'క్వాడ్' దేశాలు పహల్గాం దాడిని ఖండించినా పాక్ ప్రస్తావన లేకపోవడాన్ని ఎలా చూడాలి?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో జరిగిన క్వాడ్ దేశాల సదస్సు పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించింది. కానీ, పాకిస్తాన్ పేరును ప్రస్తావించలేదు.
ఇది 'క్రాస్ బోర్డర్ టెర్రరిజం, పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రిరిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు' అని భారత్ పదేపదే చెబుతోంది.
భారత్, పాక్ కాల్పుల విరమణ తర్వాత, పాకిస్తాన్ విషయంలో అమెరికా మెతక వైఖరి ప్రదర్శిస్తోందన్న సందేశాన్నిచ్చే ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి.
పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వైట్హౌస్లో భోజనానికి ఆహ్వానించారు. ఆ తర్వాత పాకిస్తాన్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేసింది. ఈ సంఘటనలు పాకిస్తాన్కు దగ్గరయ్యేందుకు అమెరికా ప్రయత్నిస్తోందనే సందేశాన్ని పంపాయి.

గత వారం జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ - ఎస్సీవో (షాంఘై సహకార సంస్థ) సదస్సు సంయుక్త ప్రకటనపై సంతకం చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ నిరాకరించడం చర్చనీయమైంది.
''ఉగ్రవాదం గురించే భారత్ ఆందోళన. భారత్ ఆందోళనపై ఒక దేశానికి అభ్యంతరాలు ఉన్నాయని, అందువల్ల సంయుక్త ప్రకటన తుదిరూపం దాల్చలేదు'' అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
ఈ సదస్సు జరిగిన వారం రోజుల అనంతరం, అమెరికాలో జరిగిన క్వాడ్ దేశాల (ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికా) విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో క్వాడ్ దేశాలు ముక్తకంఠంతో 'పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించాయి'.

ఫొటో సోర్స్, Getty Images
ఎస్సీవోలో భారత్ ఎందుకు వెనకబడింది..
ఈ సమావేశానికి ముందు, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ, ''ఉగ్రవాదం నుంచి తమ పౌరులను రక్షించుకునే హక్కు భారత్కు ఉంది. ఆ హక్కును భారత్ వినియోగించుకుంటుంది. క్వాడ్లో మా భాగస్వామ్య దేశాలు దీనిని అర్థం చేసుకుని, అభినందిస్తాయని భావిస్తున్నా" అని జైశంకర్ అన్నారు.
జైశంకర్ ప్రకటన పాకిస్తాన్కు బలమైన, స్పష్టమైన సందేశంగా నిపుణులు చూస్తున్నారు.
భారత విదేశాంగ మంత్రి ప్రకటనపై విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వల్ సిబల్ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు.
"పాకిస్తాన్ను ఉద్దేశించి ట్రంప్, సెంట్కామ్ కమాండర్ ఇటీవల చేసిన ప్రకటనల నేపథ్యంలో.. అమెరికా విదేశాంగ మంత్రి సమక్షంలో పాకిస్తాన్కు బలమైన, స్పష్టమైన, కచ్చితమైన సందేశాన్ని ఇచ్చారు" అని కన్వల్ సిబల్ ఆ పోస్టులో రాశారు.
సంస్థ నిర్మాణం, వాటి లక్ష్యాలు, భౌగోళిక రాజకీయ దృక్పథాల పరంగా క్వాడ్, ఎస్సీవో రెండూ భిన్నమైననవి. పహల్గాం దాడి విషయంలో రెండు సంస్థల వైఖరిలో ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది.
క్వాడ్ తమ సంయుక్త ప్రకటనలో, "క్రాస్ బోర్డర్ టెర్రరిజం సహా టెర్రరిజం అన్ని రూపాలను, హింసాత్మక తీవ్రవాదాన్ని క్వాడ్ తీవ్రంగా ఖండిస్తోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పరస్పర సహకారంపై తన సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తోంది. 2025 ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దాడిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ మరణించారు. అనేక మంది గాయపడ్డారు" అని పేర్కొంది.
ఏఎఫ్పీ వార్తా సంస్థ కోసం, వాషింగ్టన్ డీసీలో అమెరికన్ విదేశాంగ శాఖ వ్యవహారాలను షాన్ టాండన్ కవర్ చేస్తుంటారు.
భారత్ అభ్యర్థన మేరకు, పాకిస్తాన్ పేరు ప్రస్తావించకుండా పహల్గాం దాడిని ఖండించేందుకు క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు అంగీకరించారని షాన్ టాండన్ చెప్పారు.
ఒకవైపు, పహల్గాం దాడి బాధితులకు అంతర్జాతీయ న్యాయం గురించి క్వాడ్ మాట్లాడుతుంటే.. మరోవైపు ఎస్సీవో మాత్రం తన సంయుక్త ప్రకటనలో ఈ అంశాన్నే చేర్చలేదు.
షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉమ్మడి ప్రకటనను 'పాకిస్తాన్ అనుకూల ప్రకటన'గా భారత్ పరిగణించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఎందుకంటే, అది 'పహల్గాంలో దాడి' గురించి ప్రస్తావించలేదు కానీ 'బలూచిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాల' గురించి ప్రస్తావించింది.
బలూచిస్తాన్ స్వాతంత్య్ర పోరాటానికి భారత్ మద్దతిస్తోందని పాకిస్తాన్ ఆరోపించింది. అయితే, భారత్ ఈ ఆరోపణలను తిరస్కరిస్తూ వస్తోంది.
ఎస్సీవోలో రష్యా కూడా సభ్యదేశం. భారత్ విషయంలో ఉమ్మడి ప్రకటనకు సంబంధించి రష్యా సమ్మతిపై కూడా ప్రశ్నలు తలెత్తాయి.
ఆసియాలో పాశ్చాత్య దేశాల ప్రభావాన్ని పరిమితం చేసేందుకు చైనా, రష్యా, మరో నాలుగు మధ్య ఆసియా దేశాలు కలిసి 2001లో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశాయి. 2017లో భారత్, పాకిస్తాన్ ఈ సంస్థలో భాగంగా మారాయి.
అదే సమయంలో, ఇండో – పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని నియంత్రించేందుకు క్వాడ్ ఏర్పడింది. అధికారికంగా చైనా వ్యతిరేక వేదిక అని చెప్పకపోయినా, ఈ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని నియంత్రించేందుకు క్వాడ్ను ఒక మార్గంగా చూస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా ఆధిపత్యానికి సవాల్
తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రంలో నెలకొన్న పరిస్థితులపై ఇటీవలి క్వాడ్ సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది.
"తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రంలో యథాతథ స్థితిని బలప్రయోగం ద్వారా మార్చాలనుకునే ఏకపక్ష ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం" అని క్వాడ్ తన ఉమ్మడి ప్రకటనలో పేర్కొంది.
చైనాను ఎదుర్కోవడానికి ఆస్ట్రేలియా, భారత్, జపాన్లతో సంయుక్తంగా భారీ ఖనిజ వనరుల ప్రాజెక్టును అమెరికా ప్రకటించింది.
వాషింగ్టన్లోని క్వాడ్ దేశాల సంయుక్త ప్రకటనలో "క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్"ను ప్రకటించారు. ఖనిజ సరఫరాలను భద్రపరచడం, బలోపేతం చేయడం ద్వారా ఆర్థిక భద్రతను పెంపొందించడం దీని లక్ష్యం.
చైనాపై ఆధారపడడాన్ని తగ్గించడం కూడా ఈప్రకటన ఉద్దేశాలలో ఒకటి.
క్వాడ్ దేశాలను కీలక వ్యూహాత్మక భాగస్వాములని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో అన్నారు. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలపై 'చర్య తీసుకోవాల్సిన' సమయం వచ్చిందని చెప్పారు.
ఖనిజ వనరుల పంపిణీలో పరస్పర సహకారం గురించి చర్చించేందుకు క్వాడ్ దేశాలకు చెందిన 30 లేదా 40 సంస్థలు, అమెరికన్ విదేశాంగ శాఖతో సమావేశం కానున్నాయని రుబియో చెప్పారు.
ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు, అణు కార్యకలాపాలపై క్వాడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర కొరియాకు సైనిక లేదా సాంకేతిక సాయం అందించవద్దని ప్రపంచ దేశాలను హెచ్చరించింది.

ఫొటో సోర్స్, Getty Images
అంతర్జాతీయ వేదికలపై భారత్ సందిగ్ధత
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఐదు దేశాల పర్యటన(జూలై 2 నుంచి 9 వరకు)లో ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన బ్రెజిల్లో జరగనున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు.
బ్రిక్స్ సమ్మిట్ - 2025 బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరుగుతోంది. బ్రిక్స్తో పాటు భారత్ క్వాడ్, ఎస్సీవో, జీ-20, బిమ్స్టెక్లో సభ్యదేశంగా ఉంది.
భారత్ అనాదిగా అలీన విధానానికి మద్దతుదారుగా ఉంది. బహుళ వేదికల్లో భాగస్వామిగా ఉండటం ద్వారా గ్లోబల్ సౌత్కు నేతృత్వం వహిస్తున్నట్లు చెబుతోంది. అయితే, అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటోంది.
ఉదాహరణకు, భారత్ బ్రిక్స్ ద్వారా బహుళ ధ్రువప్రపంచ క్రమాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటోంది. అదే సమయంలో, పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని సమతుల్యం చేయాలనీ భావిస్తోంది.
బ్రిక్స్లో చైనా ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ, భారత్ - చైనా ఉద్రిక్తతలు ఈ గ్రూప్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో పాటు చైనా, రష్యా మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం భారత్కు అసౌకర్యంగా మారుతోంది.
అదే సమయంలో, చైనాను క్వాడ్ తీవ్రంగా విమర్శిస్తున్నప్పటికీ బ్రిక్స్, ఎస్సీవో భారత్, చైనా రెండూ ఉన్నాయి.
ఎస్సీవోలో పాకిస్తాన్ కూడా ఉంది. కానీ, పాకిస్తాన్ క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోందంటూ భారత్ ఆరోపిస్తోంది.
భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సందిగ్ధత ఏమిటంటే, పాశ్చాత్య దేశాలతో (క్వాడ్) వ్యూహాత్మక ఆర్థిక సహకారాన్ని పెంచుకోవడం. అదే సమయంలో బ్రిక్స్, ఎస్సీవోలో తన పాత్ర కొనసాగించడం. అయితే, ఈ రెండు వేదికలను ఒకదానికొకటి భౌగోళిక, రాజకీయ ప్రత్యర్థులుగా భావిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














