ఆంధ్రప్రదేశ్: సినిమా టికెట్ల ధరలను నిర్దేశిస్తూ ఇచ్చిన జీవోని రద్దు చేసిన హైకోర్టు

ఫొటో సోర్స్, Reuters
ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్లలో టికెట్ల ధరలను నిర్దేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోని హైకోర్టు రద్దు చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకుని నగరాల్లోని మల్టీప్లెక్సుల వరకూ వివిధ థియేటర్లలో టికెట్ల ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తూ జీవో నెం. 35 జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. థియేటర్ల యజమానులు ఏపీ హైకోర్టులో పిటీషన్ వేశారు. వారి తరపున సీనియర్ లాయర్లు ఆదినారాయణరావు, దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలు హేతుబద్ధంగా లేవని, సినిమా టికెట్ల ధరలు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదంటూ పిటీషనర్లు కోర్టుకి తెలిపారు. దానితో ఏకీభవించిన కోర్టు జీవో నెం. 35ని రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. పాత విధానంలోనే టికెట్ల రేట్లు నిర్ణయించుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
ప్రజలకు సౌలభ్యంగా ఉండేందుకు, ప్రజలకు సినిమా అందుబాటులో ఉంచడం కోసం ఈ జీవో తీసుకొచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. టికెట్ల విక్రయం ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా చేపట్టి, పోర్టల్ ని ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ద్వారా నిర్వహిస్తామని ప్రభుత్వం పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
జీవో నెం. 35ని గత ఏప్రిల్ లో విడుదల చేసింది. డిసెంబర్ 1న అధికారికంగా ధరలు నిర్ణయించి ప్రకటన చేశారు. దాని ప్రకారం అత్యధికంగా రూ. 250, అత్యల్పంగా రూ. 5 చొప్పున టికెట్ల ధరలను ప్రకటించారు. ఈ నిర్ణయంతో సినిమా పరిశ్రమ మెరుగుపడుతుందని పేర్కొన్న ప్రభుత్వం, ఆ ధరలను మించి టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
టికెట్ల ధరలను అన్ని సినిమాలకు ఒకే రీతిలో నిర్ణయించడం వల్ల చిన్న సినిమాలకు కొంత మేలు కలిగినా, పెద్ద సినిమాలకు నష్టం తప్పదంటూ ఎగ్జిబిటర్లు, థియేటర్ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా రంగం బతికేందుకు పెద్ద సినిమాలకు ఉపశమనం కల్పించాలని కొందరు కోరారు.
బీసీ సెంటర్లలో ధరలు చాలా తక్కువగా ఉండడం వల్ల నష్టాలు తప్పవంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు కోర్టులో థియేటర్ యాజమాన్యాలు చేసిన వాదనలను కోర్టు అంగీకరించడంతో ఈ జీవో అమలుని కోర్టు నిలిపివేసింది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఏ సినిమాకైనా ఒకే టికెట్ ధర నిబంధనపై వివాదం ఏమిటి? దీన్ని ఎందుకు కొందరు వ్యతిరేకిస్తున్నారు?
- జై భీమ్: IMDb రేటింగులో గాడ్ఫాదర్ను అధిగమించిన భారతీయ సినిమా
- అసలు కాలుష్యం కంటే టీవీ చానళ్లలో చర్చలు మరింత కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయి: సీజేఐ ఎన్వీ రమణ
- ఆల్బర్ట్ ఎక్కా: గొంతులో బుల్లెట్ దిగినా, మిషన్ పూర్తి చేసి ప్రాణం వదిలిన భారత జవాన్
- ఆంధ్రప్రదేశ్: ఇళ్ల నిర్మాణం పూర్తయినా మూడేళ్లుగా లబ్ధిదారులకు ఎందుకివ్వడం లేదు?
- త్రిపుర: ఇద్దరు లాయర్లు, ఒక జర్నలిస్టు అరెస్ట్పై స్టే విధించిన సుప్రీంకోర్టు
- ఉగాండా రాజధాని కంపాలాలో ఆత్మాహుతి దాడులు.. ముగ్గురు మృతి
- పోలండ్-బెలారుస్ సరిహద్దు సంక్షోభం: వేల మంది శరణార్ధులు ఎక్కడి నుంచి వస్తున్నారు?
- మోర్బీ డ్రగ్స్ కేసు: గుజరాత్లో వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడడానికి, అఫ్గానిస్తాన్కూ ఏమిటి సంబంధం?
- హెచ్ఐవీ వ్యాప్తిని నిరోధించే మాత్ర... ఏప్రిల్ నుంచి ఇంగ్లండ్లో అందుబాటులోకి
- ప్రపంచంలోనే హెచ్ఐవీని జయించిన రెండో వ్యక్తి.. ఎలా నయమయ్యిందంటే?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








