కరోనావైరస్: ప్రెగ్నెన్సీ టెస్ట్ లాగా... గంటలోనే ఫలితం చెప్పే పేపర్ కోవిడ్ పరీక్ష

ఫెలూదా
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్, కృతిక పతి
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ

భారత శాస్త్రవేత్తల బృందం ఒకటి కాగితంతో కోవిడ్-19 నిర్ధరణ పరీక్ష విధానాన్ని అభివృద్ధి చేసింది. దీనిద్వారా గర్భనిర్ధారణ పరీక్ష తరహాలో వేగంగా ఫలితం తెలుస్తుందని చెప్తున్నారు.

క్రిస్పర్ అనే జీన్యుసవరణ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఈ టెస్ట్‌ను రూపొందించారు. ఈ టెస్ట్ కిట్‌కి భారతీయ కాల్పనిక టెటెక్టివ్ పాత్ర పేరు 'ఫెలూదా' అని శాస్త్రవేత్తలు నామకరణం చేశారు.

ఈ కిట్ ధర రూ. 500 వరకూ ఉంటుందని.. గంట లోపలే ఫలితం వెలువడుతుందని చెబుతున్నారు.

టాటా గ్రూప్ సంస్థ ఈ ఫెలుదాను తయారు చేస్తుంది. ప్రపంచంలో మార్కెట్‌లో లభ్యమయ్యే తొలి పేపర్ బేస్డ్ కోవిడ్-19 టెస్ట్ ఇదే అవుతుంది.

''ఇది చాలా సింపుల్ టెస్ట్. కచ్చితమైన, విశ్వసనీయమైన ఫలితాలను ఇస్తుంది'' అని భారత ప్రభుత్వ ముఖ్య సైన్స్ సలహాదారు ప్రొఫెసర్ కె. విజయ్ రాఘవన్ బీబీసీతో పేర్కొన్నారు.

కోవిడ్ టెస్ట్

ఫొటో సోర్స్, EPA

దిల్లీలోని జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) పరిశోధకులు ఈ 'ఫెలూదా'ను తయారుచేశారు. ఈ కేంద్రంతో పాటు ప్రైవేటు లేబరీటరీల్లోనూ దాదాపు 2,000 మంది రోగులపై దీనిని పరిశీలించారు.

ఈ కొత్త పరీక్ష 96 శాతం సెన్సిటివిటీ, 98 శాతం స్పెసిఫిసిటీ ఉన్నట్లు గుర్తించారు. టెస్ట్ కచ్చితత్వం ఈ రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది.

అత్యధిక సెన్నిటివ్ ఉన్న టెస్ట్.. దాదాపుగా వ్యాధి ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తిస్తుంది. అధిక స్పెసిఫిటీ ఉన్న టెస్టు.. దాదాపుగా ఈ వ్యాధి లేని ప్రతి ఒక్కరినీ గుర్తిస్తుంది.

మొదటి దానివల్ల తప్పుగా నెగిటివ్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. రెండో దానివల్ల తప్పుగా పాజిటివ్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. ఈ టెస్టును వాణిజ్యపరంగా ఉపయోగించటానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది.

ఐజీఐబీ పరిశోధకుల బృందం
ఫొటో క్యాప్షన్, ఈ కొత్త పరీక్షను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ పరిశోధకులు తయారుచేశారు

భారతదేశంలో ప్రస్తుతం 60 లక్షలకు పైగా నిర్ధారిత కేసులు ఉన్నాయి. ఈ కేసుల సంఖ్యలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. దేశంలో ఇప్పటివరకూ లక్ష మందికి పైగా చనిపోయారు.

ప్రస్తుతం దేశంలో దాదాపు 1,200 లేబరేటరీల్లో రోజుకు సుమారు లక్ష టెస్టులు చేస్తున్నారు. రెండు రకాల పరీక్షలను ఉపయోగిస్తున్నారు.

ఒకటి.. పాలీమెరేస్ చైన్ రియాక్షన్ - అంటే పీసీఆర్ స్వాబ్ టెస్ట్. ఇందులో వైరస్ జన్యుపదార్థాన్ని పెద్దది చేసి చూడటానికి రసాయనాలు ఉపయోగిస్తారు. రెండోది యాంటీజెన్ టెస్టు. ఇందులో రక్తం నమూనాలో వైరస్ అవశేషాలను గుర్తిస్తారు.

ప్రస్తుతం పీసీఆర్ టెస్టును విశ్వసనీయమైనదిగా పరిగణిస్తున్నారు. దీని ధర రూ. 2,400 వరకూ ఉంది. ఇందులో తప్పుగా పాజిటివ్ కానీ, తప్పుగా నెగెటివ్ కానీ వచ్చే అవకాశం తక్కువ. యాంటీజెన్ పరీక్షలు చౌక. వేలి నుంచి రక్తం తీసుకుని వైరస్ ఇన్‌ఫెక్షన్ ఉందేమో చూస్తారు. పాజిటివ్ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించటంలో ఖచ్చితత్వం ఉంటుంది కానీ.. పీసీఆర్ టెస్టు కన్నా ఎక్కువ సంఖ్యలో తప్పుగా నెగెటివ్ చూపించే అవకాశముంది.

కోవిడ్ టెస్ట్

ఫొటో సోర్స్, EPA

దేశంలో కోవిడ్ పరీక్షల సంఖ్యను పెంచటం ఇంకా సులువు కాలేదని గ్లోబల్ హెల్త్ పాలసీ పరిశోధకుడు డాక్టర్ అనంత్ భాన్ పేర్కొన్నారు.

''కిట్ల కొరత, ఫలితాల కోసం సుదీర్ఘంగా నిరీక్షించటం కొనసాగుతోంది. అదీగాక ఎక్కువగా రాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేస్తున్నారు. దీనివల్ల తప్పుగా నెగెటివ్‌లు వచ్చి సమస్యలు పెరిగే అవకాశముంది'' అని ఆయన బీబీసీతో చెప్పారు.

ఈ యాంటీజెన్ పరీక్ష స్థానంలో కొత్తగా రూపొందించిన ఫెలుదా పరీక్ష రావచ్చునని ఆయన భావిస్తున్నారు.

''పీసీఆర్ టెస్టుకు ఉన్నంత విశ్వసనీయత ఈ కొత్త టెస్టుకు ఉంది. అంతకన్నా వేగంగా ఫలితాలు వస్తాయి. చిన్నపాటి లేబరేటరీల్లోనూ చేయవచ్చు. ధర కూడా తక్కువ'' అని ఐజీఐబీ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ బీబీసీకి తెలిపారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

ఫెలుదా పరీక్షకు శాంపిళ్ల సేకరణ పీసీఆర్ టెస్ట్ తరహాలోనే ఉంటుంది. అంటే ముక్కు నుంచి నమూనాలు సేకరిస్తారు. దేశంలో ఉమ్ము నమూనాల నుంచి కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలకు అనుమతి లేదు.

కొత్త ఫెలూదా పరీక్షలో శాంపిల్స్‌ను క్రిస్పర్ సాంకేతిక విధానం ద్వారా పరీక్షిస్తారు. ఈ టెస్ట్.. నమూనాల్లోని కొత్త కరోనావైరస్ జన్యు సంకేతాలను గుర్తించి.. కాగితం మీద దానిని తెలియజేస్తుంది.

ఈ టెస్టు కాగితం మీద రెండు బ్లూ లైన్లు ఉంటే పాజిటివ్ అని.. ఒకటే బ్లూ లైన్ ఉంటే నెగెటివ్ అని అర్థం.

''టెస్టింగ్ అనేది ఇంకా చాలా పరిమిత వనరుగానే ఉంది. దీని లభ్యత పెంచటానికి శాయశక్తులా కృషి చేయాలి. ఆ దిశగా ఫెలూదా చాలా ముఖ్యమైన ముందడుగు'' అని హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకుడు డాక్టర్ స్టీఫెన్ కిస్లర్ చెప్పారు.

పీసీఆర్, యాంటీజెన్ టెస్టుల తర్వాత క్రిస్పర్ ఆధారిత పరీక్షలు మూడో వెల్లువ పరీక్షల అని హార్వర్డ్ గ్లోబల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకుడు డాక్టర్ థామస్ త్సాయ్ అభివర్ణించారు.

అమెరికా, బ్రిటన్‌లో సైతం కొన్ని కంపెనీలు ఇదే తరహా పేపర్ స్ట్రిప్ పరీక్షలను అభివృద్ధి చేస్తున్నాయి.

కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకోవాలంటే వ్యాక్సీన్ అందుబాటులోకి రావటం కీలకం. కానీ.. సాధారణ పరిస్థితి నెలకొందనే భావనను సాధించటానికి ఒక విశ్వసనీమైన, అందుబాటులో గల పరీక్ష చాలా ముఖ్యం అని పరిశోధకులు అంటున్నారు.

కరోనావైరస్ హెల్ప్ లైన్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)