వైరల్: శవాన్ని రేప్ చేయకుండా సమాధిపై ఇనుప తలుపు పెట్టారనే వార్తల్లో నిజమెంత? ఇది పాకిస్తాన్లోదా, హైదరాబాద్లోదా?
- రచయిత, మహమ్మద్ సుహేబ్
- హోదా, బీబీసీ ఉర్దూ
పాకిస్తాన్లో చనిపోయిన మహిళలను ఖననం చేసిన తర్వాత శవాలను బయటకు తీసి లైంగిక దాడికి పాల్పడుతున్నారని, దీనిని అడ్డుకొనేందుకు ఓ సమాధిపై ఇలా ఇనుప తలుపు ఏర్పాటు చేశారంటూ వివిధ మీడియా సంస్థల్లో వార్తాకథనాలు వచ్చాయి.
సమాధిపై ఆకుపచ్చ రంగు ఇనుప తలుపును ఏర్పాటు చేయడంపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. చాలా మీడియా సంస్థలు ఈ సమాధి పాకిస్తాన్లో ఉన్నట్లు చెప్పాయి.
సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈ వార్తపై ఫ్యాక్ట్ చెకింగ్ ప్లాట్ఫామ్ 'ఆల్ట్ న్యూస్' పరిశీలన జరిపి, ఇది తప్పుడు వార్త అని తేల్చేసింది. ఇది పాకిస్తాన్లో లేదని తెలిపింది.
ఈ సమాధి తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో ఉన్నట్లు ఆల్ట్ న్యూస్ వివరించింది.
నిజానిజాలేంటో తెలుసుకోకుండా ఈ వార్తను అందించడంపై భారత్, పాకిస్తాన్లలో సోషల్ మీడియాలో న్యూస్ పోర్టల్స్పై పెద్దయెత్తున విమర్శలు వస్తున్నాయి.
ఏఎన్ఐ, ఎన్డీటీవీ, వరల్డ్ ఇన్ వన్ న్యూస్, ఈనాడు, హిందుస్తాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టుడే లాంటి పలు భారత మీడియా సంస్థలు ఈ వార్తను పబ్లిష్ చేశాయి.
ఇంతకూ ఈ తప్పుడు వార్త ఎక్కడ పుట్టింది? ఎలా వ్యాప్తి చెందింది? దీనిపై పాకిస్తాన్లో ప్రజలేమంటున్నారు? ఇలాంటి వివరాలను తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, TWITTER
ఈ తప్పుడు వార్త ఎలా బయల్దేరింది?
ఈ తప్పుడు వార్తను ట్విటర్ యూజర్ హారిస్ సుల్తాన్ తొలుత ట్వీట్ చేశారు. ఆల్ట్ న్యూస్ ఫ్యాక్ట్ చెకింగ్ తర్వాత, సుల్తాన్ ఈ ట్వీట్ను డిలీట్ చేసి, క్షమాపణ కోరారు.
వార్తాసంస్థ ఏఎన్ఐ కూడా ఈ వార్తను విత్ డ్రా చేసుకుని, దీనిపై వివరణ ఇచ్చింది.
ఆల్ట్ న్యూస్ చేపట్టిన ఫ్యాక్ట్ చెకింగ్లో ఏయే విషయాలు వెలుగులోకి వచ్చాయో ఒకసారి చూద్దాం.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సమాధిపై ఇనుప కడ్డీల తలుపు పెట్టి, తాళం వేసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ కావడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియాలో ఈ ఫోటో షేర్ అయిన తర్వాత, కొంత మంది ట్విటర్ యూజర్లు ఈ ఫోటో పాకిస్తాన్కు చెందినదన్నారు. పాక్ ప్రజలు తమ కూతుళ్ల సమాధులకు కూడా తాళాలు వేస్తున్నారని రాశారు. చనిపోయిన తర్వాత కూడా తమ మహిళలు లైంగిక దాడికి గురవుతారనే భయంతో వారి సమాధిపై ఇలా తలుపు ఏర్పాటు చేసి, తాళాలు వేస్తున్నారని చెప్పారు.
సోషల్ మీడియాలో ఈ వార్త షేర్ అయిన తర్వాత ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్ దీనిపై విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఒకదాని తర్వాత ఒకటిగా నిజాలు బయటికి వచ్చాయి.
హైదరాబాద్లో సమాధిపై ఇనుప తలుపు ఎందుకు పెట్టారు?
ఈ సమాధి భారత్లోని హైదరాబాద్లో ఉన్నట్లు ఆల్ట్ న్యూస్ విచారణలో తేలింది. మాదన్నపేట ప్రాంతంలోని దరాబ్ జంగ్ కాలనీలో సాలార్ మాలిక్ మసీదుకు ఎదురుగా ఉన్న శ్మశానంలో ఈ సమాధి ఉంది.
ఈ ప్రాంతంలో నివసించే ఒక సామాజిక కార్యకర్తతో ఆల్ట్ న్యూస్ మాట్లాడింది. అలాగే మసీదుకు చెందిన ఒక వ్యక్తితో కలిసి ఆ సమాధి ఉన్న ప్రాంతానికి వెళ్లి వీడియో తీసింది. ఈ తలుపు ఏర్పాటు చేసే విషయం మసీదు కమిటీ ముందుకు వచ్చినట్లు వారు తెలిపారు.
ప్రస్తుతమున్న సమాధులను తవ్వి, మృతదేహాలను వెలికితీస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయని, అందువల్లే ఇలా ఇనుప తలుపు ఏర్పాటు చేసుంటారని మసీదుకు చెందిన వ్యక్తి చెప్పారు. ఈ సమాధి శ్మశానం ఎంట్రీ వద్ద ఉండటంతో, సమాధిపై ఎవరైనా ఎక్కుతారనే భయంతో కూడా కుటుంబ సభ్యులు ఇలా ఏర్పాటు చేసి ఉండొచ్చని అన్నారు.
ఈ సమాధి 70 ఏళ్ల మహిళకు చెందిందని ఆల్ట్ న్యూస్ తెలిపింది. ఆమె కొడుకు ఇనుప కడ్డీలతో ఇలా ఒక తలుపు తయారు చేయించి పెట్టారని చెప్పింది.

ఫొటో సోర్స్, TWITTER
ఈ వార్తను ఫ్యాక్ట్ చెక్ చేసిన ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహమ్మద్ జుబేర్ను సోషల్ మీడియాాలో యూజర్లు ప్రశంసిస్తున్నారు.
భారత్లో జర్నలిజం ప్రమాణాలను జుబేర్ ప్రశ్నిస్తుండటంతో, చాలా మంది ఆయన పాకిస్తాన్ను సమర్థిస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు.
మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే కారణంతో 2022లో మహమ్మద్ జుబేర్ను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
హారిస్ సుల్తాన్ ట్విటర్ హ్యాండిల్ నుంచి భారత మీడియా ఈ ఇనుప తలుపు ఫొటోను షేర్ చేసింది.
హారిస్ సుల్తాన్ ట్విటర్ అకౌంట్లో తనను తాను మాజీ ముస్లింగా పేర్కొన్నారు. దీనిపై ఆయన ‘ద కర్స్ ఆఫ్ గాడ్, వై ఐ లెఫ్ట్ ఇస్లాం’ అనే పుస్తకం రాశారు.
‘‘శవాలతో సంభోగం (నెక్రోఫిలియా) పాకిస్తాన్లో ఒక తీవ్రమైన సమస్యగా ఉంది. అందుకే పాకిస్తాన్లో సమాధికి ఇనుప తలుపును ఏర్పాటు చేశారనేది నమ్మశక్యంగా అనిపించింది" అని హారిస్ సుల్తాన్ తన ట్వీట్లో రాశారు.
ముస్లింలంటే గిట్టని వ్యక్తి దీన్ని రాశారని, ఈ తప్పుడు వార్తను భారత మీడియా ఎలా దుష్ప్రచారానికి వాడిందని మరో యూజర్ ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, TWITTER
పాకిస్తాన్లో విమర్శలు
ఈ ఫోటోను భారత్, పాకిస్తాన్లలో విపరీతంగా షేర్ చేశారు. పాకిస్తాన్ మీడియాలోనే తొలిసారి ఇది సర్క్యూలేట్ అయింది.
సమాధుల నుంచి మహిళల మృతదేహాలను బయటకు తీసి లైంగిక దాడి చేస్తున్నారని ఆరోపణలు చేస్తూ ఈ ప్రచారం చేశారు.
‘‘ఈ ఫోటోను తప్పుగా షేర్ చేసిన పాకిస్తానీ ప్రజలందరూ దీనిపై క్షమాపణ చెప్పాలి" అని మారియా అనే యూజర్ రాశారు. సోషల్ మీడియాలో ఫేక్న్యూస్ను ప్రశ్నించకుండా షేర్ చేయడాన్ని సోషల్ మీడియా నేరంగా పరిగణించాలని కోరారు.
‘‘వార్తలను ఫ్యాక్ట్ చెక్ చేయడం ఇందుకే అత్యంత అవసరం. మనం నిజమని భావిస్తే, ప్రతిదానికి మనం మద్దతు ఇస్తాం’’ అని అనాస్ అనే మరో యూజర్ చెప్పారు.
‘‘తప్పుడు వార్తలను వెరిఫై చేయకుండా వెంటనే ఇతరులకు వ్యాప్తి చేసే ప్రజలందరికీ ఈ ట్విటర్ త్రెడ్ అవసరం’’ అని తజ్యాన్ మహమ్మద్ జుబేర్ అన్నారు.
రెండేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటనను ఉదహరిస్తూ జర్నలిస్ట్ ఫర్జానా షా పాకిస్తానీ నేతలను విమర్శించారు.
భారత వార్తాసంస్థ ఏఎన్ఐ పాకిస్తాన్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుందని ఈయూ డీఎస్ ఇన్ఫోలాబ్ రిపోర్టు ఆరోపించింది.
పాకిస్తాన్ ప్రజలు తమ లక్ష్యాలను సాధిస్తున్నారు, తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేయడంలో ఏఎన్ఐ మరోసారి విజయం సాధించిందని ఫర్జానా షా విమర్శించారు.
ఇవి కూడా చదవండి:
- స్లీప్ పెరాలసిస్: నిద్రలో గుండెపై దెయ్యం కూర్చున్నట్లు ఎందుకు అనిపిస్తుంది?
- ‘ది కేరళ స్టోరీ’: ఇస్లాంలోకి మారిన అమ్మాయిల కథతో తీసిన ఈ సినిమాపై వివాదం ఎందుకు?
- అరికొంబన్: ఈ కిల్లర్ ఎలిఫెంట్ చేసిన పనికి తీసుకెళ్లి టైగర్ రిజర్వ్లో వదిలేశారు
- జైశంకర్: భారత్ తరఫున బలమైన గొంతుకా, లేక దూకుడుతో వచ్చిన పాపులారిటీనా?
- వరల్డ్ ఆస్తమా డే: ఉబ్బసం ఎందుకు వస్తుంది? నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)















