పెద్ద పులుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది...

ఫొటో సోర్స్, WWF
టైగర్ కింగ్ టీవీ సిరీస్లో కొన్ని లక్షల మంది ప్రజలు నిర్బంధంలో ఉన్న పులులను చూశారు. ఇటీవల కొన్ని దశాబ్దాలుగా అడవులలో పులుల జనాభా తగ్గుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కానీ, ఆశ్చర్యకరంగా వాటి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇటీవల వైల్డ్ లైఫ్ చారిటీ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) విడుదల చేసిన గణాంకాలు వీటి సంఖ్య పెరిగినట్లు తెలుపుతోంది.
"ఇది అనూహ్యమైన పరిణామమని” నిపుణులు చెబుతున్నారు.
2010 లో ప్రపంచ వ్యాప్తంగా 3200 పెద్ద పులులు ఉండేవని అంచనా. కానీ, ప్రస్తుతం ఇండియా, చైనా, నేపాల్, రష్యా, భూటాన్లలో కనిపిస్తున్న వీటి సంఖ్య కొత్త ఆశను కలిగిస్తోంది.
ఒక్క భారతదేశంలోనే ప్రస్తుతం 2600 నుంచి 3350 వరకు పెద్ద పులులు ఉండవచ్చని అంచనా. అంటే ప్రపంచంలో మూడు వంతుల పులుల జనాభా భారతదేశంలోనే ఉన్నట్లు లెక్క.
నేపాల్లో 2009 లో 121 ఉండే పులులు ఒక దశాబ్దం తిరిగేసరికి 235 కి పెరిగాయి.
ఇలాంటి పరిస్థితే రష్యా, భూటాన్, చైనా దేశాలలో కూడా కనిపిస్తోంది. దీనిని బట్టి వీటి పరిరక్షణకు చేపడుతున్న చర్యలు పని చేస్తున్నాయని అర్ధం అవుతోంది.
"తగినంత స్థలం, ఆహారం, నీరు లభిస్తే పులులు ఇబ్బంది లేకుండా మనుగడ సాగించగలవు. పులుల ఆవాస ప్రాంతాలను సరైన రీతిలో సంరక్షించడం వలనే పులుల సంఖ్యలో అభివృద్ధి కనపడుతోందని”, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ యుకె ప్రాంతీయ మేనేజర్ బెక్కి మే రేడియో వన్ న్యూస్ బీట్ కి చెప్పారు.
అయితే, వీటి మనుగడకు ముప్పు కూడా కూడా పొంచి ఉందని, ఆమె అన్నారు. "గత 100 సంవత్సరాలలో భూమి వాడకంలో వచ్చిన మార్పుల వలన వీటి సంఖ్య బాగా తగ్గిపోయిందని” ఆమె చెప్పారు.
"ఆవాస ప్రాంతాలు కోల్పోవటం, వేట, ఆక్రమణల వలన వీటికి ముప్పు పొంచి ఉంది. వన్యప్రాణులను వేటాడేందుకు వలలు వేయడం వలన కూడా అవి బాగా వినాశనమయ్యాయని , ఆమె అన్నారు.
దక్షిణ తూర్పు ఆసియాలో వన్య ప్రాణులకు ముప్పు కలిగించేందుకు కనీసం 12 లక్షల 30 వేల వలలు ఉన్నాయని ఇటీవల విడుదలైన ఒక విశ్లేషణ తెలిపింది.

ఫొటో సోర్స్, WWF
పులులను సంరక్షించడానికి మనమేమి చేయవచ్చు?
దీనికి అందరి సహకారం అవసరమని బెక్కి అభిప్రాయపడ్డారు.
"పులుల సంరక్షణ పట్ల మనకున్న ఆసక్తిని, వాటిని సంరక్షించాల్సిన ఆవశ్యకత గురించి మన కుటుంబం, స్నేహితులతో చర్చించాలి".
మనం కొనుక్కునే చెక్క, కాగితం లాంటి వస్తువులు పులులకు హాని తలపెట్టేందుకు చట్ట వ్యతిరేకంగా చెట్లను నరకడం వలన వచ్చినవి కాకుండా చూసుకోవడం ద్వారా కొంత వరకు మేలు జరుగుతుందని అన్నారు.
"వస్తువుల మీద ఉండే లేబుళ్లను చూసినప్పుడు అవి సరైన చోటు నుంచి వచ్చాయో లేదో అర్ధమవుతుంది. ఇలా చేయడం ద్వారా ఆ అడవులు, వన్య ప్రాణుల ఆవాసాలు, పులులను సంరక్షించిన వారవుతారు.”

ఫొటో సోర్స్, Getty Images
ఇండియా, నేపాల్ అనుసరించిన విధానాలను చూసి మిగిలిన దేశాలు నేర్చుకోవచ్చు.
"ప్రభుత్వ సహకారం, రాజకీయ సంకల్పం లేనిదే పులుల సంరక్షణ విజయవంతం కాదు” అని, బెక్కి అన్నారు.
"దీనికి పులులు తిరిగే ప్రాంతాలకు దగ్గరగా నివసించే ప్రాంతీయ ప్రజల సహకారం , చొరవ కూడా అవసరమవుతాయని అన్నారు.
దీని ద్వారా వివిధ సమాజాలను సంరక్షణ చర్యలలో భాగస్వాములను చేసిన వారమవుతాం.
"సామూహిక ప్రయత్నాల ద్వారా పులుల సంఖ్యను పెంచవచ్చని ఇప్పటికే నిరూపించామని" ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనా విపత్తు బొగ్గు పరిశ్రమను అంతమొందిస్తుందా
- మేఘాలయ: 'ర్యాట్ హోల్' బొగ్గు గనిలో ఎలా పనిచేస్తారు
- ఆంధ్రప్రదేశ్లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- భారత్లో నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా భారీగా తగ్గిన కర్బన ఉద్గారాలు
- ర్యాట్ హోల్ మైనింగ్: బొగ్గుగనిలో చిక్కుకున్న కార్మికులు.. కాపాడడం సాధ్యమేనా?
- అబ్ఖాజియా: ఇదో అజ్ఞాత దేశం.. దీనిని భారత్ ఇప్పటికీ గుర్తించలేదు
- ఉపగ్రహ చిత్రాలు: భారత్లో గాలి ఎందుకిలా మారింది?
- బ్రిటన్ నల్లమందు వ్యాపారం భారతీయులను పేదరికంలోకి ఎలా నెట్టింది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








