ఉత్తరాఖండ్: కూలిన సొరంగంలో చిక్కుకున్న 40 మంది ఆరు రోజులుగా ఏం తింటున్నారు... ఎలా బతికి బయటపడతారు?

సొరంగం

ఫొటో సోర్స్, REUTERS

    • రచయిత, మెరిల్ సెబాస్టియన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్తరాఖండ్‌లో సొరంగం కూలిపోయింది. అందులో చిక్కుకున్న 40 మంది కార్మికులను రక్షించేందుకు ఆరు రోజుల నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి

అసలేం జరిగింది?

ఈ నెల 12న సమీపంలోని కొండచరియలు సొరంగంపై పడటంతో అది కూలిపోయింది. దీంతో సొరంగంలో పనిచేస్తున్న 40 మంది కార్మికులు అందులోనే చిక్కుకున్నారు.

అనంతరం కార్మికులకు ఆక్సిజన్ సరఫరా కూడా నిలిచిపోయింది.

సిల్క్యారా నుంచి సొరంగం వైపు 200 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

60 మీటర్ల మేర పేరుకుపోయిన శిథిలాలలో పైపును ఏర్పాటు చేయడానికి శుక్రవారం మధ్యాహ్నం నాటికి 24 మీటర్ల వరకు తవ్వారు సహాయక సిబ్బంది.

"పని ఇదే స్థాయిలో కొనసాగితే, కార్మికులను రక్షించడానికి మరో 40-48 గంటల సమయం పడుతుంది" అని రెస్క్యూ ఆపరేషన్స్ ఇన్‌ఛార్జ్ కల్నల్ దీపక్ పాటిల్ శుక్రవారం తెలిపారు.

ఉత్తరాఖండ్

ఫొటో సోర్స్, UTTARAKHAND STATE DISASTER RESPONSE FORCE

ఈ సొరంగం ఏమిటి?

ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారా, దండల్‌గావ్‌లను కలుపుతూ ఈ సొరంగం నిర్మిస్తున్నారు.

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు కనెక్టివిటీని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 12 వేల కోట్లతో చేపట్టిన హైవే ప్రాజెక్ట్‌లో ఉత్తరకాశీ జిల్లాలోని సొరంగం భాగం ఒకటి.

ఈ ప్రాంతం హిందువుల పవిత్ర స్థలాలకు ప్రసిద్ధి, హిమాలయ శిఖరాలు, హిమానీ నదాలు ఉన్న రాష్ట్రం.

ఈ 4.5 కి.మీ. సొరంగం హిమాలయాల్లోని యమునోత్రికి కనెక్టివిటీని అందించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఉత్తరకాశీ, యమునోత్రి పట్టణాల మధ్య ప్రయాణ దూరాన్ని 26 కి.మీ (16 మైళ్లు) మేర తగ్గించనుంది.

బద్రీనాథ్ ఆలయానికి చేరుకోవడానికి గంగోత్రి, కేదార్‌నాథ్ గుండా సాగే చార్‌ధామ్ యాత్రకు యమునోత్రి ప్రారంభ స్థానం కావడంతో ప్రతి సంవత్సరం వేలాదిమంది భక్తులు అక్కడికి చేరుకుంటారు.

సొరంగం నిర్మాణానికి 2018లో కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే పర్యావరణ నిపుణులు దాని నిర్మాణాన్ని వ్యతిరేకించారు.

"అత్యంత దుర్బలంగా ఉండే హిమాలయాలకు సమీపంలో సొరంగాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు, అధికారులు కొంత భౌగోళిక పరిశోధనను నిర్వహించి ఉండాలి" అని 'ది హిందూ' వార్తాసంస్థతో నవీన్ జుయల్ అనే భూగర్భ శాస్త్రవేత్త చెప్పారు.

ఉత్తరాఖండ్ సొరంగం

ఫొటో సోర్స్, Getty Images

చిక్కుకున్న వాళ్లెవరు?

సొరంగంలో చిక్కుకున్న వారిలో ఎక్కువ మంది వలస కార్మికులే.

40 మందిలో 15 మంది జార్ఖండ్‌, 8 మంది ఉత్తరప్రదేశ్, ఐదుగురు ఒడిశా, నలుగురు బిహార్, ముగ్గురు బెంగాల్, ఇద్దరు అస్సాం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌ల నుంచి ఒక్కొక్కరు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

రెస్క్యూ సిబ్బందికి సహాయం చేసేందుకు జార్ఖండ్ ప్రభుత్వం ముగ్గురు సభ్యుల బృందాన్ని పంపింది.

ఆదివారం ఉదయం సొరంగం పైకప్పు నుంచి శిథిలాలు పడటం గమనించిన కొద్దిమంది కార్మికులలో 21 ఏళ్ల శర్మన్ బాత్రా ఒకరు.

ఆయనతో పాటు ఆనంద్ తుడు (24), సంతోష్ పండిట్ (40), పెమ్ యాదవ్ (29)లు సొరంగం కూలిపోవడానికి ముందే తప్పించుకోగలిగారు.

వారిప్పుడు తమ సహచరుల కోసం బయట వేచి ఉన్నారు.

"ఇలాంటివి జరిగినప్పుడు, నిరాశ, విచారంగా అనిపిస్తుంది. నాకు తినాలనిపించడం లేదు. కుంగుబాటుగా అనిపిస్తోంది" అని బీబీసీతో చెప్పారు బాత్రా .

ప్రాణాలు పణంగా పెట్టి సొరంగం నిర్మాణంలో పనిచేయవద్దని ఆయన కుటుంబీకులు కూడా సూచించారు. కుటుంబీకులు వారికి డబ్బు పంపి, ఇంటికి తిరిగి రావాలని కోరారు.

కానీ బాత్రా మాత్రం తన సహచర కార్మికులు బయటికి వచ్చిన తర్వాతే తిరిగి వస్తారని చెప్పారు.

సొరంగంలో కార్మికులకు ఆహారం ఎలా?

చిక్కుకున్న వ్యక్తులతో ఆదివారం రాత్రి వాకీటాకీల ద్వారా కనెక్టివిటీ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

టన్నెల్‌‌లో నీటి సరఫరాకు గతంలోనే పైప్‌లైన్ వేశారు. ఇపుడు సొరంగంలో చిక్కుకున్న వారికి ఆక్సిజన్, ఆహారం (డ్రై ఫ్రూట్స్, బాదం) నీరు దీని ద్వారానే సరఫరా చేస్తున్నారు.

"ఆహార పదార్థాలు వారికి తగినంత కేలరీలను అందిస్తున్నాయి, ఇది వారికి 9 రోజుల వరకు సహాయపడుతుంది" అని రాయిటర్స్‌తో ఉత్తరకాశీ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్సీఎస్ పవార్ అన్నారు .

కార్మికులకు జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులకు సంబంధించిన మందులను కూడా పైపుల ద్వారా పంపినట్లు అధికారులు చెబుతున్నారు.

కొంతమంది కార్మికుల కుటుంబ సభ్యులు తమ వారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నామని బీబీసీకి తెలిపారు.

అయితే టన్నెల్ సమీపంలో ఆరు పడకల వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు, సమీపంలోని ఆసుపత్రులు కూడా సిద్ధమైనట్లు రిపోర్టులు ఉన్నాయి.

రెస్క్యూ ప్లాన్

రెస్క్యూ ప్లాన్ ఏమిటి?

సొరంగంలోని శిథిలాలను తవ్వి పైపును అమర్చి, దాని గుండా కార్మికులు బయటకు రావాలనేది ప్లాన్.

60 మీటర్ల మేర శిథిలాలను తొలగించి, పైపులు వేయడానికి డ్రిల్‌ వేయాల్సి వచ్చిందని వారు తెలిపారు. మంగళవారం లేదా బుధవారం రాత్రికి రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

అయితే, కొన్ని అడ్డంకుల కారణంగా డ్రిల్లింగ్ పనుల్లో వేగం ఆశించినంతగా జరగడం లేదని, దీంతో వారిని చేరుకొనే ప్రక్రియ క్లిష్టతరం అవుతోందని ఉత్తరాఖండ్ పోలీసు చీఫ్ అశోక్ కుమార్ బీబీసీకి తెలిపారు.

బుధవారం రాత్రి సైనిక విమానం ద్వారా కొన్ని కొత్త పరికరాలను తీసుకువచ్చారు. ఈ డ్రిల్ మెషీన్ మూడు భాగాలుగా ఉంది. వాటిని ప్రమాద స్థలంలో అమర్చారు.

కొత్త డ్రిల్ పరికరం రెస్క్యూ ప్రక్రియను వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు.

మెటల్ పైపు (900 మి.మీ. వ్యాసం) అమర్చడానికి తగినంత వెడల్పుతో రంధ్రాన్ని డ్రిల్లింగ్ చేస్తున్నారు కార్మికులు. చిక్కుకున్న మనుషులు పాకుతూ రావడానికి దానిని ఏర్పాటు చేస్తున్నారు.

రెస్క్యూ ఆపరేషన్‌కు అంతరాయం లేకుండా బ్యాకప్‌గా శనివారం మధ్యప్రదేశ్ నుంచి మరొక యంత్రాన్ని తీసుకురానున్నట్లు అధికారులు చెబుతున్నారు.

సొరంగం లోపల చాలా స్థలం ఉందని, దాని గోడలు 400 మీటర్ల వెడల్పుతో చాలా మందంగా ఉన్నాయని కల్నల్ దీపక్ పాటిల్ చెప్పారు.

"లోపల రెండు కిలోమీటర్ల వరకు చాలా పెద్ద లైట్లు ఉన్నాయి, గాలి కూడా ఉంది" అని ఆయన బీబీసీతో చెప్పారు.

కాబట్టి సొరంగం లోపల ఏ సమస్యా ఉండదని, వారికి తగినంత గాలిని పంపుతున్నామని దీపక్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)