ఒడిశా: హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి బస్సులో మంటలు... తొమ్మిది మంది మృతి

ఒడిశా
ఫొటో క్యాప్షన్, హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి ప్రమాదానికి గురైన బస్సు

ఒడిశా గంజాం జిల్లాలో నిశ్చితార్థానికి వెళ్ళి వస్తున్న బంధువులతో ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు.

బ్రహ్మాపూర్ మండలంలోని గోలంతర గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. 11 కేవీ విద్యుత్ తీగలు బస్సుకు తగలడంతో ఈ దారుణం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారని స్థానిక పోలీసు అధికారి బీబీసీకి చెప్పారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ బస్సులోని ప్రయాణికులంతా తమ బంధువుల ఇంట్లో నిశ్చితార్థం వేడుకకు హాజరై తిరిగి వస్తున్నారు.

గంజాం జిల్లా కలెక్టర్ విజయ అమృత్ కులాంగే, "గోలంతర వద్ద బస్సు 11 కేవీ విద్యుత్ వైర్లకు తగలడంతో వెంటనే మంటలు వ్యాపించాయి. ఆ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. మరో 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు" అని ఏఎన్ఐ వార్తా సంస్థకు చెప్పారు.

ఒడిశా బస్సు ప్రమాదం

గాయపడిన వారిని ఎంకేసీజీ మెజికల్ కాలేజికి చికిత్స కోసం పంపించినట్లు కూడా ఆయన తెలిపారు. అయితే, మరి కొందరి పరిస్థితి కూడా విషమంగా ఉందని, మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని కులాంగే చెప్పారు.

ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు ఒడిశా రవాణ శాఖ మంత్రి పద్మనాభ బెహెరా చెప్పారని ఏఎన్ఐ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)