బ్రసెల్స్ బాంబర్లు: 'మనిషిని చంపడం ఎలా ఉంటుందో 'టెస్ట్' చేసేందుకు ఒక వృద్ధుడిని హత్య చేశారు'

ఫొటో సోర్స్, AFP
బ్రసెల్స్లో ఆత్మాహుతి దాడితో ప్రమేయం ఉన్న ఇద్దరు సోదరులు దానికి ముందు ఒక మనిషిని చంపడమంటే ఏమిటో తెలుసుకునేందుకు ఒక 76 ఏళ్ల వృద్ధుడిని నడిరోడ్డుపై కాల్చి చంపారని బెల్జియన్ నివేదిక వెల్లడించింది.
76 ఏళ్ల పాల్ ఆండ్రే వాండెర్ పెరెన్ను రోడ్డుపై కాల్చి చంపినట్లు నిందితులిద్దరూ తమ సహచరులకు చెప్పినట్లు 'డి మోర్గెన్' పత్రిక పేర్కొంది. ఈ సంఘటన 2014లో చోటు చేసుకుంది.
వాండెర్ పెరెన్ బ్రసెల్స్ లోని ఒక కాఫీ షాపులో ఆదివారం రాత్రి ఆయనకు ఇష్టమయిన ఆండెర్లాక్ట్ ఫుట్ బాల్ మ్యాచ్ టీవీలో చూసి ఇంటికి తిరిగి వెళుతుండగా హత్యకు గురయ్యారు. అయితే, ఈ హత్యను అధికారులు చేధించలేకపోయారు.
ఇబ్రహీం ఎల్ బక్రౌవీ 2016లో జావెంటెమ్ ఎయిర్ పోర్టులో 11 మందిని హత్య చేసి తనను తాను హతం చేసుకున్నాడు. అతడి సోదరుడు ఖాలిద్ కూడా ఒక మెట్రో స్టేషన్ లో మరో 20 మందిని హతమార్చాడు.
ఆయనను హత్య చేసిన వ్యక్తులను గుర్తించమని బ్రస్సెల్స్ న్యాయవాదులు 2018లో సాక్షులను కోరినప్పటికీ ఆ కేసును అక్టోబరు 2020లో మూసివేయడంతో విచారణ ముందుకు సాగలేదు.
బాక్రౌవి సోదరులే ఈ నేరంతో సంబంధం కలిగి ఉండవచ్చని తమ న్యాయవాదులు అనుమానించినట్లు వాండెర్ పెరెన్ భార్య గత సంవత్సరం డి మోర్గెన్ పత్రికకు చెప్పారు. "నాకింకా జవాబులు దొరకని ప్రశ్నలు చాలా ఉన్నాయి. కానీ, ఈ విషయం తెలియడం కొంత ఊరట" అని ఆమె చెప్పినట్లు తెలిసింది.


అయితే, బ్రసెల్స్ దాడుల్లో బ్రతికిన మరో ఇద్దరు నిందితులు మొహమ్మద్ అబ్రిని, ఒసామా క్రాయెమ్ చేసిన విచారణలో వాండెర్ పెరెన్ హత్యతో ఈ సోదరులకున్న సంబంధం బయటకు వచ్చింది. వీరిద్దరూ వచ్చే సంవత్సరం విచారణ ఎదుర్కోనున్న 10 మందిలో ఉన్నారు. నవంబరు 2015 ప్యారిస్ దాడులతో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్న సలాహ్ అబ్దేస్లాం ఈ కేసులో మరో నిందితుడు.
ఖాలిద్, ఇబ్రహీం కలిసి వీధిలో ఒక వ్యక్తిని చంపినట్లు తనతో చెప్పినట్లు 2016లో క్రాయెమ్ విచారణాధికారులకు చెప్పినట్లు విలేకరి డగ్లస్ డి కానిక్ పేర్కొన్నారు.
మెట్రో స్టేషన్లో బాంబు దాడి చేసి హతమయిన ఖలీద్ తో పాటు క్రాయెమ్ ఉన్నట్లు సిసిటీవీల ద్వారా గుర్తించారు. క్రాయెమ్ స్వీడన్ దేశస్థుడు.
అయితే, హత్య చేసిన నిందితులిద్దరూ ఇప్పుడు మరణించడంతో ఈ కేసును పునర్విచారణ చేపట్టే అవకాశం లేదు.
"ఈ హత్యను చేసిన వారిని పరిశోధనలో గుర్తించలేకపోవడంతో అక్టోబరు 2020లో స్టేట్ కౌన్సెల్ ఆఫీసు ఈ కేసును మూసివేయాలని నిర్ణయించింది" అని బ్రస్సెల్స్ ప్రాసిక్యూటర్ ప్రతినిధి బీబీసీ కి చెప్పారు. ఈ కేసులో కొత్త ఆధారాలేమన్నా లభిస్తే ఈ ఫైలును తిరిగి తెరుస్తామని, కానీ, విచారణ చేపట్టని కొత్త అంశాలేవీ ఈ కేసులో లభించలేదని ఆమె చెప్పారు.
ఈ కేసు ఫెడరల్ ప్రాసిక్యూటర్ పర్యవేక్షణలో లేదని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
- విజయవాడ టీడీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్సీ.. మేయర్ పీఠం కోసమేనా
- కడప స్టీల్: ముగ్గురు ముఖ్యమంత్రులు, మూడుసార్లు శంకుస్థాపనలు.. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేనా?
- తెలుగు భాషకు తమిళంలా స్వయం ప్రతిపత్తి సాధ్యం కాదా?
- కరోనావైరస్: ప్రపంచమంతా సుగంధ ద్రవ్యాలకు భారీగా పెరిగిన గిరాకీ.. పండించే రైతులకు మాత్రం కష్టాలు రెట్టింపు
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
- ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య: తప్పెవరిది, అమ్మాయిలదా.. తల్లిదండ్రులదా.. సమాజానిదా? :అభిప్రాయం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









