నేటి నుంచి మూడు కొత్త చట్టాలు అమల్లోకి.. పెళ్లి చేసుకుంటానని లైంగిక దోపిడీకి పాల్పడితే పదేళ్ల జైలు

ఫొటో సోర్స్, Getty Images
భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ చట్టాలు ఆదివారం అర్ధరాత్రి (జులై 1, 2024) నుంచి అమల్లోకి వచ్చాయి.
ఇంతకుముందున్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో వీటిని తీసుచ్చారు.
తొలుత 2023 ఆగస్టులో వీటికి సంబంధించిన బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అనంతరం వీటిని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపించగా, కమిటీ సూచించిన మార్పులను చేర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లులను వెనక్కి తీసుకుంది.
మార్పులు చేర్పుల తరువాత పార్లమెంటులో దీనిపై చర్చ జరిగి ఆమోదం దక్కింది. దాంతో ఆ బిల్లులు చట్టరూపం దాల్చాయి.

ఈ కొత్త చట్టాలతో భారత న్యాయవ్యవస్థ, నేర విచారణ విధానాలలో కొత్త మార్పులు వస్తున్నాయి.
జీరో ఎఫ్ఐఆర్, పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఆన్లైన్లో ఫిర్యాదు చేయగలిగే అవకాశం, ఎలక్ట్రానిక్ మోడ్లో సమన్ల జారీ వంటి మార్పులను ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చాయి.
డిజిటల్ పోలీస్ సిటిజన్ సర్వీసెస్ కింద క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ ద్వారా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు.
అలాగే స్టేషన్ల పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్లో అయినా జీరో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఏమేం మారుతున్నాయి?
క్రిమినల్ కేసులకు సంబంధించి మొదటి విచారణ జరిగిన 60 రోజుల్లోపు చార్జ్షీట్ దాఖలు చేయాలి.
క్రిమినల్ కేసులలో విచారణ పూర్తయిన 45 రోజులలోగా తీర్పు వెలువడాలి.
కొత్త చట్టాలలో రాజద్రోహం అనే పదాన్ని తొలగించారు. అదే సమయంలో దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలను శిక్షార్హమైన జాబితాలో చేర్చారు.

ఫొటో సోర్స్, PIB Andhra Pradesh
చిన్నారులపై సామూహిక అత్యాచారానికి మరణశిక్ష
చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడేవారికి గరిష్ఠంగా మరణ శిక్ష విధించేలా కొత్త చట్టాలలో నిబంధన ఉంది.
మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించి కొత్త చట్టాలలో ప్రత్యేక అధ్యాయాన్ని కేటాయించారు.
మైనర్లను కొనడం, అమ్మడం కూడా నేరమే.

ఫొటో సోర్స్, PIB Telangana
పెళ్లి పేరుతో లైంగిక దోపిడీకి పదేళ్ల జైలు శిక్ష
మహిళలను, బాలికలను పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక దోపిడీకి పాల్పడితే గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష విధించడానికి ఈ కొత్త చట్టాలు వీలు కల్పిస్తున్నాయి.
అలాగే కులం, మతం, జెండర్ వంటి కారణాలతో మూక దాడులకు పాల్పడితే యావజ్జీవ కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, PIB Telangana
90 రోజుల వరకు పోలీస్ రిమాండ్
గతంలో కంటే ఎక్కువ రోజులు పోలీస్ రిమాండ్ విధించే అవకాశాన్ని కొత్త చట్టాలు కల్పిస్తున్నాయి. 60 నుంచి 90 రోజుల వరకు రిమాండ్ విధించొచ్చు.
అయితే, కేసు విచారణకు ముందు ఇలా సుదీర్ఘ కాలం పోలీస్ రిమాండ్కు అవకాశం కల్పించడంపై కొందరు న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవన్నీ ‘ఉగ్రవాదం’ పరిధిలోకే..
ఉగ్రవాద కార్యకలాపాల గురించి తొలిసారి భారతీయ న్యాయ సంహిత (ఇండియన్ జ్యుడీషియల్ కోడ్)లో ప్రవేశపెట్టారు. గతంలో వీటికి నిర్దిష్ట చట్టాలు ఉండేవి. ఇప్పుడు ఆర్థిక భద్రతకు ముప్పు కలిగించడం కూడా ఉగ్రవాద కార్యకలాపాల పరిధిలోకే తెచ్చారు.
నకిలీ నోట్ల తయారీ, నోట్ల స్మగ్లింగ్కు పాల్పడుతూ ఆర్థిక స్థిరత్వానికి హాని కలిగించడం ఉగ్రవాద చట్టం కిందకు వస్తుంది.
ఇప్పుడు, భారత్లో ప్రభుత్వం వద్ద తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం కోసం వ్యక్తులను నిర్బంధించడం లేదా కిడ్నాప్ చేయడం వంటివి కూడా ఉగ్రవాద కార్యకలాపాల కిందకే వస్తాయి.
ఇవి కూడా చదవండి:
- అమెరికా అధ్యక్ష ఎన్నికలు: ప్రెసెడెన్షియల్ డిబేట్లో బైడెన్, ట్రంప్లు ఏం చెప్పారు
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














