సముద్రంలో దొరికిన బాటిళ్లలోని ద్రవం తాగి నలుగురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం..

సముద్రంలో కొట్టుకు వస్తున్న బాటిల్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అలెక్స్ ఫిలిప్స్
    • హోదా, బీబీసీ న్యూస్

చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు సముద్రంలో సీసాలు దొరికాయి. ఆ బాటిళ్లలో ఉన్న నీళ్ల లాంటి ద్రవం ఉంది. అది తాగడంతో నలుగురు చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ ఘటన శ్రీలంకలో జరిగింది.

ఈ బాటిళ్లలో ఉన్నది ఏంటన్నది ఇంకా తెలియలేదు.

శ్రీలంక దక్షిణ తీర ప్రాంతంలోని ద్వీప పట్టణం తంగల్లేకు సుమారు 320 నాటికల్ మైళ్ల దూరంలో మత్స్యకారులకు ఈ బాటిళ్లు దొరికినట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ బాటిళ్లలో ఉన్నది మద్యం అనుకుని మత్స్యకారులు తాగి ఉంటారని శ్రీలంక నేవి తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

బాధితులను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు నేవీ పలు విధాలా ప్రయత్నించిందని శ్రీలంక మత్స్య శాఖ డైరెక్టర్ జనరల్ సుశాంత కహవాత్ చెప్పారు.

వారిని ఒడ్డుకు తీసుకొచ్చి చికిత్స అందించేందుకు సమయం లేకపోవడంతో, డెవాన్ అనే చేపలు పట్టే ఓడలోనే నేవీ వారికి చికిత్స అందించినట్లు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల కోసం కహవాత్‌ను, శ్రీలంక నేవీని బీబీసీ సంప్రదించింది.

అదే ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతర సిబ్బందికి కూడా ఈ బాటిళ్లను మత్స్యకారులు అందించినట్లు నేషనల్ న్యూస్ స్టేషన్ అదా డెరనాకు కహవాత్ చెప్పారు.

ఈ సీసాల్లోని ద్రవాన్ని తాగొదని ఆ సిబ్బందికి తెలియజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

మరో ఓడ సాయంతో ఆ మత్స్యకారుల ఓడను నెట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చినట్లు శ్రీలంక నేవీ తెలిపింది.

ఆ బాటిళ్లలో ఉన్నది ఏంటో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)