పర్యావరణానికి మేలు చేసిన కరోనావైరస్.. రికార్డు స్థాయిలో తగ్గిన కర్బన ఉద్గారాలు

ఐఫిల్ టవర్ వద్ద సైకిల్ తొక్కుతున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

కోవిడ్-19 మహమ్మారికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన స్పందన వల్ల, ఈ ఏడాది కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కంటే భారీగా తగ్గినట్లు కనిపించిందని పరిశోధకులు చెబుతున్నారు.

కర్బన ఉద్గారాలు ఈ ఏడాది దాదాపు 7 శాతం తగ్గినట్లు వారి అధ్యయనం చూపించింది.

ఫ్రాన్స్, బ్రిటన్‌లో కర్బన ఉద్గారాలు భారీగా తగ్గినట్లు కనిపించింది. ఈ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్‌తో చేపట్టిన కఠిన చర్యలే దానికి ప్రధాన కారణమని తేలింది.

దీనికి భిన్నంగా కరోనా నుంచి కోలుకుంటున్న చైనాలో ఈ ఏడాది కర్బన ఉద్గారాలు పెరగవచ్చని భావిస్తున్నారు.

"2020లో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల క్షీణత ఇంతకు ముందు తగ్గిన సమయాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ఈ ఏడాది 2.4 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గినట్లు" గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ టీమ్ చెప్పింది.

లండన్

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, బ్రిటన్‌లో రెండుసార్లు లాక్‌డౌన్ విధించగా.. ఆ సమయాల్లో కార్ల వినియోగం భారీగా తగ్గిపోయింది

అంతకు ముందు 2009లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చినపుడు ఈ ఉద్గారాలు 50 కోట్ల టన్నులు మాత్రమే తగ్గాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన సమయంలో ఇవి ఒక బిలియన్ టన్నుల కంటే తగ్గాయి.

ఐరోపా, అమెరికా అంతటా ఈ ఏడాది దాదాపు 12 శాతం కర్బన ఉద్గారాలు క్షీణించగా, ఇవి ఫ్రాన్సులో 15 శాతం, బ్రిటన్‌లో 13 శాతం తగ్గాయని అధ్యయనంలో తేలింది.

"కరోనా మొదటి, రెండో వేవ్ వచ్చిన సమయంలో మిగతా దేశాల కంటే కఠినంగా ఈ రెండు దేశాల్లో షట్ డౌన్ అమలు చేయడమే దీనికి ప్రధాన కారణం" అని ఈ అధ్యయనానికి సహకరించిన యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా ప్రొఫెసర్ కొరిన్నే లీ క్వేరీ చెప్పారు.

బ్రిటన్, ఫ్రాన్స్ లో ఈ ఉద్గారాలు ఎక్కువగా రవాణా రంగం నుంచే ఉత్పత్తి అవుతాయి. ఫ్రాన్స్ ఎక్కువగా అణుశక్తి నుంచి విద్యుదుత్పత్తి చేయడం కూడా దీనికి మరో కారణం.

ప్రయాణాలపై ఆంక్షల వల్ల ప్రపంచవ్యాప్తంగా వైమానిక రంగం తీవ్రంగా నష్టపోయింది. ఈ ఏడాది చివరికి ఈ రంగంలో ఉద్గారాలు 2019 స్థాయి కంటే 40 శాతం తక్కువగా ఉన్నాయి.

కోవిడ్-19 తర్వాత చైనాలో పారిశ్రామిక ఉత్పత్తి భారీగా పెరిగింది, దీంతో కర్బన ఉద్గారాలూ పెరిగాయి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కోవిడ్-19 తర్వాత చైనాలో పారిశ్రామిక ఉత్పత్తి భారీగా పెరిగింది, దీంతో కర్బన ఉద్గారాలూ పెరిగాయి

చైనాలో భిన్నంగా ఈ గణాంకాలు

చైనాలో ఉద్గారాలు ఈ ఏడాది 1.7 శాతం తగ్గుతాయని పరిశోధకుల బృందం అంచనా వేసింది. కానీ కొన్ని విశ్లేషణలు మాత్రం చైనా కోవిడ్-19 నుంచి తగినంత కోలుకుందని, దాని మొత్తం కార్బన్ ఉత్పత్తి మళ్లీ పెరిగుండవచ్చని సూచిస్తున్నాయి.

"ఫిబ్రవరి, మార్చిలో చైనాలో కర్బన ఉద్గారాలు భారీగా తగ్గినట్లు మా గణాంకాలు చెబుతున్నాయి. కానీ, 2020 చివరి నాటికి వాటి స్థాయి ఇప్పటి లెక్కలకు భిన్నంగా ఉంటాయి" అని ఈ అధ్యయనంలో భాగమైన సీఐసీఈఆర్ఓ సీనియర్ పరిశోధకుడు జాన్ ఐవర్ కోర్స్ బాకెన్ అన్నారు.

"చైనా ప్రస్తుతం 2019లో ఉన్న రోజువారీ ఉద్గారాల స్థాయికి దగ్గరగా ఉంది. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ చైనాలో ఈ ఉద్గారాలు 2019 కంటే పెరగవచ్చని మా అధ్యయనాలు చెబుతున్నాయి" అని చెప్పారు.

మహమ్మారి వల్ల అవి భారీగా తగ్గడంతో సుదీర్ఘ కాలం నుంచి కర్బన ఉద్గారాలు తగ్గుతున్న విషయం మరుగున పడిపోయి ఉండచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాల పెరుగుదల, ఈ శతాబ్దం ప్రారంభంలో 3 శాతం నుంచి 2010లో 0.9 శాతానికి పడిపోయింది. బొగ్గును శక్తి వనరుగా ఉపయోగించడం తగ్గిపోవడమే దీనికి ప్రధాన కారణం.

2020కి ముందు ప్రపంచ శిలాజ కర్బన ఉద్గారాలు గరిష్ఠ స్థాయిని చేరబోతున్నాయా అనే ఒక చర్చ నడిచింది, కోవిడ్-19 దానిని మార్చేసింది" అని సీఐసీఈఆర్ఓ రీసెర్చ్ డైరెక్టర్ గ్లెన్ పీటర్స్ అన్నారు.

విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గు వినియోగం గత దశాబ్ద కాలంలో తగ్గింది

ఫొటో సోర్స్, SPL

ఫొటో క్యాప్షన్, విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గు వినియోగం గత దశాబ్ద కాలంలో తగ్గింది

2021లో కర్బన ఉద్గారాలు మళ్లీ పెరగడం దాదాపు ఖాయమని ఈ ప్రాజెక్టు కోసం పనిచేసిన పరిశోధకులు భావిస్తున్నారు.

కార్బన్ పెరుగుదలను తగ్గించడానికి 'బ్రౌన్' స్పందనకు బదుల 'గ్రీన్' స్పందన కావాలని కోరుతున్నారు. అంటే, తమకు అందే నిధులను శిలాజ ఇంధనానికి బదులు, మనం భరించగలిగే ప్రాజెక్టులపై ఖర్చు చేయాలని సూచిస్తున్నారు.

నగరాలలో నడక, సైక్లింగ్‌ను ప్రోత్సహించాలని, విద్యుత్ వాహనాల వినియోగం పెంచడానికి ప్రయత్నించాలని చెబుతున్నారు.

"2020లో రెండు బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ తగ్గడం స్వాగతించదగిన విషయమే. అయితే, పారిస్ క్లైమెట్ అగ్రిమెంట్ లక్ష్యాలను అందుకోవాలంటే, వచ్చే దశాబ్దం వరకూ ప్రతి ఏటా రెండు బిలియన్ టన్నుల ఉద్గారాలు తగ్గించాల్సిన అవసరం ఉంటుంది" అని శాస్త్రవేత్తలు అంటున్నారు.

"ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు గత ఏడాదిలో ఉన్నంత ఎక్కువగా లేకపోయినా, అవి ఇంకా దాదాపు 39 బిలియన్ టన్నులు ఉన్నాయి. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ మరింత పెరగడానికి కచ్చితంగా కారణమవుతున్నాయి" అని బ్రిటన్ యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటెర్ ప్రొఫెసర్ పియెర్రీ ఫ్రెడ్లింగ్‌స్టెయిన్ చెప్పారు.

"ప్రపంచవ్యాప్తంగా సీఓ2 ఉద్గారాలు సున్నాకు చేరినపుడు మాత్రమే, వాతావరణంలో సీఓ2 స్థాయి, ఫలితంగా ప్రపంచ వాతావరణం స్థిరంగా ఉంటుంది" అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)