనిపోయినట్లు ప్రకటించాలని కుటుంబ సభ్యులు అభ్యర్థించినట్లు డొమినికన్ రిపబ్లిక్ పోలీసులు బీబీసీకి ధ్రువీకరించారు. కానీ, అంతకన్నా ఎక్కువగా వివరాలు చెప్పలేదు.
సుదీక్ష నీటిలో మునిగిపోయిందేమోనని పోలీసులు రెండు వారాలుగా గాలిస్తున్నారు. అదే సమయంలో ఆమెపై ఏదైనా అఘాయిత్యం జరిగి ఉంటుందా అన్న విషయాన్ని పోలీసులు తోసిపుచ్చలేదు.

ఎవరీ సుదీక్ష కోణంకి?
సుదీక్ష కోణంకి పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిని. అక్కడ ఆమె జీవశాస్త్రం, రసాయన శాస్త్రం చదువుతున్నారు.
లౌడౌన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం చెప్పిన వివరాల ప్రకారం.. సెలవులు రావడంతో సుదీక్ష తన ఐదుగురు స్నేహితురాళ్లతో కలిసి డొమినికన్ రిపబ్లిక్లోని పుంటా కానాలోని ఒక రిసార్ట్కు వెళ్లారు.
సుదీక్ష కోణంకి భారత పౌరురాలు, అమెరికాలో పర్మినెంట్ రెసిడెంట్ కూడా. కుటుంబంతో కలిసి ఆమె వర్జీనియా రాష్ట్రంలోని చాంటిల్లీ ప్రాంతంలో ఉంటున్నారు.

ఫొటో సోర్స్, Defensa Civil Dominicana
చివరిసారిగా ఎక్కడ కనిపించారు?
సుదీక్ష మార్చి 6న తెల్లవారుజామున చివరిసారిగా కనిపించారు. ఆమె స్నేహితులతో కలిసి బీచ్ వైపు వెళుతున్నట్లు నిఘా వీడియోలో కనిపించింది. ఆ సమయంలో ఆమెతో పాటు ఐదుగురు యువతులు, ఇద్దరు అమెరికన్ యువకులు కనిపించారు.
సుదీక్ష ఆ యువకులలో ఒకరితో బీచ్లోనే ఉండిపోయారని, మిగిలిన వారు హోటల్కు తిరిగి వచ్చారని డొమినికన్ రిపబ్లిక్ పోలీసులు అమెరికాలో బీబీసీ భాగస్వామి వార్తాసంస్థ సీబీఎస్కు చెప్పారు.
బీచ్లో ఉన్నప్పుడు ఒక అల తమ ఇద్దరినీ తాకిందని చివరిగా ఆమెతో ఉన్న జాషువా రీబే అనే యువకుడు చెప్పారని డొమినికన్ రిపబ్లిక్ అధ్యక్షుడు లూయిస్ అబినాదర్ తెలిపారు.
జాషువా రీబే మిన్నెసోటాలోని సెయింట్ క్లౌడ్ స్టేట్ యూనివర్సిటీలో సీనియర్ విద్యార్థి. జాషువా రీబే తల్లిదండ్రులు సీబీఎస్ న్యూస్కు ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సుదీక్ష వీలైనంత త్వరగా దొరకాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
"ఇది మా అందరికీ బాధాకరమైన పరిస్థితి. దర్యాప్తు పారదర్శకంగా, సక్రమంగా సాగుతుందని మేం విశ్వసిస్తున్నాం'' అని వారు చెప్పారు.

ఫొటో సోర్స్, Defensa Civil Dominicana
దర్యాప్తు అధికారులు ఏం చెబుతున్నారు?
సుదీక్ష మరణించినట్లు ప్రకటించాలని ఆమె కుటుంబం నుంచి అభ్యర్థన అందిందని డొమినికన్ రిపబ్లిక్ పోలీసులు బీబీసీతో చెప్పారు. తప్పిపోయిన విద్యార్థిని కోసం చాలా గంటలుగా వెతుకుతున్నట్లు అధికారులు తెలిపారు.
పోలీసులు వెతకాల్సిన ప్రాంతాలను విభజించి, డ్రోన్ సాయంతో వీడియో తీశారు. ఆ ఫుటేజీని కమాండ్ సెంటర్కు పంపుతున్నారు. అక్కడ సముద్రంలో వస్తువులను వెతికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పైలట్లు ఫుటేజీని పరిశీలిస్తున్నారు. సెర్చ్ బృందాలు సుదీక్ష కోసం ఓవైపు నీటిలో, మరోవైపు భూమిపైనా వెతుకుతున్నాయి.
సుదీక్ష అదృశ్యంలో ఏదైనా నేరం జరిగిందా లేదా అనే విషయంలో స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు. బీచ్లో రక్తం లేదా హింసకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదన్నారు.
సుదీక్ష కేసులో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్, డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇంటర్పోల్ నోటీసులు
సుదీక్ష అదృశ్యమైన తర్వాత ఇంటర్పోల్ (ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్) గ్లోబల్ అలర్ట్ను జారీ చేసింది.
తప్పిపోయిన వ్యక్తుల (కిడ్నాపైన లేదా కారణం తెలియని అదృశ్యం) కోసం ఎల్లో నోటీసు జారీచేస్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)













