మా ఎన్నికలు - ప్రకాశ్‌రాజ్: 'నిజమేంటో తెలుసుకోవాలనుకుంటున్నారు.. ఆ సీసీటీవీ ఫుటేజ్‌ ఇవ్వండి' - ప్రెస్‌రివ్యూ

ప్రకాశ్ రాజ్

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలకు సంబంధించిన సీసీటీవీ పుటేజ్‌ ఇవ్వాలని.. ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ను నటుడు ప్రకాశ్‌రాజ్‌ కోరారని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

‘‘మా’ ఎన్నికల రోజున మా సభ్యులపై భౌతిక దాడులు జరిగాయి. మోహన్‌బాబు, నరేశ్‌ అనుచితంగా ప్రవర్తించారు. దానికి మీరే సాక్షి’అంటూ ప్రకాశ్‌రాజ్ ఒక లేఖ రాశారు.

‘‘ఆరోజు జరిగిన ఘటనలకు సంబంధించిన విజువల్స్‌ లీకయ్యాయి. ప్రజలతో పాటు ‘మా’ సభ్యులు కూడా నిజమేంటో తెలుసుకోవాలనుకుంటున్నారు. పోలింగ్‌ సమయంలో సీసీ కెమెరాల గురించి మీరు వివరించారు. అన్నింటిని మీరు రికార్డు చేసి ఉంటారని భావిస్తున్నా. దాన్ని మాకు అందించాల్సిందిగా అభ్యర్థిస్తున్నా’’ అని లేఖలో పేర్కొన్నారు.

ప్రకాశ్‌ రాజ్‌ లేఖపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ వెంటనే స్పందించారు. ఎన్నికలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ భద్రంగా ఉందని, నిబంధనల ప్రకారం ప్రకాశ్‌రాజ్‌కు అందిస్తామని ప్రకటించారు.

చికెన్

ఫొటో సోర్స్, iStock

ప్రాణం తీసిన చికెన్‌ గ్రేవీ, శీతల కూల్‌డ్రింక్

ఆహారంలో తీసుకున్న చికెన్‌ గ్రేవీ, శీతల పానీయం విషతుల్యమై కుమార్తెతో సహా తల్లి మరణించారని సాక్షి ఓ కథనం ప్రచురించింది.

‘‘తూత్తుకుడి జిల్లా కోవిల్‌ పట్టిలోని తంగప్ప నగర్‌కు చెందిన కర్పగం(30) తన ఇంటి సమీపంలోని ఓ హోటల్‌లో చికెన్‌ గ్రేవిని బుధవారం కొన్నారు.

మధ్యాహ్నం భోజనంలో ఆ చికెన్‌ గ్రేవీని కుమార్తె దర్శిని(4)తో పాటు కర్పగం తీసుకున్నారు.

అజీర్ణం సమస్య తలెత్తడంతో మరో దుకాణంలో ఓ శీతలపానీయం బాటిల్‌ తీసుకొచ్చి తల్లి, కుమార్తె తాగారు. కొంతసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఇరుగుపొరుగు ఆస్పత్రికి తరలిస్తుండగా వారు మరణించారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వారి మరణానికి కారణాలేమిటో పోస్టుమార్టం నివేదికలో తేలాల్సి ఉంది’’ అని సాక్షి ఓ కథనం ప్రచురించింది.

తెలంగాణ హైకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

నేడు ఏడుగురు జడ్జీల ప్రమాణం

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు శుక్రవారం ప్రమాణం చేయనున్నారని నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.

‘‘ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి హైకోర్టు ఫస్ట్‌ కోర్టు హాలు వేదిక కానున్నది.

కొత్త న్యాయమూర్తులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ ప్రమాణం చేయిస్తారని రిజిస్ట్రార్‌ జనరల్‌ అనుపమ చక్రవర్తి తెలిపారు.

కొత్త న్యాయమూర్తులు ఈ నెల 18న ప్రమాణం చేయాలని తొలుత భావించారు. విజయదశమి పండుగ నాడు ప్రమాణం చేసేందుకే ఎక్కువమంది ఆసక్తి చూపడంతో తేదీని శుక్రవారానికి మార్చారు.

ఒకేసారి ఏడుగురు న్యాయమూర్తులు ప్రమాణం చేయనుండటం హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి అవుతుంది’’అని నమస్తే తెలంగాణ తెలిపింది.

ఆర్యన్ ఖాన్

ఫొటో సోర్స్, aryankhan/Instagram

ఆర్యన్‌ ఖాన్‌కు ''విదేశాల్లోని డ్రగ్స్ వ్యాపారులతోనూ అతడికి సంబంధాలు''

షారూఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ తరచూ డ్రగ్స్‌ తీసుకునేవాడని ముంబయి కోర్టులో మాదకద్రవ్యాల నిరోధక బృందం(ఎన్‌సీబీ) తెలిపిందని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

‘‘ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఎన్డీపీఎస్‌ ప్రత్యేక కోర్టు విచారణ సందర్భంగా ఎన్‌సీబీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అనిల్‌ సింగ్‌ వాదనలు వినిపించారు.

‘విదేశాల్లో డ్రగ్స్‌ పెడ్లర్లతోనూ అతనికి సంబంధాలున్నట్లు వాట్సాప్‌ చాటింగ్‌ డేటా చెబుతోంది. విదేశాంగ శాఖ అధికారుల సాయంతో వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం’’ అని అధికారులు వివరించారు.

ఆర్యన్‌ తరఫున వాదించిన అమిత్‌ దేశాయ్‌ ఈ ఆరోపణలను ఖండించారు. ఆర్యన్‌ వద్ద డ్రగ్స్‌ దొరకనేలేదని, వాట్సాప్‌ చాటింగ్‌ ఆధారంగా నిర్బంధించడం సరికాదన్నారు.

బెయిల్‌పై తీర్పును న్యాయమూర్తి 20వ తేదీకి రిజర్వ్‌ చేశారు. దీంతో ఆర్యన్‌ను తిరిగి ముంబై ఆర్థర్‌రోడ్‌ జైలుకు పంపారు. కాగా, మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ అల్లుడు సమీర్‌ ఖాన్‌కు బెయిల్‌ మంజూరైంది’’అని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)