కంగనాపై దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ మహిళా జవాన్ ఎవరు, ఎయిర్ పోర్టులో అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, ANI
బాలీవుడ్ నటి, హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా కొత్తగా ఎన్నికైన కంగనా రనౌత్ను చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్కు చెందిన ఒక మహిళా జవాను కొట్టారు.
గురువారం నాటి ఎన్డీయే సమావేశం కోసం కంగనా దిల్లీకి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
రైతుల ఆందోళన సమయంలో కంగనా రనౌత్ వ్యాఖ్యలు తనకు కోపం తెప్పించాయని రనౌత్ను చెంప మీద కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్విందర్ కౌర్ అనే మహిళ జవాను అన్నారు.
ఈ సంఘటన తర్వాత కుల్విందర్ కౌర్ను సీఐఎస్ఎఫ్ సస్పెండ్ చేసి, దీనిపై విచారణను చేపట్టింది.
‘‘ఈ సంఘటనపై విచారణ జరుగుతోంది. విచారణ తర్వాత అసలేం జరిగిందో మాకు తెలుస్తుంది. ఆ తర్వాత నిందితులపై తగిన చర్యలు తీసుకుంటాం’’ అని హరియాణా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ అన్నారు.
‘‘భద్రతా సిబ్బందే ఇలాంటి పనులు చేయడం దురదృష్టకరం. ఇది సరి కాదు’’ అని ఆయన అన్నారు.

అయితే, సోషల్ మీడియాలో చాలామంది కుల్విందర్ కౌర్కు అండగా నిలుస్తున్నారు.
‘‘సెంటిమెంట్ హర్ట్ అయ్యిందని చెంపదెబ్బ కొడితే ఆ రాష్ట్రంలో హింస టెర్రరిజం ఉన్నట్లు చెప్పడం సరికాదు. ఇవి కేవలం డబ్బులు తీసుకుని ఉద్యమాలు చేస్తున్నారనే ట్వీట్లాగానే ఇది అత్యుత్సాహంతో చేసిన పని. చాలామందిలాగే నాకు ఆ ట్వీట్పై కోపం వచ్చింది. కానీ తర్వాత దాన్ని డిలీట్ చేశారు. ఇక్కడ ఆ లేడీ జవాన్ ఆమెతో అందరి ముందే గొడవ పెట్టుకుంది. కాకపోతే చేయికి పని చెప్పకుండా వాదనతోనే సరిపెడితే బాగుండేది.’’ అని ప్రముఖ షూటర్ హీనా సింధు అన్నారు.
హీనా సింధు ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం అర్జున్ అవార్డును పొందారు.
‘‘మహిళా రైతుల గురించి తప్పుగా మాట్లాడినప్పుడు, నైతికత నేర్పించే వారందరూ ఎక్కడున్నట్లు? నేడు రైతు తల్లికి పుట్టిన ఒక మహిళ ఎరుపెక్కిన ముఖంతో, శాంతి పాఠాన్ని నేర్పేందుకు వచ్చారు. ప్రభుత్వ దౌర్జన్యాలకు రైతులు చనిపోయారు. ఆ సమయంలోనే ప్రభుత్వానికి ఈ శాంతి గుణపాఠాన్ని నేర్పాల్సింది.’’ అని ఒలింపిక్ విజేత బజ్రంగ్ పూనియా ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Kangana Ranaut
కంగనా ఏం చెప్పారు?
గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విమానాశ్రయంలో సెక్యూరిటీ చెక్కు వెళ్లినప్పుడు, సీఐఎస్ఎఫ్ జవాను కుల్విందర్ కౌర్ తనని కొట్టి, తనతో తప్పుడుగా ప్రవర్తించారని కంగనా అన్నారు.
గురువారం సాయంత్రం కంగనా రనౌత్ ఒక వీడియోను విడుదల చేశారు.
‘‘నేను క్షేమంగానే ఉన్నాను. సెక్యూరిటీ చెకప్ సమయంలో చండీగఢ్ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. చెకింగ్ తర్వాత నేను మరో క్యాబిన్ నుంచి వెళ్తున్నప్పుడు, ఒక సీఐఎస్ఎఫ్ మహిళా జవానును దాటుకుంటూ వెళ్లాను. తను పక్కనుంచి వచ్చి నన్ను కొట్టారు. తిట్టడం మొదలెట్టారు’’ అని కంగనా రనౌత్ ఆ వీడియోలో చెప్పారు.
‘‘ఎందుకిలా చేస్తున్నావని అడిగినప్పుడు, రైతుల ఉద్యమానికి తాను మద్దతిచ్చినట్లు చెప్పారు. నేను క్షేమంగానే ఉన్నాను. కానీ, పంజాబ్లో పెరుగుతున్న ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని ఎలా నియంత్రణలోకి తీసుకురావాలన్నదే నా ఆందోళన’’ అని కంగనా అన్నారు.
‘‘ఆ మహిళా జవానును వెంటనే అదుపులోకి తీసుకున్నాం. కంగనా విమానం ఎక్కేందుకు వెళ్లారు. ఈ సంఘటన గురించి పంజాబ్ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాం.’’ అని విమానాశ్రయంలోని సీఐఎస్ఎఫ్ అధికారి చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, PTI
ప్రస్తుతం వీడియో ఫుటేజీని చెక్ చేస్తున్నామని, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పంజాబ్ పోలీసు డీఎస్పీ కేఎస్ సంధు అన్నారు.
ఘటన జరిగిన విషయాన్ని ఒక సీనియర్ సీఐఎస్ఎఫ్ అధికారి కూడా ధ్రువీకరించారు. కుల్విందర్ కౌర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్టు తెలిపారు.
‘‘స్థానిక పోలీసు స్టేషన్లో మహిళా జవానుపై ఫిర్యాదు దాఖలు చేశాం. ఆమెను వెంటనే సస్పెండ్ చేశాం. దీనిపై విచారణకు ఆదేశించాం’’ అని చెప్పారు.
దిల్లీకి చేరుకున్న తర్వాత, కంగనా కూడా ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు.
కుల్విందర్ కౌర్ను సీఐఎస్ఎఫ్ సస్పెండ్ చేసినట్లు వార్తా సంస్థ పీటీఐ రిపోర్టు చేసింది. ఈ ఘటనపై విచారణ చేసేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
నవంబర్ 2020 నుంచి డిసెంబర్ 2021 మధ్యలో ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేశారు.
ఆ సమయంలో పంజాబ్, హరియాణా, రాజస్థాన్కు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో దేశ రాజధానిలో, దిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కుల్విందర్ కౌర్ ఎవరు?
వార్తా సంస్థ పీటీఐ ప్రకారం, కుల్విందర్ కౌర్ 2009లో సీఐఎస్ఎఫ్లో చేరారు. 2021 నుంచి చండీగఢ్ విమానాశ్రయంలో సెక్యూరిటీ పర్సనల్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త కూడా అదే విమానాశ్రయంలో పనిచేస్తున్నారు.
హిందూస్తాన్ టైమ్స్ ప్రచురించిన నివేదిక ప్రకారం, కుల్విందర్ కౌర్... పంజాబ్లోని కపుర్తలాలో సుల్తాన్పూర్ లోధికి చెందినవారు.
గత రెండేళ్లుగా చండీగఢ్ విమానాశ్రయంలో కుల్విందర్ కౌర్ పనిచేస్తున్నట్లు ఆమె సోదరుడు షేర్ సింగ్ ఒక ప్రైవేట్ న్యూస్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
సీఐఎస్ఎఫ్లో 15 నుంచి 16 ఏళ్లుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. కుల్విందర్ కౌర్ భర్త కూడా సీఐఎస్ఎఫ్లో ఉన్నట్లు షేర్ సింగ్ చెప్పారు.
2020లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేసినపుడు, తన వ్యాఖ్యలతో కంగనా వివాదాల్లో నిలిచారు.
ఇవి కూడా చదవండి:
- అగ్నిబాణ్: 3డీ ప్రింటర్తో తయారు చేసిన ప్రపంచంలోనే తొలి రాకెట్ ప్రత్యేకత ఏంటి?
- సీతాదేవి: రెండో పెళ్లి కోసం ఇస్లాం మతంలోకి మారిన ఈ పిఠాపురం యువరాణి కథ ఏంటి?
- మియన్మార్: ‘టాటూ ఉందని చర్మం కోసేశారు.. దాహమేస్తుందంటే మూత్రం సీసాలిచ్చారు’
- ‘గాంధీ’ సినిమాకు ముందు ఆయన గురించి ప్రపంచానికి తెలియదా, మోదీ ఏమన్నారు?
- కోటిన్నర జీతం, ఇల్లు, ఇతర సౌకర్యాలు.. ఈ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














