గ్రే లిస్ట్‌ లోనే పాకిస్తాన్: ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నిర్ణయం

ఇమ్రాన్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్‌ను 'గ్రే లిస్ట్'లోనే కొనసాగించాలని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమావేశంలో నిర్ణయించారు.

కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో ఎఫ్ఏటీఎఫ్ సమావేశాన్ని ఆన్‌లైన్ పద్ధతిలో వర్చువల్‌గా నిర్వహించారు. బుధవారం మొదలైన ఈ మూడు రోజుల సమావేశం శుక్రవారం ముగిసింది.

పాకిస్తాన్‌ను 2021 ఫిబ్రవరి వరకూ గ్రే లిస్ట్‌లోనే ఉంచాలని సమావేశం చివరి రోజైన శుక్రవారం నాడు నిర్ణయించారు. ఎఫ్ఏటీఎఫ్‌కు సంబంధించిన ఆరు అంశాలను పాకిస్తాన్ నెరవేర్చే వరకూ ఆ దేశం గ్రే లిస్ట్‌లోనే కొనసాగుతుంది.

తీవ్రవాదానికి నిధుల ప్రవాహాన్ని, మనీ లాండరింగ్‌ను నిలువరించటంలో పాకిస్తాన్ ఎంతవరకూ విజయవంతమైందనే అంశాన్ని ఈ సమావేశంలో సమీక్షించారు.

ఈ సమావేశ ఏర్పాట్లను భారత్ సహా చాలా దేశాలు గత కొద్ది రోజులుగా పరిశీలిస్తున్నాయి.

2020 ఫిబ్రవరిలో జరిగిన ఎఫ్ఏటీఎఫ్ సమావేశంలో.. మొత్తం 27 అర్హతల్లో కేవలం 14 అర్హతలనే పాకిస్తాన్ సాధించిందని టాస్క్ ఫోర్స్ పేర్కొంది. మిగతా 13 నిబంధనలను పూర్తి చేయటానికి పాకిస్తాన్‌కు మరో నాలుగు నెలల సమయం ఇచ్చింది.

ఈ నిబంధనలను ఎంతవరకూ పాటించిందనే దాన్నిబట్టి పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్‌లో ఉంచాలా, బ్లాక్ లిస్ట్‌లో ఉంచాలా అనేది ఎఫ్ఏటీఎఫ్ నిర్ణయిస్తుంది.

ఆసియా పసిఫిక్ గ్రూప్ (ఏపీజీ) అక్టోబర్ 11వ తేదీన విడుదల చేసిన సమీక్ష నివేదికలో పాకిస్తాన్‌ను.. 'మరింతగా సమీక్షించాల్సిన జాబితా'లో చేర్చింది. మనీ లాండరింగ్‌ను, తీవ్రవాదానికి నిధుల ప్రవాహాన్ని నిలువరించటంలో పాక్ విఫలమవటం ఇందుకు కారణంగా ఏపీజీ పేర్కొంది.

అంతకుమందు.. 27 ఎఫ్ఏటీఎఫ్ సిఫారసుల్లో 21 అంశాలను పాకిస్తాన్ నూటికి నూరు శాతం అమలు చేసిందని, మిగతా ఆరు సిఫారసులను త్వరలో అమలు చేయటానికి పాక్ కట్టుబడి ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి షా మొహమూద్ ఖురేషీ పేర్కొన్నారు.

ఎఫ్ఏటీఎఫ్ షాక్

ఫొటో సోర్స్, Getty Images

ఎఫ్ఏటీఎఫ్ - ఏమిటీ సంస్థ?

ఎఫ్ఏటీఎఫ్ ఒక అంతర్జాతీయ సంస్థ, దీనిని జీ7 దేశాల చొరవతో 1989లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ప్యారిస్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మనీ ల్యాండరింగ్‌ను ఎదుర్కోడానికి ఇది విధానాలు రూపొందిస్తుంది.

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సజావుగా ఉండేలా ఇది విధానాలు రూపొందిస్తుంది. వాటిని అమలు చేసే దిశగా పనిచేస్తుంది. 2001లో ఇది తీవ్రవాదం, వారికి నిధులు అందించడాన్ని కూడా తన విధానాల్లో చేర్చింది.

భారత్, అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా సహా ఎఫ్ఏటీఎఫ్‌లో మొత్తం 38 సభ్య దేశాలు ఉన్నాయి.

ఈ లిస్టులో ఉండడం వల్ల పాకిస్తాన్‌కు ప్రతి ఏటా సుమారు 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ.73 వేల కోట్లు) నష్టం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)