లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు

మహిళా రిజర్వేషన్ బిల్లు

ఫొటో సోర్స్, Getty Images

మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

మహిళలకు రిజర్వేషన్లు కల్పించే 'నారీ శక్తి వందన’ చట్టానికి రాజ్యాంగ సవరణ ప్రతిపాదనను లోక్‌సభలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టారు.

కొత్త పార్లమెంట్‌ భవనంలో సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే కేంద్ర ప్రభుత్వం ఈ తొలి బిల్లును ప్రవేశపెట్టింది.

దీనిని సమర్పిస్తూ, ప్రధాని మోదీ మాట్లాడారు.

"మహిళల రిజర్వేషన్‌కు సంబంధించి ఇంతకుముందు కూడా పార్లమెంట్‌లో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. దీనికి సంబంధించిన బిల్లును మొదటిసారిగా 1996లో సమర్పించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అటల్ జీ హయాంలో చాలాసార్లు సమర్పించారు. కానీ మేము దానిని ఆమోదించడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సమకూర్చుకోలేకపోయాం. స్త్రీలకు హక్కులు కల్పించే బిల్లును ప్రవేశపెట్టే అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు" అని మోదీ చెప్పారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది.

సాధారణంగా కేబినెట్ మీటింగ్ తరువాత విలేఖరుల సమావేశంలో ముఖ్యాంశాలు వివరిస్తారు. సోమవారం కేబినెట్ సమావేశం తరువాత ఈ సంప్రదాయాన్ని పాటించలేదు.

అయితే, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ, జలశక్తి శాఖల సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, మోదీ ప్రభుత్వం మహిళా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపడం ద్వారా మహిళా రిజర్వేషన్లకు మార్గం సుగమం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసిందని సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. ఆ తరువాత కాసేపటికి ఆయన తన ట్వీట్‌ను తొలగించారు.

సోమవారం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ, మహిళా బిల్లును కేబినెట్ ఆమోదించినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

మహిళా రిజర్వేషన్

ఫొటో సోర్స్, Getty Images

కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఈ అంశంపై ఎక్స్(ట్విటర్)‌లో స్పందించారు. “కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం డిమాండ్ చేస్తోంది. ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిందన్న వార్తలను మేము స్వాగతిస్తున్నాం. ప్రత్యేక సమావేశాల ముందు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో దీని గురించి చర్చిస్తే బావుండేది. తెరచాటు రహస్య మంతనాలకు బదులు అందరి మద్దతు కూడగట్టడానికి వీలుండేది. ఈ బిల్లు వెనుక చరిత్ర ఇదీ” అంటూ బిల్లుకు సంబంధించిన కొన్ని వివరాలతో ఆయన ట్వీట్ చేశారు.

పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్ కలిపిస్తూ 1989 మేలో రాజీవ్ గాంధీ మొదటిసారి బిల్లులను ప్రవేశ పెట్టారని జైరామ్ రమేష్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు 1993 ఏప్రిల్‌లో ఆ బిల్లులకు కొన్ని సవరణలు చేసి మరోసారి సభలో ప్రవేశ పెట్టి ఆమోదింపజేసి చట్టంగా మార్చారని చెప్పారు.

ప్రస్తుతం దేశంలోని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో 15 లక్షల మంది మహిళా ప్రజా ప్రతినిధులు ఉన్నారని, ఇది 40 శాతం కంటే ఎక్కువ అని ఆయన చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఇటీవల దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఒక రోజు ఆందోళన నిర్వహించిన ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ నాయకురాలు కవిత కూడా ఈ అంశంపై ట్వీట్ చేశారు.

”మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్నారు. ఇది దేశంలోని ప్రతి మహిళ విజయం. ఈ సందర్భంలో దేశ పౌరులకు, సోదర సోదరిమణులకు నా శుభాకాంక్షలు.

లోక్‌సభలో అధికార పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా బిల్లు ఆమోదం పొందుతుందని అనుకుంటున్నాను. బీజేపీ ఒకసారి కాదు రెండు సార్లు.. 2014,2019 మేనిఫెస్టోల్లో ఈ బిల్లు గురించి హామీ ఇచ్చింది. అయితే దాన్ని అమలు చేయడంలో రాజకీయపరమైన దృఢచిత్తం లోపించింది.

మహిళలు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు, తమకు అర్హమైన వాటా సాధించేందుకు ఇదే సరైన సమయం. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కొత్త అధ్యాయన్ని ప్రారంభించేందుకు ఇదే ప్రారంభం. మహిళా సాధికారతతో దేశాన్ని బలోపేతం చెయ్యడం ఇకపై ఎంత మాత్రం సుదూర స్వప్నం కాదు” అని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)