ISWOTY - సంధ్య రంగనాథన్: ఫుట్‌బాల్ ఆటలోనే ఆనందాన్ని వెతుక్కున్నారు

సంధ్య రంగనాథన్

ఫొటో సోర్స్, sethufc.com

ఫొటో క్యాప్షన్, సంధ్య రంగనాథన్

ఆటలంటే కేవలం ఉల్లాసం కాదు... కొందరికి అదే జీవితం. తమిళనాడు అమ్మాయి సంధ్య రంగనాథన్‌‌‌కు ఇదే వర్తిస్తుంది.

ఆమె అందరిలా సాధారణమైన బాల్యం అనుభవించలేదు. ప్రభుత్వ హాస్టల్‌లో పెరిగారు.

ఫుట్‌బాల్ ఆటలోనే ఆమె తన కుటుంబాన్ని వెతుక్కున్నారు. అదే క్రీడలో ఎదిగి, పేరు తెచ్చుకున్నారు.

సంధ్య రంగనాథన్

ఫొటో సోర్స్, the-aiff.com

1998 మే 20న తమిళనాడులోని కడలూరు జిల్లాలో రంగనాథన్ పుట్టారు.

తల్లిదండ్రులు విడిపోవడంతో ఆమె చిన్న వయసులోనే ప్రభుత్వ హాస్టల్‌లో చేరాల్సి వచ్చింది.

ఆమె తండ్రి కుటంబం నుంచి దూరంగా వెళ్లిపోయారు. తల్లికి ఆమెను సొంతంగా పెంచి పెద్ద చేసే స్తోమత లేదు.

హాస్టల్‌లో తన సీనియర్లు ఫుట్‌బాల్ ఆడుతుంటే చూసి, సంధ్య కూడా ఆ ఆట ఆడటం మొదలుపెట్టారు.

సీనియర్లు పోటీల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాలకు వెళ్తుండేవారు.

సంధ్యకు కూడా అలా కొత్త ప్రాంతాలకు వెళ్లాలని చాలా ఆశ. ఇదే ఆమెకు స్ఫూర్తినిచ్చింది. ఆరో తరగతిలోనే ఆమె ఫుట్‌బాల్ ఆడటం మొదలుపెట్టారు.

మొదట్లో వసతులు సరిగ్గా ఉండేవి కావు. కడలూరులో ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేసేందుకు సరైన గడ్డి మైదానం కూడా ఉండేది కాదు.

మైదానాలు గరుకుగా ఉన్నా, అక్కడి కోచ్‌లు మాత్రం చాలా సౌమ్యంగా ఉండేవారు. సంధ్యను వాళ్లు కూతురిలా చూసుకున్నారు.

అయినా, తల్లిదండ్రులు దగ్గర లేని లోటు సంధ్యను వేధించేది.

సంధ్యను చూసేంందుకు ఆమె తల్లి అప్పుడప్పుడు హాస్టల్‌కు వచ్చేవారు. అయితే, సాధారణ తల్లి, బిడ్డల మధ్య ఉన్న బంధమైతే వారి మధ్య లేదు.

సంధ్య ఫుట్‌బాల్‌నే తన ప్రపంచంగా చేసుకున్నారు. ఫుట్‌బాల్ ఆడాలి, చదువుకోవాలి. ఆమె జీవితంలో ఈ రెండింటికే స్థానం.

తిరవల్లవూరు యూనివర్సిటీ నుంచి సంధ్య కామర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం కడలూరులోని సెయింట్ జోసెఫ్స్ కాలేజీలో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్స్ చదువుకుంటున్నారు.

సంధ్య రంగనాథన్

వ్యక్తిగత జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కున్నా, అందరిలా కుటుంబం మధ్య పెరగకపోయినా... హాస్టల్ జీవితాన్ని సంధ్య వరంలా భావించారు.

అక్కడ ఆమె ఏ ఆంక్షలూ లేకుండా ఆడుకోగలిగారు. తన ఆటకు తల్లి కూడా ఎప్పుడూ అడ్డు చెప్పలేదని సంధ్య అన్నారు.

తాను మంచి అటాకింగ్ ఫార్వర్డ్ ప్లేయర్‌గా ఎదగడంలో తిరువల్లవూరు యూనివర్సిటీ‌లోని కోచ్ ఎస్ మరియప్పన్, కడలూరులోని ఇందిరా గాంధీ అకాడమీ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థ పాత్ర చాలా కీలకమని ఆమె అంటున్నారు.

నేపాల్‌లో జరిగిన ఎస్ఏఎఫ్ఎఫ్ మహిళల చాంపియన్‌షిప్ టోర్నీలో భారత్‌కు సంధ్య ప్రాతినిధ్యం వహించారు. ఆ టోర్నీలో భారత్ టైటిల్ గెలిచింది. గోల్ స్కోరర్లలో ఒకరిగా నిలిచి సంధ్య ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు.

13వ సౌత్ ఏసియన్ గేమ్స్‌లోనూ భారత్‌కు టైటిల్ దక్కడంలో ఆమె పాత్ర ఉంది.

2020లో ఐడబ్ల్యూఎల్ నాలుగో సీజన్‌లో టాప్ స్కోరర్ల జాబితాలో సంధ్య రెండో స్థానంలో నిలిచారు.

ఫుట్‌బాల్ ఆటలో మరింత మెరుగుయ్యేందుకు సంధ్య బాగా శ్రమిస్తున్నారు.

క్రీడాకారిణులు రాణించేందుకు ఆర్థిక భద్రత కూడా ముఖ్యమని ఆమె అంటున్నారు. ఇందుకోసం క్రీడల్లో విజయవంతమైన మహిళలకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పక్కా ఉద్యోగాలు కల్పించాలని ఆమె కోరుతున్నారు.

(సంధ్య రంగనాథన్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ కథనానికి ఆధారం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)