పెగాసస్: 'డ్రైవర్ తాగి నడిపితే, తప్పు కారు తయారు చేసిన కంపెనీది అవుతుందా?'

తన కస్టమర్లు హ్యాకింగ్‌కు పాల్పడితే ఆ బాధ్యత తమది కాదని పెగాసస్ స్పైవేర్ తయారీ సంస్థ వెల్లడించింది.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, తన కస్టమర్లు హ్యాకింగ్‌కు పాల్పడితే ఆ బాధ్యత తమది కాదని పెగాసస్ స్పైవేర్ తయారీ సంస్థ వెల్లడించింది.
    • రచయిత, జో టైడీ
    • హోదా, బీబీసీ టెక్నాలజీ రిపోర్టర్

డ్రైవర్ తాగి నడిపితే కార్ కంపెనీది బాధ్యతంటే ఎలాగని పెగాసస్ స్పైవేర్ తయరీ కంపెనీ ఎన్ఎస్ఓ ప్రశ్నిస్తోంది. కస్టమర్లు హ్యాంకింగ్‌కు పాల్పడితే దానికి బాధ్యత తమది కాదని ఆ సంస్థ వెల్లడించింది

ఈ స్పైవేర్ తయారు చేసిన ఇజ్రాయెల్ స్పైవేర్ తయారీ సంస్థ ఎన్‌ఎస్‌ఓ హ్యాకింగ్ ఎపిసోడ్‌తో అంతర్జాతీయంగా విమర్శలను ఎదుర్కొంది.

కొన్ని సామాజిక సంస్థలు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులందరిపై పెగసస్ సహాయంతో గూఢచర్యం చేశారని ఇటీవల ఆరోపణలు వినిపించాయి.

50 వేల ఫోన్ నంబర్ల జాబితా లీక్ అయిందని తేలడంతో ఈ కేసులో దర్యాప్తు ప్రారంభమైంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెగాసస్ స్పైవేర్‌ను ఐఫోన్, ఆండ్రాయిడ్ లేక ఏ రకమైన ఫోన్‌లోనైనా గూఢచర్యం కోసం ఉపయోగించవచ్చు.

ఈ స్పైవేర్‌ ఫోన్‌ను తన కంట్రోల్‌లోకి తీసుకుంటుంది. దాని నుంచి వచ్చీపోయే మెసేజ్‌లు, ఫొటోలు, ఈ మెయిళ్ళు, కాల్ రికార్డులు, కెమెరా, మైక్రోఫోన్‌ సహా అన్ని వివరాలను ఈ స్పైవేర్ యాక్సెస్‌ చేయగలదు.

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 50వేలమంది ప్రముఖుల ఫోన్‌లలలో పెగాసస్ చొరబడినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
ఫొటో క్యాప్షన్, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 50వేలమంది ప్రముఖుల ఫోన్‌లలలో పెగాసస్ చొరబడినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.

కానీ, పెగాసస్‌ను తయారు చేసిన సంస్థ మాత్రం కేవలం నేరస్తులు, ఉగ్రవాదులపై నిఘా పెట్టడానికి మాత్రమే ఈ స్పైవేర్‌ను రూపొందించామని చెబుతోంది.

తమ కస్టమర్లైన దేశాలలో మానవ హక్కుల పరిస్థితి బాగుందని నిర్ధారించిన తర్వాతే ఆయా దేశాల సైన్యాలు, ప్రభుత్వ సంస్థలకు ఈ స్పైవేర్‌ను అమ్ముతున్నామని చెబుతోంది.

అయితే, కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఈ స్పైవేర్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గూఢచర్యం జరిగినట్లు ఆరోపించాయి.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నంబర్ కూడా ఈ స్పైవేర్ టార్గెట్లలో ఉన్నట్లు ఫ్రెంచ్ మీడియా సంస్థ తన నివేదికలో పేర్కొంది.

సైప్రస్‌లోని సర్వర్ల ద్వారా ఈ నంబర్ల నుంచి యాక్సెస్ సాధించినట్లు పెగాసస్ స్పైవేర్ మీద ఆరోపణలు వచ్చాయి.

కానీ, ఆ కంపెనీ ప్రతినిధి మాత్రం ఈ విషయాన్ని తోసిపుచ్చారు. ''అసలు మాకు సైప్రస్‌లో సర్వర్లు లేవు. రెండవది, మా వినియోగదారుల డేటా మా దగ్గర ఉండదు'' అని బీబీసీతో అన్నారు.

''మా కస్టమర్లందరూ ఒకరితో ఒకరు కనెక్ట్ కాలేదని అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. యూజర్లందరికీ సొంత డేటా బేస్ ఉంది. కాబట్టి అలాంటి లిస్ట్ ఉండాలన్న నియమేమీ లేదు'' అని ఆ ప్రతినిధి స్పష్టం చేశారు.

''మాకు తెలిసి మా కస్టమర్లు వందల్లోనే ఉంటారు. సంస్థ ప్రారంభమైనప్పటి నుండి కూడా మాకు మొత్తం యాభై వేల టార్గెట్‌లు లేవు'' అని ఆ ప్రతినిధి వెల్లడించారు.

పెగాసస్ మొబైల్ ఫోన్‌లోకి చేరి సమాచారాన్ని సేకరించగలదు
ఫొటో క్యాప్షన్, పెగాసస్ మొబైల్ ఫోన్‌లోకి చేరి సమాచారాన్ని సేకరించగలదు

భద్రతా సేవలు

ఈ కంపెనీ కొన్నేళ్లుగా నిఘా పెట్టడానికి ఉపయోగపడుతోందని ఆరోపణలున్నాయి. అణచివేత ధోరణులున్న ప్రభుత్వాలకు ఈ స్పైవేర్‌ను అమ్మారని, ఈ కారణంగా అనేకమంది సామాన్యులు, అమాయకులు నిఘాకు గురయ్యారని విమర్శలు వినిపించాయి.

కానీ, ఆ కంపెనీ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది.

ఈ స్పైవేర్ ద్వారా ఎవరిని లక్ష్యం చేసుకున్నారో నిరంతర తనిఖీలు ఉండవని, అయితే, కంపెనీ అలా చేయడానికి వ్యవస్థ మాత్రం ఉందని ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు.

ఈ నెల ప్రారంభంలోనే ఎన్ఎస్ఓ గ్రూప్ ట్రాన్స్‌పరేన్సీ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ''మనకోసం మనం ఉన్నత ప్రమాణాలను ఏర్పరచుకోవాలి. అలాగే మానవ హక్కులు, ప్రైవసీ, ప్రజల భద్రతను ఎప్పటికప్పుడు నిర్ధారించడానికి నాయకత్వంతో కలిసి పారదర్శకంగా పని చేయాలి'' అని ఆ రిపోర్టు పేర్కొంది.

అయితే, బుధవారం ఈ వ్యవహారంపై స్పందించిన ఆ కంపెనీ ప్రతినిధి '' ఒక కారు డ్రైవరు తాగి కారు నడిపి యాక్సిడెంట్ చేస్తే, కారు డ్రైవర్‌ను పట్టుకుంటారు కానీ, కారు కంపెనీని కాదు కదా'' అని అన్నారు.

''మేము పెగసస్‌ను ప్రభుత్వాలకు అమ్ముతున్నాము. ఇవన్నీ చట్టబద్ధంగా జరుగుతాయి'' అని ఆయన అన్నారు.

''మా కస్టమర్లలో ఎవరైనా పెగసస్‌ను దుర్వినియోగం చేస్తున్నారని మాకు తెలిస్తే, వారు ఇకపై మా కస్టమర్‌లుగా ఉండరు. కానీ, పెగాసస్‌ను దుర్వినియోగం చేస్తే దానికి బాధ్యత కస్టమర్లదే'' అని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.

ఆండ్రాయిడ్, ఐఫోన్ సహా అన్ని రకాల మొబైల్ లలో పెగాసస్ ప్రవేశించగలదు

ఫొటో సోర్స్, NURPHOTO/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఆండ్రాయిడ్, ఐఫోన్ సహా అన్ని రకాల మొబైల్ లలో పెగాసస్ ప్రవేశించగలదు

'యాదృచ్ఛికం'

ఈ జాబితాలో మొబైల్ నంబర్లు ఉన్న వారిలో 67 మంది తమ ఫోన్‌లను ఫోరెన్సిక్ పరీక్ష కోసం ఫ్రెంచ్ మీడియా సంస్థ 'ఫర్బిడెన్ స్టోరీస్' కు ఇవ్వడానికి అంగీకరించారని తెలిసింది.

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ల్యాబ్స్ 37 మంది ఫోన్లలో పెగసస్ స్పైవేర్ ఉన్నట్లు ఆధారాలు కనుగొంది. అయితే, ఎన్ఎస్ఓ మాత్రం ఈ ఫోన్‌లలో స్పైవేర్ జాడలు ఎలా ఉన్నాయో తమకు తెలియదని, ఇది కేవలం యాదృచ్చికం కావచ్చని వ్యాఖ్యానించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)