బిల్ గేట్స్ ముచ్చట ఖరీదు రూ.4600 కోట్లు - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు, మైక్రో సాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 4600 కోట్ల రూపాయలతో అత్యంత విలాసవంతమైన విహార నౌకను కొన్నారంటూ ఆంధ్రజ్యోతి ఓ వార్తను ప్రచురించింది.
"గత ఏడాది మొనాకోలో జరిగిన యాట్ షోలో ఆ నౌక పూర్తిగా పర్యావరణ అనుకూలమన్న సంగతి తెలిసిన వెంటనే ముచ్చటపడి ఆర్డర్ ఇచ్చేశారు. సుమారు 370 అడుగులు ఉండే ఈ నౌక పేరు ఆక్వా. అందులో నాలుగు గెస్ట్ రూంలు, రెండు వీఐపీ గదులు, యజమాని సూట్ ఉంటాయి.


ద్రవ హైడ్రోజన్తో నడిచే ఈ నౌకలో ఒక్కసారి ఇంధనాన్ని నింపితే 3750 మైళ్లు ప్రయాణిస్తుంది. మొత్తం సిబ్బంది సంఖ్య 31 కాగా 14 మంది అతిథులకు సరిపడా ఏర్పాట్లున్నాయి.
జిమ్, యోగారూమ్, మేకప్ రూమ్, స్విమ్మింగ్ పూల్ అలాగే నౌక నుంచి సముద్రంలోకి వెళ్లి విహరించేందుకు రెండు చిన్న బోట్లు కూడా ఉన్నాయి" అని ఆంధ్రజ్యోతి ఈ వార్తలో వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
కరోనా ముప్పు భారత్కు కూడా ఎక్కువే
చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనావైరస్ భారత్కు వ్యాప్తి చెందే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయంటూ ఓ తాజా అధ్యయనం వెల్లడించిందన్న వార్తను ఈనాడు ప్రచురించింది. ఈ వైరస్ ముప్పు అధికంగా ఉన్న 20 దేశాల జాబితాలో భారత్ ఉందన్నది ఈ వార్త సారాంశం.
జర్మనీకి చెందిన హంబోల్ట్ విశ్వవిద్యాలయం, రాబర్ట్ కోచ్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. భారత్లో దిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోచి విమానాశ్రయాలకు కొంత ప్రమాదం పొంచి ఉందని తెలిపింది. కరోనా వ్యాపించే అవకాశం ఉన్న 20 దేశాల్లో భారత్ 17వ స్థానంలో ఉందని ఆ నివేదిక వెల్లడించినట్టు ఈనాడు ఈ వార్తలో స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, MekapatiGoutham/facebook
అనంతపురంలో బుల్లెట్ల తయారీ పరిశ్రమ
రక్షణ రంగంలో వినియోగించే బుల్లెట్ల (తూటాలు) తయారీ కేంద్రాన్ని స్టంప్ అండ్ సోమప్ప స్ప్రింగ్స్ (ఎస్ఎస్ఎస్) సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనుందంటూ ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారని సాక్షి ఓ వార్తను ప్రచురించింది.
580 కోట్ల రూపాయల పెట్టుబడితో అనంతపురం జిల్లాలో ఓ యూనిట్ను ఏర్పాటు చేస్తారని మంత్రి చెప్పారు. లక్నోలో జరిగిన డిఫెన్స్ ఎక్స్పో సందర్భంగా ఎస్ఎస్ఎస్ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపామని మంత్రి తెలిపారు.
మూడు నెలల్లో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించినట్లు కూడా మంత్రి చెప్పారని సాక్షి తన వార్తలో తెలిపింది.

ఫొటో సోర్స్, FACEBOOK/KCR
పెట్టబడి వ్యయంలో మనమే టాప్
పెట్టుబడి వ్యయంలో తెలంగాణ రాష్ట్రమే అగ్ర స్థానంలో ఉందంటూ నమస్తే తెలంగాణ ఓ వార్తను ప్రచురించింది.
"ఈ విషయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పక్కా ప్రణాళికను రచిస్తున్నారు. సంక్షేమంతో పాటు సంపద సృష్టికి నిధులను పెంచుతూ తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా కేసీఆర్ నిలిపారు.
పెట్టుబడి వ్యయం కింద ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు కేవలం 59 వేల కోట్లను వెచ్చించగా, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన ఐదేళ్లలో లక్షా 60 వేల కోట్లను ఖర్చు చేసి దేశంలోనే అగ్రభాగాన తెలంగాణ నిలిచింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 2 లక్షల కోట్లకు చేరచ్చని అధికారులు అంచనావేస్తున్నారు. చాలా రాష్ట్రాలు తమ రెవెన్యూ వ్యయంలో సుమారు 10 నుంచి 20 శాతం లోపే వెచ్చిస్తుండగా తెలంగాణలో ఇది 30 శాతానికి చేరింది" అని నమస్తే తెలంగాణ ఈ కథనంలో చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి
- పోర్న్ సైట్లో తనను రేప్ చేసిన వీడియో తొలగించాలని బాధితురాలి పోరాటం
- కరోనావైరస్.. సార్స్ వైరస్ని మించిపోతోందా
- పోలవరం ముందుకు వెళ్తోందా, లేదా? అప్పటి నుంచి ఇప్పటికి పురోగతి ఉందా?
- జింకల వేటకు పెంపుడు చిరుతలు... క్రూర మృగాలనే మచ్చిక చేసుకున్న కొల్హాపూర్ వాసులు
- అల వైకుంఠపురములో.. సరిలేరు నీకెవ్వరు చిత్రాల రికార్డులతో పబ్లిసిటీ వార్... కలెక్షన్ల ఫిగర్లకు బేస్ ఏంటి?
- పీవీ సింధు: BBC Indian Sportswoman of the Year నామినీ
- బీరు వాళ్లిద్దరినీ మళ్ళీ కలిపింది
- కశ్మీర్ జర్నలిస్టులు రోజు కూలీకి వెళ్తున్నారు... ఎందుకో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









