కరోనావైరస్: వీరికి చేతులు కడుక్కోవడం చాలా కష్టం, ఎందుకంటే...

చేతులకు సబ్బు
    • రచయిత, స్వామినాథన్ నటరాజన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో యూరప్‌ సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు దాదాపు మూతపడుతున్నాయి.

ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే తరచూ చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలని, ఇతరుల నుంచి దూరంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచిస్తోంది. కానీ, ఆ సలహాలను పాటించడం ప్రపంచంలో కొన్ని కోట్ల మందికి అంత సులువు కాదు.

ప్రపంచ పట్టణ జనాభాలో దాదాపు 30 శాతం మంది ప్రజలు మురికివాడల లాంటి పరిస్థితుల్లో నివసిస్తున్నారు. వారికి సరైన నివాస సదుపాయాలు ఉండవు, మురుగునీటి పారుదల వ్యవస్థ ఉండదు. దాంతో, అంటువ్యాధులు సులువుగా వ్యాప్తి చెందుతాయి.

నలుగురు పిల్లలతో మహిళ

ఫొటో సోర్స్, Mukuru Promotion Centre, Winnie Ogutu

ఫొటో క్యాప్షన్, నైరోబీలోని ముకురు మురికివాడలో స్నానం చేసేందుకు కూడా నీళ్లు కొనుక్కోవాల్సిందే

43ఏళ్ల సెలెస్టీన్ అధియాంబో తన భర్త, ఆరుగురు పిల్లలతో కెన్యా రాజధాని నైరోబీ‌లోని ముకురు మురికివాడలో నివసిస్తున్నారు. ఇరుకుగా ఒకే గది ఉన్న వారి ఇంటికి నీళ్లు రావు. విద్యుత్ సదుపాయం లేదు. ఇళ్ల మధ్య మురుగు నీరు ఏరులై పారుతుంది. చెత్త అంతా నేరుగా నదిలోకి వెళుతుంది.

ఈ మురికివాడలో 5 లక్షల మందికి పైగా ప్రజలు జీవిస్తున్నారు.

"ఏదైనా అంటువ్యాధి సోకితే ఒక పిల్లాడిని వేరుగా ఉంచేందుకు మా ఇంట్లో గది లేదు. ప్రభుత్వమే రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లాలి" అని ఆమె బీబీసీతో చెప్పారు.

ముకురు మురికవాడ

ఫొటో సోర్స్, Mukuru Promotion Centre, Winnie Ogutu

ఫొటో క్యాప్షన్, ముకురు మురికివాడలో కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికారులు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు

స్నానం చేసేందుకు కూడా సరిపడా నీళ్లు దొరకడంలేదని ఈ మురికివాడ వాసులు చెబుతున్నారు.

ఇక్కడ మెర్సీ ముకురు అనే స్వచ్ఛంద సంస్థ నాలుగు ప్రాథమిక పాఠశాలలు నడుపుతోంది. వాటిలో దాదాపు 7,000 విద్యార్థులు చదువుకుంటున్నారు. అందులో సగం మంది విద్యార్థులకు సబ్బు కొనుక్కొనే స్తోమత లేదని ఆ సంస్థ అధ్యక్షులు మేరీ కిల్లీన్ అంటున్నారు.

"ఈ పరిస్థితులను చూస్తుంటే నాకు భయమేస్తోంది. మా ప్రాంతంలో కరోనావైరస్ వ్యాప్తి చెందితే ఎంత నష్టం జరుగుతుందో చెప్పలేం" అని అధియాంబో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

"ఆఫ్రికాలో చాలా పెద్ద కుటుంబాలు ఉంటాయి. కొన్ని చోట్ల చిన్న ఇంట్లోనే 12 మంది దాకా ఉంటారు. ఎవరికైనా కరోనావైరస్ లాంటిది సోకితే, వారిని నిర్బంధంలో ఉంచడం సాధ్యమయ్యే పనికాదు" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ ప్రతినిధి డాక్టర్ పియరీ యంపీలే చెప్పారు. మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని అనేక దేశాలలో ఆయన పనిచేశారు.

నీటి సమస్య మురికివాడలకే పరిమితం కాదు. భారత్‌లోని చెన్నై, దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నగరాలు గత ఏడాది తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొన్నాయి. చెన్నైకి తాగు నీటిని రైళ్లలో తరలించాల్సి వచ్చింది.

చెన్నై శివారులోని చెరువు ఎండిపోయింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దక్షిణాసియాలోని చాలా నగరాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. గతేడాది చెన్నైలో తీవ్రమైన కరవు ఏర్పడింది.

"ఈసారి కూడా గత ఏడాది మాదిరిగానే నీటి కొరత వస్తే, తరచూ చేతులు కడుక్కోవాలంటే మాకు నీళ్లు దొరకడం కష్టమే" అని చెన్నై శివారులో నివసిస్తున్న శాంతి శసింద్రనాథ్ బీబీసీతో అన్నారు.

గత ఏడాది నీటి కొరత సమయంలో, వారు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావుల నుంచి నీటిని కొనాల్సి వచ్చింది.

"పబ్లిక్ టాయిలెట్లు, నీటి కుళాయిలు చాలా తక్కువ ఉన్నాయి. వైద్యుల సలహాలను చాలామంది పాటించడం లేదు" అని శాంతి చెప్పారు.

వంట గదిలో మహిళ

ఫొటో సోర్స్, Shanthi Sasindrantah

ఫొటో క్యాప్షన్, చెన్నైలో గత ఏడాదిలాగే నీటి ఎద్దడి ఎదురైతే తరచూ చేతులు కడుక్కోవడం కష్టమవుతుందని శాంతి అంటున్నారు

"రైళ్లలో జనాలు దగ్గుతారు, తుమ్ముతారు. ఎదుటివారి ముఖానికి వారికి మధ్య దూరం కొన్ని అంగుళాలు మాత్రమే ఉంటుంది. అయినా కనీసం నోటికి రుమాలు అయినా అడ్డుపెట్టుకోరు. అదేంటని అడిగితే, కొందరు క్షమించండని అంటారు. మరికొందరు ఎదురు మాట్లాడతారు" అని ఆమె అంటున్నారు.

"చేతులను జాగ్రత్తగా, శుభ్రంగా కడుక్కోవాలని మా పిల్లలకు చెప్పాను. బయటి నుంచి వచ్చినప్పుడల్లా చేతులు కడుక్కోవాలని సూచించాను. అందుకే ఐదు నిమిషాలు బయట తిరిగినా చేతులను కడుక్కుంటున్నారు. చాలావరకు ప్రయాణాలను తగ్గించుకున్నాం" అని ఆమె చెప్పారు.

కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని బ్రిటన్‌లోని గ్లాస్గో విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ పాప్పీ లాంబెర్టన్ చెబుతున్నారు.

ఈ వైరస్ సోకిన వారందరినీ నిర్భంధంలో పెడితేనే పరిస్ధితి అదుపులోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆఫ్రికాలో కరోనా మహమ్మారి మహా విపత్తులా మారకముందే ప్రభుత్వాలు, నాయకులు అప్రమత్తమై గట్టి చర్యలు చేపట్టాలని డాక్టర్ యం.పీలే అంటున్నారు.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)