వరల్డ్ కప్: ఇంగ్లండ్‌పై 100 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం, పాయింట్ల పట్టికలో టాప్

క్రికెట్

ఫొటో సోర్స్, Getty Images

వరల్డ్‌కప్‌లో భాగంగా ఆదివారం లక్నోలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 100 పరుగుల తేడాతో విజయం సాధించింది.

230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 34.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

పోరాడిన రోహిత్, సూర్యకుమార్

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఆది నుంచి తడబడుతూనే ఆడింది.

ఓ వైపు కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటుండగా మరోపక్క ఒక్కో వికెట్ పడుతూ వచ్చింది.

రోహిత్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన శుభ్‌మన్ గిల్ 9 పరుగులు, విరాట్ కోహ్లీ 0, శ్రేయస్ అయ్యర్ 4 పరుగులకు ఔట్ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది.

కె.ఎల్.రాహుల్ కొద్దిసేపు పోరాడి 39 పరుగులు చేసి ఔటయ్యాడు. రోహిత్ శర్మ 101 బంతుల్లో 87 పరుగులు చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

రవీంద్ర జడేటా 8 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (49 పరుగులు) దూకుడుగా ఆడి జట్టు స్కోరును ముందుకు నడిపించాడు.

దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 9 వికెట్లు కోల్పోయి 229 పరుగులు సాధించింది. ఇంగ్లండ్ జట్టులో డేవిడ్ విల్లే 3 వికెట్లు, వోక్స్, రషీద్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.

క్రికెట్

ఫొటో సోర్స్, Getty Images

భారత్ బౌలర్ల 'మ్యాజిక్'

230 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టును భారత బౌలర్లు కట్టడి చేశారు.

బుమ్రా, షమీ, కుల్దీప్ యాదవ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లిష్ బ్యాటర్లు వికెట్లు సమర్పించుకున్నారు.

డేవిడ్ మలాన్ 16 పరుగులు, జానీ బెయిర్‌స్టో 14 పరుగులు చేసి ఔటవగా, జో రూట్, బెన్ స్టోక్స్‌ ఇద్దరూ డకౌట్ అయ్యారు.

ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా ఎక్కువసేపు నిలవకపోవడంతో 129 పరుగులకే కుప్పకూలింది ఇంగ్లండ్.

లియాన్ లివింగ్ స్టోన్ చేసిన 29 పరుగులే టాప్ స్కోరు.

భారత బౌలర్లలో మొహమ్మద్ షమీ 4 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 3, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశారు.

సెమీస్ చేరువలో టీమిండియా

ఒక్క ఓటమి కూడా లేకుండా ఈ టోర్నీలో భారత జట్టు వరసగా ఆరు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. తాజా విజయంతో సెమీస్‌కు మరింత చేరువైంది టీమిండియా.

ఇదే సమయంలో డిఫెండింగ్ చాంపియన్‌గా టోర్నీలోకి అడుగుపెట్టిన ఇంగ్లండ్ జట్టు చివరి స్థానానికి పడిపోయింది.

ఆ జట్టు ఆరు మ్యాచ్‌లలో కేవలం ఒకటి మాత్రమే గెలిచింది. మరో మూడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండటంతో ఇంగ్లండ్ జట్టు సెమీస్ ఆశలు గల్లంతయినట్లే.

కాగా, ఈ మ్యాచ్‌లో రాణించి 87 పరుగులు సాధించడం ద్వారా 2023లో వెయ్యి పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు రోహిత్ శర్మ.

వీడియో క్యాప్షన్, ఇండోనేషియాలో అత్యంత వేగంగా నడిచే మూడో ఏషియన్ రైల్వే నెట్‌వర్క్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)