బైడెన్: ఫేస్‌బుక్‌లో కోవిడ్‌పై తప్పుడు సమాచారం వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి

జుకర్‌బర్గ్, బైడెన్

కోవిడ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడమంటే అది మనుషులను చంపడమేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.

కరోనా మహమ్మారి, వ్యాక్సీన్‌లపై దుష్ప్రచారంలో 'ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల పాత్ర'పై ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆయన ఈ సమాధానం చెప్పారు.

తప్పుడు సమాచారం వ్యాప్తికి కారణం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సోషల్ మీడియా సంస్థలపై వైట్‌హౌస్ ఒత్తిడి పెంచుతోంది.

మరోవైపు ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు తాము చర్యలవేగం పెంచినట్లు ఫేస్‌బుక్ చెబుతోంది.

శుక్రవారం వైట్‌హౌస్‌లో పాత్రికేయులతో మాట్లాడిన బైడెన్.. ''వారు ప్రజలను చంపుతున్నారు. వ్యాక్సిన్ వేసుకోనివారి మధ్యే మహమ్మారి ఉంది'' అన్నారు.

ప్రస్తుతం అమెరికాలో వ్యాక్సీన్ వేసుకోనివారిలోనే కేసులు, మరణాలు కనిపిస్తున్నాయని అమెరికా ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.

బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

బైడెన్ మాట్లాడడానికి ముందు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ మాట్లాడుతూ ఫేస్‌బుక్, అలాంటి ఇతర ప్లాట్‌ఫాంలు వ్యాక్సీన్ విషయంలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు.

''వారు కొన్ని చర్యలు చేపట్టారు. కానీ, ఇంకా చేయాల్సింది చాలా ఉంది'' అన్నారామె.

''వాస్తవ దూరమైన ఆరోపణల కారణంగా మేం మా పని నుంచేమీ దృష్టి మరల్చుకోం'' అని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి కెవిన్ మెక్ అలిస్టర్ అన్నారు.

తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న 1.8 కోట్ల పోస్ట్‌లు, నిబంధనలు ఉల్లంఘిస్తున్న అకౌంట్లను మేం తొలగించాం అని కెవిన్ చెప్పారు.

జుకర్‌బర్గ్

ఫొటో సోర్స్, Getty Images

ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ల మోడరేషన్‌కు సంబంధించి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా మహమ్మారికి సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారం ఇంకా ఫేస్‌బుక్‌లో ఉంది.

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ రోచెల్ వాలెన్‌స్కీ శుక్రవారం మాట్లాడుతూ అమెరికాలో 59.2 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సీన్ వేసినట్లు చెప్పారు.

వ్యాక్సీన్ వేయించుకోనివారిలోనే కేసులు పెరుగుతున్నాయన్నారు.

వ్యాక్సీన్ వేయించుకోవాల్సిన చాలామంది దాన్ని తాము నమ్మడం లేదని చెబుతూ టీకా వేయించుకోవడానికి నిరాకరిస్తున్నారు.

ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో యాంటీ వ్యాక్సీన్ యాక్టివిస్టులకు 5.9 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారని మార్చిలో ఒక నివేదిక వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)