Ram Gopal Varma: ‘సూపర్, మెగా, బాహుబలిని మించిన మహాబలి జగన్’ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, IandPR,AP/SakshiTV
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తాజాగా సినీ ప్రముఖులు జరిపిన చర్చలపై దర్శకుడు రామ్గోపాల్ వర్మ వెటకారంగా స్పందించారని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.
సీఎం జగన్ను కలిసిన అగ్రహీరోలను లక్ష్యంగా చేసుకొని ఆయన పరోక్షంగా చురకలు అంటించారు.
'ఏపీ సీఎంతో సినీ ప్రముఖుల సమావేశానికి, చిత్ర పరిశ్రమ సమస్యలపైన సీఎం సానుకూలంగా స్పందించడానికి సూపర్, మెగా, బాహుబలి లెవల్ బెగ్గింగ్ పనిచేసింది' అని ఆర్జీవీ అన్నారు.
'ఒమెగా స్టార్ జగన్ను ఆశీర్వదించినందుకు నాకు సంతోషంగా ఉంది. సూపర్, మెగా, బాహుబలిని మించిన మహాబలి జగన్' అని ముఖ్యమంత్రికి కితాబునిచ్చారు రామ్గోపాల్ వర్మ.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అంతకు ముందు 'మెగా అభిమానిగా ఈ మెగా బెగ్గింగ్ను చూసి చాలా హార్ట్ అయ్యాను' అని ట్వీట్ చేసిన వర్మ వెంటనే దాన్ని తొలగించారు.
అయితే సీఎంతో మీటింగ్కు వర్మను ఆహ్వానించకపోవడమే ఆయన కడుపుమంటకు కారణమని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.
రీల్ ఫిల్మ్లో మహేశ్ బాబు, చిరంజీవి, ప్రభాస్, తదితరులు పంచ్ డైలాగులు పేలుస్తారని, రియల్ లైఫ్లో మాత్రం వైఎస్ జగన్ సెంటర్ ఫ్రేమ్లో ఉన్నారని, హీరోలు జూనియర్ ఆర్టిస్టుల్లాగా భిక్ష కోసం బెగ్గింగ్ చేస్తున్నారని వర్మ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, PROJECTTIGER.NIC.IN
వీడిన పెద్దపులి మిస్టరీ
కర్నూలు జిల్లాలో గండ్లేరు జలాశయం వద్ద నల్లమల అడవిలో మృతి చెందిన పెద్దపులి కేసు మిస్టరీ వీడిందని ఈనాడు ఒక కథనం రాసింది.
వేటగాళ్ల ఉచ్చుకు బలైన పులి కళేబరాన్ని గుర్తించిన సిబ్బంది.. దాన్ని తెలుగు గంగ కాల్వలో పడేశారు. గండ్లేరు జలాశయం ఒడ్డున కళేబరం లభ్యం కావడంతో పూర్తి వివరాలు తెలిశాయి.
నంద్యాల సబ్ డివిజన్ కార్యాలయంలో డీఎఫ్ఓ వినీత్ కుమార్ శుక్రవారం ఈ వివరాలు వెల్లడించారు.
వారం క్రితం నల్లమల అటవీ పరిధి చలమ రేంజ్లోని శిరివెళ్ల మండలం పెద్దకంబలూరు సమీపాన వేటగాళ్ల ఉచ్చులో పులి మృతి చెందింది.
విషయం తెలుసుకున్న అధికారులు విచారణ చేపట్టగా.. గండ్లేరు జలాశయం వద్ద పులి కళేబరం లభ్యమైంది.
నిజాలు తెలియడంతో పెద్దకంబలూరు ఫారెస్ట్ సెక్షన్ అధికారి శ్రీనివాస రెడ్డి, బీట్ అధికారి జేమ్స్ పాల్ను సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపాపరు.
ప్లాంటేషన్ వాచార్ బాష, మైఖేల్లను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Manyawar Mohey
'అతనితో నా పెళ్లైపోయింది'
రణ్బీర్ కపూర్తో తన పెళ్లైపోయినట్టు ఆలియా భట్ చెప్పారని సాక్షి కథనం పేర్కొంది.
'రణ్బీర్తో నా వివాహం ఎప్పుడో జరిగిపోయింది. నా ప్రేమను అతను అంగీకరించినప్పుడే నా మనసులో అతన్ని వివాహం చేసుకున్నాను.
కానీ అనుకోని కారణాల వల్ల మా పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది.
అయితే, ఒక విషయం మాత్రం చెప్పగలను. మా వివాహం ఎప్పుడు జరిగినా రంగరంగ వైభవంగా, అద్భుతంగా జరుగుతుంది' అని ఆలియా అన్నారు.
అలా రణ్బీర్ని మానసికంగా పెళ్లాడానని స్పష్టం చేసేశారు ఆలియా.
ఇక పెద్దలు, బంధువుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరగాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
'జాతీయ సమస్యగా మార్చొద్దు'
కర్ణాటకలో ఉద్రిక్తతలకు కారణమైన హిజాబ్ అంశంపై సరైన సమయంలో విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ వివాదాన్ని జాతీయ స్థాయి సమస్యగా మార్చొద్దని సుప్రీంకోర్టు హితవు పలికిందంటూ నమస్తే తెలంగాణ పత్రిక కథనం రాసింది.
పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షిస్తామని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది.
ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం వెల్లడించింది.
విద్యాసంస్థల్లో వస్త్రధారణపై విధించిన ఆంక్షలపై తుది తీర్పు వెలువడే వరకూ విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు మతపరమైన దుస్తులు వేసుకురావొద్దంటూ కర్ణాటక హైకోర్టు గురువారం మధ్యంతర ఆదేశాలిచ్చింది.
వీటిని సవాల్ చేస్తూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

ఇవి కూడా చదవండి:
- PM CARES: ఈ ఫండ్ మీద కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది, అనుమానాలు ఎందుకు వస్తున్నాయి?
- హిజాబ్పై ప్రపంచమంతటా ఉన్న వివాదాలేంటి... ఏయే దేశాలు నిషేధించాయి?
- ఉన్నావ్: రెండు నెలల కిందట అదృశ్యమైన యువతి మృతదేహం మాజీ మంత్రి కుమారుడి స్థలంలో దొరికింది
- గోంగూరకు రుచి ఇచ్చే పచ్చిమిర్చి తెలుగు నేలది కాదా... సమోసాలో బంగాళాదుంప ఏ దేశం నుంచి వచ్చింది?
- ఉత్తరప్రదేశ్లో 2017 తరువాత 'అల్లర్లు జరగలేద'న్న యోగి ఆదిత్యనాథ్ మాటల్లో నిజమెంత - BBC RealityCheck
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)













