‘నార్కో–పెంతెకొస్తల్స్’: తమను తాము దేవుడి ‘సైతాన్ సైన్యం’గా చెప్పుకునే ప్రమాదకరమైన గ్యాంగులు

ఫొటో సోర్స్, Daniel Arce-Lopez/BBC
- రచయిత, లెబొ డిసెకో, జూలియా కార్నియరో,
- హోదా, బీబీసీ ప్రతినిధులు
రియో డి జెనీరో పొలీసులు కొకైన్, మారిజువానా పట్టుకున్నప్పుడు చాలాసార్లు వారికి ఆ ముఠాల దగ్గర ఒక మతపరమైన చిహ్నం కనిపిస్తుంది. దాని మీద "ది స్టార్ ఆఫ్ డేవిడ్" అని ఉంటుంది.
ఇది యూదు మత విశ్వాసానికి సంబంధించినది కాదు. అయితే, యూదులు ఇజ్రాయెల్కు తిరిగి రావడం క్రీస్తు పునరాగమనానికి దారి తీస్తుందని కొంతమంది పెంతెకొస్తు క్రైస్తవుల నమ్మకం.
థర్డ్ ప్యూర్ కమాండ్ అనే బ్రాండ్తో డ్రగ్స్ అమ్మే ఈ మాదక ద్రవ్యాల ముఠా రియోడి జెనీరోలో అత్యంత శక్తివంతమైన క్రిమినల్ గ్యాంగులలో ఒకటి. ప్రత్యర్ధులను కనిపించకుండా చెయ్యడంతోపాటు అతివాత క్రైస్తవ విశ్వాసాలకు ప్రసిద్ధి చెందినది.
ఉత్తర రియోలో పేదవాళ్లు నివసించే ఐదు ప్రాంతాలు ఈ గ్యాంగు ఆధీనంలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ కాంప్లెక్స్ అని పిలుస్తున్నారు. క్రిమినల్ గ్యాంగుల నాయకుల్లో ఒకరు తాను దేవుడి నుంచి సత్యాన్ని, జ్ఞానాన్ని నేర్చుకుని దాన్ని ప్రజలకు అందించేందుకు వచ్చానని నమ్ముతున్నారని "ట్రాఫికర్స్ ఇవాంజిలికల్స్" అనే రచయిత్రి వివియన్ కోస్టా చెప్పారు.
ఈ నేరగాళ్లు తమ అధీనంలో ఉన్న ప్రాంతానికి తాము "సైతాన్ సైన్యం అని" క్రీస్తు "తమ యజమానిగా భావిస్తారని ఆమె వివరించారు.
కొంతమంది వారిని "నార్కో- పెంతెకొస్తల్స్" అని పిలుస్తారు.


ఫొటో సోర్స్, Daniel Arce-Lopez/BBC
ఒక రైఫిల్, ఒక బైబిల్
తుపాకి పట్టుకున్న డీగో నచిమెంటో, ఒక గ్యాంగ్స్టర్ చెప్పిన సువార్త విని క్రైస్తవుడిగా మారాడు. ఆ తర్వాత పాస్టర్ అయ్యాడు. ఆయన జీవితంలో నేరం, మతం రెండూ ఉన్నప్పటికీ, రెండూ వేర్వేరుగా ఉన్నాయి.
42 ఏళ్ల వెస్లిన్ను మొదటిసారి చూసినప్పుడు ఆయన రియోడి జెనీరోలో క్రూర నేరాల ముఠాలో సభ్యుడంటే నమ్మడం కష్టం. గ్యాంగ్ కమాండోగా ఆయన నగరంలోని ఒక మురికివాడ వ్యవహారాలను పర్యవేక్షించేవాడు. ప్రస్తుతం చర్చ్ వ్యవహారాలను చూస్తున్నారు.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తూ పట్టుబడి నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవించినప్పటికీ ఆయన నేరాలు చెయ్యడం మానలేదు. కొకైన్కు బానిసగా మారిన తర్వాత గ్యాంగులో ఆయన స్థాయి పడిపోయింది.
"నేను నా కుటుంబాన్ని కోల్పోయాను. దాదాపు ఏడాది పాటు వీధుల్లోనే జీవించాను. కొకైన్ కోసం నా ఇంట్లో వస్తువులన్నింటినీ అమ్మేశా" అని ఆయన అన్నారు.
ఆ తర్వాత, ఆయన పరిస్థితులు ఏ మాత్రం బాగా లేనప్పుడు, ఓ మురికివాడలో ప్రముఖ డ్రగ్ డీలర్ ఆయనను పిలిచారు.
"ఆయన నాకు సువార్త బోధించడం మొదలు పెట్టాడు. దీన్లో నుంచి బయటపడటానికి మార్గం ఉందని చెప్పాడు. అందుకు క్రీస్తును ఆమోదించాలన్నాడు" అని వెస్లిన్ గుర్తు చేసుకున్నారు.
అలా డ్రగ్స్కు బానిసైన ఆ యువకుడు ఆ సలహా పాటించారు. ఆ తర్వాత పాస్టర్గా ఆయన ప్రయాణం ప్రారంభమైంది.
పాస్టర్ నచిమొటో ఇప్పటికీ నేరస్తులతో సమయం గడుపుతూ ఉంటారు. అయితే అది వేరేలా ఉంటుంది. తన జీవితం మారినట్లే జైల్లో ఉన్న ఖైదీల జీవితాలను మార్చేందుకు ఆయన క్రీస్తు బోధనల్ని చెబుతున్నారు.
ఒక ముఠా నాయకుడి బోధనలతో మారినప్పటికీ, క్రిమినల్ నేపథ్యం ఉన్న మత బోధకులు అనే ఆలోచన వైవిధ్యభరితమైనది అనేది ఆయన అభిప్రాయం.
"నేను వారిని సువార్త విశ్వాసకులని భావించను" అని ఆయన చెప్పారు.
"వారంతా తప్పుడు మార్గంలో నడుస్తూ దేవుడిని చూసి ఆందోళన చెందుతున్న వారిగానే గుర్తిస్తాను. ఎందుకంటే దేవుడు మాత్రమే వారి జీవితాలను కాపాడగలరని వారు నమ్ముతారు" అని చెప్పారు.
"నేరస్తుడిగా ఉంటూ, మతబోధకుడిగా కొనసాగడం అనేది కుదరదు. ఒక వ్యక్తి క్రీస్తును అనుసరిస్తూ, బైబిల్ ఆదేశాలను పాటిస్తూ ఉంటే అతను డ్రగ్ డీలర్ కాలేడు" అని పాస్టర్ నచిమొటో అంటారు.

ఫొటో సోర్స్, Daniel Arce-Lopez/BBC
నిర్భంధంలో జీవించడం
ఈ దశాబ్ధం చివరి నాటికి బ్రెజిల్లో క్యాథలిజంను దాటి ఇవాంజిలికల్ క్రిస్టియానిటీ ఒక ముఖ్యమైన మతంగా మారుతుందని కొన్ని అంచనాలు చెబుతున్నాయి.
ఇది విస్తరించే కొద్దీ, గ్యాంగుల ఆధీనంలో ఉన్న మురికివాడల్లో పెంతెకోస్తల్ ఉద్యమం పునరుజ్జీవం పొంది ప్రజల్లోకి వ్యాపిస్తోంది. ప్రస్తుతం కొన్ని గ్యాంగులు తమ బలాన్ని పెంచుకోవడానికి పెంతెకోస్తల్ సిద్దాంతాలను ప్రచారం చేస్తున్నాయి.
ఈ గ్యాంగులు ఆఫ్రో- బ్రెజిలియన్ మతాలను అణిచివేసేందుకు హింసను ప్రయోగిస్తున్నాయని వారి మీద ఆరోపణలు ఉన్నాయి.
రియో డి జెనీరోలో పేదలు చాలా కాలంగా క్రిమినల్ గ్యాంగుల నిర్బంధంలో ఉన్నారు. ఇది మత స్వేచ్ఛను దెబ్బ తీస్తోందిని రియో ఫ్లుమినెన్స్ ఫెడరల్ యూనివర్సిటీలో సోషియాలజీ ప్రొఫెసర్ క్రిస్టినా వైటల్ చెప్పారు.
"ఇజ్రాయెల్ కాంప్లెక్స్ ప్రాంతంలో ఇతర మతాలకు చెందినవారు బహిరంగంగా తమ మత విశ్వాసాలను అనుసరించడాన్ని మీరు చూడలేరు. ఈ ప్రాంతంలో మత అసహనం ఉందని చెప్పడం అతిశయోక్తి కాదు" అని ఆయన అన్నారు.
ఉంబండా, కాండోంబ్లేతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆఫ్రో- బ్రెజిలియన్ మత కేంద్రాలను మూసివేశారు. గ్యాంగు సభ్యులు కొన్నిసార్లు గోడల మీద "ఈ ప్రాంతానికి ఏసుక్రీస్తే దేవుడు" అని సందేశాలు రాశారు" అని క్రిస్టినా అన్నారు.
ఆఫ్రో- బ్రెజిలియన్ మతాలను అనుసరించేవారు చాలా కాలంగా వివక్షను ఎదుర్కొంటున్నారు. వాళ్లను లక్ష్యంగా చేసుకుంది డ్రగ్ డీలర్లు మాత్రమే కాదు.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా గ్యాంగుల దాడులు, బెదిరింపులు చాలా ప్రభావం చూపుతున్నాయని రియోలో జాతి వివక్ష నేరాలను అదుపు చేసే పోలీస్ విభాగం అధిపతి రీటా సలీమ్ చెప్పారు.
"క్రిమినల్ గ్యాంగులు తమ ఆధీనంలో ఉన్న ప్రాంతంలో భయాన్ని వ్యాపింపజేస్తున్నాయి. అది స్థానిక ప్రజల మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇవి చాలా సీరియస్ కేసులు" అని సలీమ్ అన్నారు.
ఇజ్రాయెల్ కాంపౌండ్లోని ఓ మురికివాడలో ఆఫ్రో- బ్రెజిలియన్ ఆలయం మీద దాడి చెయ్యాలని ఒక సాయుధుడిని ఆదేశించిన ముఠా నాయకుడి మీద అరెస్ట్ వారంట్ జారీ అయింది.

ఫొటో సోర్స్, Daniel Arce-Lopez/BBC
ఆధునిక మత పోరాాటాలు
2000 తొలి నాళ్లలో రియో డి జెనీరోలోని బస్తీల్లో మత తీవ్రవాదం మీద ఆరోపణలపై అందరి దృష్టి మళ్లింది. ఈ సమస్య ఏళ్లు గడిచే కొద్దీ నాటకీయంగా పెరిగి పెద్దదైందని మారికో డి జగున్ చెప్పారు. ఆయన రియో సిటీ హాల్లో మత వైవిధ్యానికి సమన్వయకర్తగా ఉన్నారు.
కాండోంబ్లే ప్రాంతంలో జగున్ ప్రధాన అర్చకుడిగా పని చేస్తున్నారు. ఇది జాతీయ సమస్యగా మారిందని, బ్రెజిల్లోని ఇతర నగరాల్లోనూ ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
"ఇది ఆధునిక మత పోరాటాల రూపం సంతరించుకుంది" అని ఆయన కన్నీరు పెట్టుకున్నారు. "ఈ దాడుల వెనుక మతపరమైన, జాతిపరమైన వివక్ష ఉంది. ఆఫ్రికన్ మతాలను దెయ్యాలుగా చూపించడం చట్టవిరుద్దం. దేవుడి పేరుతో జరుగుతున్న చెడును బహిష్కరించాలి" అని ఆయన కోరారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














