కరోనావైరస్‌తో వణుకుతున్న స్టాక్ మార్కెట్‌... గంటలో రూ.10లక్షల కోట్లు ఆవిరి

స్టాక్ మార్కెట్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దినేశ్ ఉప్రేతీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత స్టాక్ మార్కెట్‌పై కరోనావైరస్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సోమవారం షేర్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి.

బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌లోని సెన్సెక్స్ సూచీ 3,934.72 పాయింట్లు పతనమై 25,981.24 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌లోని నిఫ్టీ సూచీ 1,135.20 పాయింట్లు నష్టపోయి,7,610.25 పాయింట్ల వద్ద ముగిసింది.

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రంతోపాటు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్‌డౌన్ లాంటి చర్యలను ప్రకటించాయి. ఫలితంగా చాలా సంస్థల్లో ఉత్పత్తి ఆగిపోయింది. నడుస్తున్న కొన్ని సంస్థలు కూడా ఆగిపోయే దిశగానే సాగుతున్నాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్లో షేర్లు పేక మేడల్లా కూలిపోతున్నాయి.

స్టాక్ మార్కెట్

ఫొటో సోర్స్, Getty Images

సోమవారం ఉదయం గందరగోళం మధ్య మార్కెట్ 10 శాతం పడిపోయి లోయర్ సర్క్యూట్‌లోకి వెళ్లింది. దీంతో ఉదయం 9.58కి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌లో 45 నిమిషాల పాటు ట్రేడింగ్ నిలిపివేశారు.మార్కెట్ ప్రారంభమైన గంటలోనే దాదాపు రూ.10 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోయింది.

మార్కెట్ లోయర్ సర్య్యూట్‌లోకి వెళ్లి, ట్రేడింగ్ నిలిచిపోవడం ఈ నెలలో ఇది రెండోసారి.

ఇదివరకు మార్చి 13న కూడా ఇలాగే జరిగింది.

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒకే నెలలో రెండు సార్లు లోయర్ సర్క్యూట్‌ల్లోకి వెళ్లి, ట్రేడింగ్ నిలిపివేయాల్సి రావడం ఇదే మొదటిసారి.

ఇదివరకు హర్షద్ మెహతా కుంభకోణం బయటకు వచ్చినప్పుడు 1992 ఏప్రిల్ 28న, ఎన్నికల అనిశ్చితి వల్ల 2004 మే 17న, పీ-నోట్స్ కారణంగా 2007 అక్టోబర్ 17న, సబ్‌ప్రైమ్ సంక్షోభం వల్ల 2008 జనవరి 22న మార్కెట్ లోయర్ సర్క్యూట్‌లోకి వెళ్లింది.

కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

ప్రస్తుత సంకట పరిస్థితులను తట్టుకుని నిలబడుతున్న షేర్లను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. బ్యాంకింగ్ షేర్లు తీవ్రంగా కుదేలవుతున్నాయి.

ప్రైవేటు బ్యాంకులతోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు కూడా తీవ్ర నష్టాల్లో నడుస్తున్నాయి. సూచీలో అధిక వాటా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ షేర్ల విక్రయాలు కూడా పెద్ద ఎత్తున సాగుతున్నాయి.

గత నెల రోజులుగా చాలా వరకు బ్యాంకింగ్ షేర్లు 50 శాతం మేర పడిపోయాయి. సగం ధరకు కూడా వాటిని కొనుగోలు చేసేందుకు మదుపరులు ఆసక్తి చూపడం లేదు.

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

ప్రస్తుతం దేశంలో కరోనావైరస్ సంక్షోభం చాలా కీలకమైన, సున్నితమైన దశలో ఉందని దిల్లీలోని ఓ బ్రోకరేజ్ సంస్థకు చెందిన రీసెర్చ్ అనలిస్ట్ ఆసిఫ్ ఇక్బాల్ అన్నారు.

''కరోనావైరస్ విషయంలో చైనా, ఇటలీ తరహా పరిస్థితి భారత్‌లోనూ రావొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న షేర్ మార్కెట్లపై దీని ప్రభావం కనిపిస్తోంది. భారత్ కూడా దీన్ని తప్పించుకోలేదు. కరోనావైరస్ వ్యాప్తిపై నియంత్రణ సాధించి, ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడితేనే దలాల్ స్ట్రీట్‌ను కాపాడుకోగలం'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయ కారణాలతోపాటు కరోనావైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల ప్రభావం కూడా మార్కెట్‌పై కనిపిస్తోంది.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?

దిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, బిహార్, జమ్మూకశ్మీర్, చంఢీగడ్‍‌లు మార్చి 31 వరకూ లాక్‌డౌన్ ప్రకటించాయి.

మారుతీ సుజుకి ఇండియా, మాహీంద్రా అండ్ మహీంద్రా ఉత్పత్తి కార్యకలాపాలను ఆపేశాయి. ఎల్జీ సహా చాలా సంస్థలు ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి.

షేర్ మార్కెట్‌లో గందరగోళం ఇప్పుడుప్పుడే తగ్గదని మార్కెట్ నిపుణుడు వివేక్ మిత్తల్ అంటున్నారు.

''ఈ పతనం వెనుక దేశీయ కారణాలు లేవు. అదే సమస్య. మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలను మనం తప్పుపట్టలేం. కరోనా మహమ్మారి దాదాపు 190 దేశాలకు పాకింది. కొరియా, జపాన్, భారత్, చైనా సహా ఆసియా మార్కెట్లను భయం కమ్మేసింది. అమెరికాలోని వాల్ స్ట్రీట్, యూరోపియన్ మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి'' అని ఆయన అన్నారు.

Sorry, your browser cannot display this map