టైటాన్‌ సబ్‌మెర్సిబుల్‌కు అసలేం జరిగిందో ఎలా తెలుస్తుంది... దొరికే ప్రతి శకలం ఎంతో ముఖ్యం

టైటాన్ సబ్‌మెర్సిబుల్
ఫొటో క్యాప్షన్, శకలాలను సేకరించనున్న రిమోట్‌తో నడిచే వాహనాలు
    • రచయిత, పల్లభ్ ఘోష్
    • హోదా, సైన్స్ ప్రతినిధి

అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ శిథిలాలు చూడ్డానికి మినీ జలాంతర్గామి టైటాన్‌లో ప్రయాణించిన అయిదుగురూ మరణించారని అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటించింది.

ఈ జలాంతర్గామికి చెందిన అయిదు భాగాలు టైటానిక్ నౌక ముందు భాగానికి 487 మీటర్ల దూరంలో లభించినట్లు కోస్ట్ గార్డ్ రేర్ అడ్మిరల్ జాన్ మౌగర్ చెప్పారు.

టైటాన్‌తో సంబంధాలు తెగిపోయిన తర్వాత దాని రెస్క్యూ ఆపరేషన్లో ఉన్న అమెరికా కోస్ట్ గార్డ్‌ సిబ్బందికి అది పేలిపోయినట్లు భారీ శబ్దం వినిపించింది.

గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జాన్ మౌగర్ ఈ శిథిలాలు టైటాన్ సబ్‌మెర్సిబుల్‌వి లాగే ఉన్నాయని చెప్పారు.

టైటాన్ పేలుడుకు ఏది కారణం అనేది స్పష్టంగా తెలీడం లేదన్నారు.

ఈ సబ్‌‌మెర్సిబుల్‌లో ఓషన్ గేట్ సీఈఓ 61 ఏళ్ల స్టాక్టన్ రష్, 48 ఏళ్ల బ్రిటిష్ పాకిస్తానీ వ్యాపారవేత్త షహజాదా దావూద్, 19 ఏళ్ల ఆయన కొడుకు సులేమాన్, 58 ఏళ్ల బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్ ఉన్నారు.

దీనిలోని ఐదో వ్యక్తి 77 ఏళ్ల పాల్ హెన్రీ నార్గోలెట్. ఆయన మాజీ ఫ్రెంచ్ నావీ డ్రైవర్, ప్రముఖ అన్వేషకులు.

టైటాన్‌లో ప్రయాణించిన తండ్రీకొడుకులు షహజాదా, సులేమాన్ దావూద్ మృతిపై వారి కుటుంబ సభ్యులు విషాదం వ్యక్తం చేశారు.

షహజాద్ దావూద్, సులేమాన్ దావూద్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సులేమాన్ దావూద్, షహజాద్ దావూద్

అసలేమై ఉండొచ్చు?

మహా సముద్రపు అడుగున టైటాన్ సబ్‌మెర్సిబుల్‌కు చెందిన శకలాలను గుర్తించిన తర్వాత, అసలు ఈ ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందో తెలుసుకునేందుకు రెస్క్యూ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

సహాయక బృందాలు గుర్తించిన శకలాలు భయంకరమైన పేలుడుకి చెందినవని రేర్ అడ్మిరల్ జాన్ మౌగర్ చెప్పారు.

రెండు ముక్కల శకలాలను వారు కనుగొన్నట్లు తెలిపారు.

ఒకటి టైటాన్‌కు చెందిన టైల్ కోన్. ఇది వెనుకవైపు ఇంజిన్ వద్ద కోన్ ఆకారంలో ఉంటుంది. ఇక రెండోది ల్యాండింగ్ ఫ్రేమ్ అని చెప్పారు.

ఇవి ఈ జలాంతర్గామి ముక్కలు ముక్కలుగా విడిపోయింటుందనే దాన్ని సూచిస్తున్నాయి.

అయితే, ఇలా ఎందుకు జరుగుంటుంది? ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే దానిపై అధ్యయనం చేసేందుకు వారు గుర్తించిన శకలాల ప్రతి భాగాన్ని అధికారులు సేకరిస్తున్నట్లు బ్రిటన్ రాయల్ నేవిలోని సబ్‌మెరైన్ మాజీ కెప్టెన్ ర్యాన్ రామ్‌సే చెప్పారు.

‘‘దీనిలో ఎలాంటి బ్లాక్ బాక్స్ లేదు. ఈ జలాంతర్గామిలో చివరి క్షణంలో ఏం జరిగి ఉంటుందనే దాన్ని గుర్తించలేం.’’ అని తెలిపారు.

అయితే, దీనిపై విచారణ ప్రక్రియ విమాన ప్రమాదాని కంటే తక్కువగా ఏమీ ఉండదని అన్నారు.

‘శకలాల ప్రతి భాగాన్ని పరిశీలిస్తాం’

దర్యాప్తు బృందాలు ఒక్కసారి భూ ఉపరితలంపైకి శకలాలను తీసుకొచ్చిన తర్వాత, చివరి క్షణంలో ఏం జరిగి ఉంటుందో తెలుసుకునేందుకు అత్యంత కీలకమైన కార్బన్ ఫైబర్ నిర్మాణం ఏ కారణం చేత పేలిపోయి ఉంటుందో వారు పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు.

సాధారణంగా కార్బన్ ఫైబర్ నిర్మాణం చాలా ధృడంగా, గట్టిగా, బలమైనదిగా ఉంటుంది.

‘కార్బన్ ఫైబర్‌ తంతువుల దిశను తెలుసుకునేందుకు మైక్రోస్కోప్‌తో ప్రతి భాగాన్ని సునిశితంగా పరిశీలిస్తాం. ఈ వాహనానికి కచ్చితంగా ఎక్కడ పగులు ఏర్పడి ఉంటుందో తెలుసుకునేందుకు ప్రయత్నించనున్నాం’ అని ఆయన చెప్పారు.

ఈ ప్రమాదం నిర్మాణ వైఫల్యం వల్ల జరిగి ఉంటుందా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ఇన్వెస్టిగేటర్లు ప్రయత్నిస్తున్నారు.

ఒకవేళ అలానే జరిగి ఉంటే, ఈఫిల్ టవర్‌ బరువుకి సమానమైన అధిక పీడనానికి ఈ జలాంతర్గామి గురై ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ ప్రొఫెసర్ బ్లెయిర్ థార్న్టన్ చెప్పారు.

ఓషన్‌గేట్

ఫొటో సోర్స్, Oceangate Expeditions

ఫొటో క్యాప్షన్, గుర్తించిన శకలాల్లో ల్యాండింగ్ ఫ్రేమ్, రేర్ కవర్‌

‘‘లోపల అత్యంత శక్తిమంతమైన పేలుడు గురించి మేం మాట్లాడుతున్నాం’’ అని బ్లయిర్ చెప్పారు.

ఒకవేళ ఇలా జరిగి ఉంటే, పరీక్షలు సరిగ్గా నిర్వహించకపోవడం వల్లనే ఇలా జరిగి ఉంటుందని కొంతమంది నిపుణులంటున్నారు.

‘‘దాని నిర్మాణంలో అంతర్గత లోపాల కారణంగా కార్బన్ ఫైబర్ విఫలమై ఉంటుంది’’ అని లండన్ ఇంపీరియల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ రోడెరిక్ ఏ స్మిత్ తెలిపారు.

కార్బన్ ఫైబర్, టైటానియం మధ్యలో జాయింట్లను చాలా జాగ్రత్తగా తనిఖీ చేయాల్సి ఉందన్నారు.

ఈ భయంకరమైన పేలుడి సంభవించే సమయంలో ఎలాంటి సంఘటనలు జరిగి ఉంటాయో గుర్తించడం చాలా కష్టమని ఆయన అన్నారు.

అందుకు వీలైతే ఈ సమాచారాన్ని వెనక్కి పొందే, లోతైన, శ్రమతో కూడిన విచారణ అవసరమని తెలిపారు.

జలాంతర్గామికి చెందిన ఇలాంటి సంఘటనలకు ఎలాంటి ప్రొటోకాల్ లేకపోవడంతో, ఈ విచారణను ఏ ఏజెన్సీ చేపట్టనుందో ఈ దశలో చెప్పడం కష్టమే.

వివిధ దేశాలకు చెందిన ఐదుగురు వ్యక్తులతో వెళ్తోన్న ఈ వాహనానికి మహా సముద్రంలో ఒక రిమోట్ ఏరియాలో ఈ సంఘటన జరగడంతో, ఇది చాలా క్లిష్టంగా మారిందని అడ్మిరల్ మౌగర్ చెప్పారు.

కానీ, ఇప్పటి వరకు ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు అమెరికా కోస్ట్‌గార్డునే కీలక పాత్ర పోషించింది. మున్ముందు కూడా ఇదే ముఖ్యమైన పాత్రను కొనసాగించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)