దిశా రవికి బెయిల్ మంజూరు చేసిన దిల్లీ కోర్టు: Newsreeel

దిశా రవి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిశా రవి
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

భారత్‌లో రైతుల నిరసనలకు మద్దతుగా గ్రెటా థన్‌బర్గ్ షేర్ చేసిన 'టూల్‌కిట్' మీద నమోదైన కేసులో అరెస్టయిన 22 ఏళ్ల పర్యావరణ ఉద్యమకారిణి దిశా రవికి దిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

రైతుల నిరసనలకు మద్దతుగా గ్రెటా థన్‌బర్గ్ షేర్ చేసిన 'టూల్‌కిట్' మీద నమోదైన కేసులో దిశా రవిని ఈ నెల 13న బెంగళూరులో దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

కోర్టు ఫిబ్రవరి 20న విచారణ జరిపిన తర్వాత తమ తీర్పును రిజర్వులో పెట్టింది. ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ ఇవాళ తీర్పు వెల్లడించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

"దిశా రవి టూల్‌కిట్ గూగల్ డాక్యుమెంట్ ఎడిటర్. ఈ డాక్యుమెంట్‌ను తయారు చేయడంలోనూ, ప్రచారం చేయడంలోనూ ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఖలిస్తాన్ మద్దతుదారు 'పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్‌'తో కలిసి దిశ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారాలు చేపడుతున్నారు. దిశనే ఈ టూల్‌కిట్‌ను గ్రేటా థన్‌బర్గ్‌తో పంచుకున్నారు. ఈ టూల్‌కిట్ రూపొందించడం కోసం ఒక వాట్సాప్ గ్రూప్‌ను దిశ ఏర్పాటు చేశారు. ఈ టూల్ కిట్ పైనల్ డ్రాఫ్ట్ తయారు చేసిన బృందంతో దిశ కలిసి పనిచేశారు" అని దిశా రవిని దిల్లీలోని కోర్టులో ప్రవేశపెడుతూ పోలీసులు చెప్పారు.

"జనవరి 26న దేశ రాజధాని దిల్లీలో జరిగిన అల్లర్లు ప్రణాళిక ప్రకారమే జరిగాయని, అందులో ఈ డాక్యుమెంట్ పాత్ర ఉందని" పోలీసులు పేర్కొన్నారు.

దిశా రవి ఎవరు?

ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన దిశా రవి వయసు 22 సంవత్సరాలు. బెంగళూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో ఆమె బీబీఏ డిగ్రీ చదువుతున్నారు.

2018లో గ్రేటా థన్‌బర్గ్ పర్యావరణ పరిరక్షణ దిశగా 'సేవ్ ది ఎన్విరాన్‌మెంట్ క్యాంపెయిన్‌'తో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టిస్తున్న సమయంలోనే దిశా రవి 'ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఇండియా' ప్రచారం మొదలుపెట్టారు.

భారత్‌లో వాతావరణ మార్పుల నియంత్రణకు నిర్వహిస్తున్న చాలా ఉద్యమాలు, కార్యక్రమాల్లో దిశ పాల్గొన్నారు. ఇదే అంశంపై గతంలో ఆమె బెంగళూరులో నిరసనలు చేపట్టారు. వాతావరణ మార్పులతో చుట్టుముట్టే ముప్పులపై మీడియాలో ఆమె వ్యాసాలు కూడా రాస్తుంటారు.

అయితే, నిరసన ప్రదర్శనలలో పాల్గొనడం కంటే ఎక్కువగా చెరువులు, నదులను శుభ్రం చేయడం, చెట్లను నరక్కుండా కాపాడడం మొదలైన కార్యక్రమాలలో పాల్గొనడానికే ఆమె మొగ్గు చూపుతారు.

జో బైడెన్ ప్రసంగం

కరోనావైరస్: అమెరికాలో 5 లక్షలు దాటిన మరణాలు

అమెరికాలో కోవిడ్-19 మరణాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఐదు లక్షలకు చేరడంతో అధ్యక్షుడు జో బైడెన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

"ఈ దారుణమైన విధిని ఒక దేశంగా మనం అంగీకరించలేం. దుఃఖంతో కుంగిపోవడం నుంచి బయటపడాలి" అన్నారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు, తమ కుటుంబాలతో కలిసి వైట్‌హౌస్‌లో కొవ్వొత్తులు వెలిగించారు. కోవిడ్ మృతులకు సంతాపంగా మౌనం పాటించారు.

అమెరికాలో ప్రపంచంలోనే అత్యధికంగా 2 కోట్ల 81 లక్షల మంది కరోనాకు గురయ్యారు.

"ఈరోజును అమెరికన్లందరూ గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నాను. మనం కోల్పోయినవారిని, మనల్ని వదిలి వెళ్లిపోయినవారిని గుర్తుంచుకోండి" అని బైడెన్ అన్నారు.

అంతా కలిసి కోవిడ్‌తో పోరాడదామని ఆయన అమెరికన్లకు పిలుపునిచ్చారు.

అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు సంతాపం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోవిడ్ మృతులకు మౌనం పాటిస్తున్న అధ్యక్ష, ఉపాధ్యక్ష దంపతులు

500 సార్లు మోగిన చర్చి గంట

కోవిడ్ మృతులకు సంతాపంగా మరో ఐదు రోజులపాటు ఫెడరల్ ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న అన్ని అమెరికా జెండాలనూ అవనతం చేయాలని బైడెన్ ఆదేశాలు జారీ చేశారు.

అమెరికాలో కరోనా మృతుల సంఖ్య మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు, వియత్నాం యుద్ధ మృతుల సంఖ్యను కూడా దాటిందని చెప్పడానికి ఆయన వైట్‌హౌస్‌లో ప్రసంగించారు.

అమెరికాలో కరోనా మృతులు

ఫొటో సోర్స్, Reuters

"ఈరోజు చాలా విషాదకరమైన, హృదయవిదారకమైన మైలురాయి లాంటిది. దేశంలో కరోనా వల్ల 5,00071 మంది చనిపోయారు" అన్నారు.

మనల్ని జనం తరచూ మామూలు అమెరికన్లని వర్ణించడం వింటూనే ఉంటాం. కానీ అదేం కాదు, మనకు దూరమైనవారు సామాన్యులు కారు, వారు అసాధారణ వ్యక్తులు. వారు తరాలనుంచీ ఉన్నారు. అమెరికాలో పుట్టారు, అమెరికాకు వలస వచ్చారు. వారిలో ఎంతోమంది అమెరికాలోనే తుదిశ్వాస విడిచారు" అన్నారు.

అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక్క రోజు ముందు, జనవరి 19న అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 4 లక్షలకు చేరడంపై ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమానికి బైడెన్ హాజరయ్యారు.

నెల తర్వాత కోవిడ్-19 మృతుల సంఖ్య ఐదు లక్షలు దాటడంతో సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.

సోమవారం రాత్రి వాషింగ్టన్‌లోని నేషనల్ కాథెడ్రల్ చర్చి గంటను మహమ్మారి వల్ల చనిపోయినవారికి నివాళిగా ప్రతి వెయ్యి మందికి ఒకసారి చొప్పున 500 సార్లు మోగించారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)