చార్లెస్ డార్విన్కూ అంతుచిక్కని మిస్టరీ: జీవపరిణామ సిద్ధాంతానికే ముప్పుగా పరిణమించిన 'విసుగుపుట్టించే రహస్యం'

ఫొటో సోర్స్, Getty Images
ప్రఖ్యాత ప్రకృతివాది చార్లెస్ డార్విన్ తన జీవితం చివరి సంవత్సరాలు.. ఓ నిగూఢ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నాల్లో గడిపారు.
ఆయన మాటల్లోనే చెప్తే.. ''అత్యంత కలవరపరిచే ఈ దృగ్విషయం'' తన ప్రధాన శాస్త్రీయ కృషి.. జీవపరిణామ సిద్ధాంతానికే ముప్పుగా పరిణమించింది.


డార్విన్ 1859లో ప్రచురించిన తన పుస్తకం ఆరిజన్ ఆఫ్ స్పెసీస్లో.. ప్రకృతి వరణం - అంటే సహజ ఎంపిక ద్వారా జరిగే జీవపరిణామ సిద్ధాంతాన్ని వివరించారు.
''సంరక్షిత జీవికి ప్రయోజనకరమైన.. వారసత్వంగా వచ్చిన చిన్న చిన్న మార్పులను సంరక్షించుకోవటం పెంపొందించుకోవటం ద్వారా మాత్రమే'' ఈ జీవపరిణామం జరుగుతుందని చెప్పారు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఒకేసారి సంభవించే భారీ మార్పుల వల్ల కానీ, అకస్మాత్తుగా వచ్చే విప్లవాత్మక మార్పుల వల్ల కానీ జీవపరిణామం సంభవిస్తుందని ఆయన నమ్మలేదు.
''నూతన జీవుల సృష్టి నిరంతరం కొనసాగుతుందనే విశ్వాసాన్ని, లేదంటే వాటి నిర్మాణంలో ఏదైనా భారీ లేదా ఆకస్మిక మార్పు గానీ జరుగుతుందనే నమ్మకాన్ని ప్రకృతి వరణం నిర్మూలిస్తుంది'' అని ఆయన రాశారు.
కానీ.. ఆ తర్వాత ఆయన చేపట్టిన పరిశోధనలు - ప్రధానంగా వృక్షశాస్త్రం మీద చేసిన అధ్యయనాలు - ఆయన రచించిన అతిగొప్ప సిద్ధాంతాన్ని ప్రశ్నార్థకం చేశాయి. ఇది ఆ తర్వాత ఇరవై ఏళ్ల పాటు.. మరణించే వరకూ డార్విన్ను వేధించింది.

ఫొటో సోర్స్, Getty Images
జీవపరిణామ సిద్ధాంతానికే ముప్పు
జీవపరిణామం పెద్ద 'గెంతులతో ముందుకు సాగద'నే డార్విన్ సిద్ధాంతాన్ని.. ఆయన తాజాగా గుర్తించిన అంశాలే ప్రశ్నిస్తున్నపుడు.. కొందరు నమ్మకస్తులైన సహచరులకు ఆ విషయం గురించి రాశారు డార్విన్.
ఈ అంశంపై డార్విన్ 1875 నుంచి 1882లో చనిపోయేవరకూ లేఖల ద్వారా చురుకైన చర్చను కొనసాగించారు. అది.. ఒకటిన్నర శతాబ్దం తర్వాత ఇప్పుడు కూడా జీవశాస్త్రవేత్తలకు స్ఫూర్తినిస్తోంది.
యూరోపియన్ ఆల్ప్స్ పర్వతాల వృక్ష సంపద మీద అధ్యయనం చేసిన ఐర్లండ్ ప్రకృతి శాస్త్రవేత్త జాన్ బాల్.. పుష్పించే మొక్కల్లో ఆవృతబీజాలు అకస్మాత్తుగా కనిపించటం గురించి రాసిన వ్యాసం చదివిన డార్విన్ దిగ్భ్రాంతికి లోనయ్యారు.
1879 జూలై 22న బ్రిటిష్ వృక్ష పరిశోధన, విద్యా సంస్థ క్యూ గార్డెన్స్ డైరెక్టర్ జోసెఫ్ హుకర్కు ఒక లేఖ రాశారు.
''ఇటీవలి భూవిజ్ఞాన కాలంలో ఉన్నతశ్రేణి మొక్కలన్నిటి గురించి మనం ఆలోచిస్తే.. ఈ వేగవంతమైన పరిణామం విసుగుపుట్టించే రహస్యం'' అని అందులో పేర్కొన్నారు.
అంటే.. జీవపరిణామం ఒకేసారి వేగంగానూ, గొప్ప మార్పుతోనూ సంభవించగలదని.. పుష్పించే మొక్కల్లో ఆవృతబీజాలు అకస్మాత్తుగా ప్రత్యక్షమవుతున్నట్లు సూచించటం డార్విన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది.
డార్విన్ మేధో నిజాయతీ
డార్విన్ - హుకర్ మధ్య లేఖల్లోని అంశాన్ని విశ్లేషిస్తూ అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఆర్గానిస్మిక్ అండ్ ఎవల్యూషనరీ బయాలజీ ప్రొఫెసర్ విలియం ఫ్రీడ్మాన్ 2009లో ఒక వ్యాసం రాశారు.
''ఈ ఆవృతబీజాల ఆవిర్భావం.. సున్నపురాతి యుగం మధ్యకాలంలో ఒక ఆకస్మిక పుట్టుకగా, విభిన్న పుష్పజాతులుగా అత్యంత వేగవంతమైన విస్తరణగా భావించిన డార్విన్.. ఇదెలా జరిగిందనే అంశం మీద చాలా కలతచెందారు'' అని అందులో పేర్కొన్నారు.
ఎందుకంటే.. భూమి చరిత్రలో అత్యధిక కాలం ఆవృతబీజాలు అసలు మనుగడలోనే లేవు. కానీ అకస్మాత్తుగా ఇవి ఆవిర్భవించాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి అంతకుముందు ఉన్న.. మరింత పురాతన మొక్కల నుంచి పరిణామం చెందాయనటానికి ఆధారం ఏది?

ఫొటో సోర్స్, Getty Images
''డార్విన్లో చాలా సుగుణం ఏమిటంటే.. అతడి మేధో నిజాయతీ'' అంటారు ఫ్రీడ్మాన్. ''ఈ రహస్యం తనకు పిచ్చెక్కిస్తున్నా కానీ.. దీనిని చాప కింద దాచేయబోనని డార్విన్ తన లేఖల్లో రాశారు'' అని ప్రశంసించారు.
డార్విన్ దృష్టిని ఇంతగా పట్టినిలిపిన ఇతర జీవ బృందం మరేదీ ఉండకపోవచ్చునని ఫ్రీడ్మాన్ బీబీసీతో పేర్కొన్నారు.
''మొక్కల్లోని గొప్ప జాతులన్నిటిలోకీ.. భూమి మీద చాలా ఆలస్యంగా ఆవిర్భవించిన బృందం.. పుష్పించే మొక్కల జాతి'' అని ఆయన చెప్పారు.
కానీ.. బాల్ పరిశోధనలో గుర్తించిన దాని ప్రకారం.. ఈ ఆవిర్భావం అకస్మాత్తుగా సంభవించింది. వివిధ రూపాలలోకి మారటం వంటి కొన్ని పరిణామ దశలు తప్పినట్లు కనిపిస్తోంది.
భూమి మీద సుమారు 13 కోట్ల సంవత్సరాల కిందట ఆవృతబీజాలు ఆవిర్భవించాయి. అతి తక్కువ కాలంలోనే 3.50 లక్షల విభిన్న జాతులుగా విస్తరించగలిగాయి. మొత్తం వృక్ష రాజ్యంలో అత్యధిక భిన్నత్వం గల బృందంగా అవతరించాయి.
''ఒక తోట గురించి ఆలోచించినపుడు.. అందులో ఎక్కువ మొక్కలు పుష్పించే మొక్కలే ఉంటాయి. మనం తినే పండ్లు, కూరగాయలు కూడా అత్యధికంగా పుష్పించే మొక్కల నుంచే వస్తాయి'' అని ఫ్రీడ్మాన్ పేర్కొన్నారు.
నిజానికి.. మన ఆహార వ్యవస్థకు మూలాధారంగా ఉండటమే కాదు.. నేడు మనకు కనిపించే విభిన్న జంతుజాతుల ఉనికికి ఇంధనంగా ఉన్న ఈ ఆవృతబీజాల అద్భుత భిన్నత్వం, విజయం గురించి శాస్త్రవేత్తలు 200 సంవత్సరాల పాటు చాలా ఊహాగానాలు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
''డైజీలు పుట్టుగాక''
పుష్పించే మొక్కల ఆకస్మిక పుట్టుక గురించి కానీ, అవి లెక్కలేని సంఖ్యలో భిన్నరూపాల్లో విస్తరించటం గురించి కానీ డార్విన్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. ''ప్రకృతిలో ఒక్కసారిగా పెను మార్పు రాబోదని తను బలంగా నమ్మిన దానికి చాలా తీవ్రమైన మినహాయింపుగా ఉన్న ఆవృతబీజాల ఆవిర్భావం గురించి మాత్రమే ఆయన ఆందోళన'' అని ఫ్రీడ్మాన్ చెప్పారు.
''ఒక సంభావ్య సిద్ధాంతం ఏమిటంటే.. ఈ పుష్పించే మొక్కలు సృష్టించబడి ఉండొచ్చు'' అంటూ సృష్టి సిద్ధాంతాన్ని ఉటంకించారు ఫ్రీడ్మ్యాన్. సృష్టి సిద్ధాంతం అంటే.. దేవుడు లేదా మానవాతీత శక్తి ఈ ప్రపంచాన్ని సృష్టించిందనే విశ్వాసం.
''మరో రకంగా చెప్తే.. ఆవృతబీజాలు పరిణామ ఫలితం కాదు. దేవుడు వాటిని తయారు చేసి ఉంటాడు.. ఒక రోజు 'బూమ్! డైజీలు పుట్టుగాక' అనుండాలి. ఆ తర్వాత.. 'బూమ్! చంపకం చెట్లు పుట్టుగాక' అని, మళ్లీ 'బూమ్! గడ్డి పుట్టుగాక' అని.. అలా వరుసగా అనుండాలి'' అని ఆయన వ్యాఖ్యానించారు.
13 కోట్ల సంవత్సరాల కిందటి శిలాజాల చరిత్ర ప్రకారం.. ఈ ప్రక్రియ చాలా వేగంగా జరిగినట్లు కనిపించింది.
కానీ.. డార్విన్ మరొక వివరణ ప్రతిపాదించారు.

ఫొటో సోర్స్, Getty Images
మాయమైన భూ ఖండం
''బహుశా చాలా చాలా కాలం కిందట దక్షిణార్థ గోళంలో ఒక చిన్న మారుమూల ఏకాంత ఖండం ఉండి ఉండొచ్చునని.. ఈ ఉన్నతస్థాయి మొక్కలకు (ఆవృతబీజాలకు) అది జన్మస్థానంగా ఉపకరించి ఉండవచ్చునని నేను అనుకుంటున్నా'' అని జోసెఫ్ హుకర్కు రాసిన లేఖలో డార్విన్ రాశారు.
అయితే.. ''ఇది చాలా దిక్కుమాలిన అల్పమైన ఊహ'' అని డార్విన్ స్వయంగా అంగీకరించారు. అయితే.. 1831-1836 సంవత్సరాల మధ్య హెచ్ఎంఎస్ బీగిల్ మీద ప్రయాణిస్తూ.. దక్షిణ అమెరికా తీర ప్రాంతాన్ని పరిశోధిస్తూ.. తను తెలుసుకున్న ప్రపంచం చుట్టూ సముద్రయానం చేస్తూ నేర్చుకున్న అంశాల ప్రాతిపదిగా ఆయన ఈ ఊహ చేశారు. ఐదేళ్ల సముద్రయానం అనంతరం 27 ఏళ్ల వయసులో ఇంటికి తిరిగివచ్చారు డార్విన్.
మరొక సంభావ్యత గురించి కూడా డార్విన్ ఊహించారు.
పుష్పించే మొక్కల పరిణామక్రమంలో ప్రతి దశనూ వివరించే శిలాజాలు ఎక్కడో ఉండి ఉండొచ్చునని.. వాటిని మనం ఇంకా కనిపెట్టి ఉండకపోవచ్చుననేది ఆ ఊహ.
మొత్తానికి ఈ రహస్యాన్ని డార్విన్ పరిష్కరించలేదని ఫ్రీడ్మాన్ పేర్కొన్నారు. అదేసమయంలో ''అద్భుతాలను నమ్మటానికి ఆయన తిరస్కరించారు. దానికి బదులుగా హేతుబద్ధ ఆలోచనలను, ప్రకృతి సార్వజనీన నియమాలను అనుసరించారు'' అని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
నేటి విసుగు పుట్టించే రహస్యం
''ఈ సమస్య అంతా పరిష్కారమవటం చూడాలని నేను అనుకుంటున్నా'' అని హుకర్కు రాసిన లేఖలో డార్విన్ పేర్కొన్నారు.
కానీ.. ''ఆ పరిష్కారాన్ని చూడటానికి డార్విన్ ఎక్కువ కాలం జీవించలేదు'' అని ఫ్రీడ్మాన్ వ్యాఖ్యానించారు.
ఆవృతబీజాల పుట్టుక, విభిన్న జాతులుగా విస్తరించటం మీదే ఫ్రీడ్మాన్ పరిశోధన కేంద్రీకృతమై ఉంది.
''పుష్పించే మొక్కలు విభిన్న జాతులుగా రూపాంతరం చెందిన తొలి దశలను అర్థం చేసుకోవటానికి తోడ్పడిన విలువైన శిలాజాలను మేం వెలికితీశాం. నిజానికి ఈ పరిశోధనలో గత 30 ఏళ్లలో చాలా పురోగతి ఉంది'' అని ఆయన వెల్లడించారు.
ఆవృతబీజాలు ఆకస్మికంగా ఆవిర్భంచలేదని.. అవి కూడా నెమ్మదిగా పరిణామం చెందుతూ వచ్చాయని ఇటీవల ప్రచురించిన పరిశోధన ఫలితాలు బహిర్గతం చేశాయి.
భూమి మీద సజీవంగా ఉన్న మొక్క జాతుల్లో దాదాపు 90 శాతం 3.50 లక్షల పుష్పించే మొక్కల జాతులే ఉన్నాయి. అవి లేకపోతే.. మన ప్రధాన పంటలేవీ లేవు, పశువుల పోషణకు ఉపయోగించే పంటలూ లేవు, మన బొగ్గుపులుసు వాయువులను పీల్చుకుని శుభ్రం చేసే అత్యంత ముఖ్యమైన వృక్ష సంపదా ఉండదు.
అయినా.. కొన్ని కీలక ప్రశ్నలకు ఇంకా జవాబులు దొరకలేదు: పువ్వులు ఎలా పుట్టాయి? పువ్వుల ప్రాధమిక నిర్మాణం ఎక్కడి నుంచి వచ్చింది? పుష్పించే మొక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి అంత అద్భుతంగా విజయం సాధించటానికి కారణం ఏమిటి?
''విసుగుపుట్టించే ఈ రహస్యం కొనసాగుతూనే ఉంది'' అంటారు ఫ్రీడ్మాన్.
(ఫిబ్రవరి 12 - చార్లెస్ డార్విన్ జయంతి)

ఇవి కూడా చదవండి:
- బుద్ధుడి గురించి ఈ విషయాలు తెలుసా?
- అవునా.. ఐన్స్టీన్ది మొద్దు నిద్రా?
- ఐన్స్టీన్కు వచ్చిన పేరు ఆయన భార్యకు ఎందుకు రాలేదు?
- ఐన్స్టీన్ ‘థియరీ ఆఫ్ హ్యాపీనెస్’
- పిల్లలకు పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తున్నాయా.. కారణం ఇదే
- సైకోలే సరైన నాయకులా?
- అర్థరాత్రి దాటినా నిద్ర పోవట్లేదా? మీ జీవ గడియారాన్ని అనుకూలంగా మార్చుకోవటం ఎలా?
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: చనిపోయే దాకా దీక్షను కొనసాగించటానికి కారణాలేంటి?
- రవీంద్రనాథ్ ఠాగూర్: ‘జాతీయవాదం ప్రమాదకారి. భారతదేశ సమస్యలకు అదే మూలం’
- అరటి పళ్లపై జీఎస్టీ ఎంత? రెస్టారెంట్లలో తింటే దేనికి పన్ను కట్టాలి? దేనికి అక్కర్లేదు?
- రబ్బర్: విషపూరిత చరిత్ర.. భయానక పరిణామాలు
- ట్రిపుల్ తలాక్ చట్టంతో ముస్లిం మహిళలకు మేలెంత?
- 'అందమైన యువతి'లా కనిపించేందుకు ఫిల్టర్ వాడుతూ లైవ్లో దొరికిపోయిన వీడియో బ్లాగర్
- Man vs Wild: డిస్కవరీ చానల్ షోలో బియర్ గ్రిల్స్తో ప్రధాని మోదీ అరణ్యయాత్ర
- కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'
- హైటెక్ వ్యవసాయం: ఆహార ఉత్పత్తుల దిగుబడిని పెంచడంలో టెక్నాలజీ పాత్ర ఏమిటి...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









