బంగ్లాదేశ్: 22 మంది మరణానికి కుట్రపన్నిన ఏడుగురికి మరణశిక్ష

దాడులకు ప్రణాళిక, దాడికి పాల్పడినవారికి ఆయుధాలు సరఫరా చేయడం వంటి నేరాలకు సంబంధించి 8 మందిని విచారించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దాడులకు ప్రణాళిక, దాడికి పాల్పడినవారికి ఆయుధాలు సరఫరా చేయడం వంటి నేరాలకు సంబంధించి 8 మందిని విచారించారు.

2016లో బంగ్లాదేశ్‌లోని ఓ కెఫేపై ఉగ్రదాడులకు పాల్పడినట్లు ఆరోపణలపై ఏడుగురు ఇస్లామిస్టులకు కోర్టు మరణశిక్ష విధించింది.

దేశ రాజధాని ఢాకాలో హోలీ ఆర్టిసాన్ కెఫేపై 2016లో ఐదుగురు జరిపిన దాడిలో 22 మంది మరణించారు.

12 గంటల పాటు సాగిన ఆ ఆపరేషన్ బంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యంత తీవ్రమైనది. బాధితుల్లో చాలామంది ఇటలీ, జపాన్ దేశస్తులు.

ఈ కేసులో ఎనిమిది మందిపై అభియోగాలు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. దాడులకు ప్రణాళిక, దాడికి పాల్పడినవారికి ఆయుధాలు సరఫరా చేయడం వంటి నేరాలకు సంబంధించి వారిని విచారించారు. అయితే, వీరిలో ఒకరు నిర్దోషిగా విడుదలయ్యారు.

హోలీ ఆర్టిసాన్ కెఫే

ఫొటో సోర్స్, Getty Images

ఆ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ప్రకటించినప్పటికీ బంగ్లాదేశ్ దాన్ని కొట్టిపారేసింది. దానికి ఓ స్థానిక మిలిటెంట్ గ్రూపుదే బాధ్యత అని వెల్లడించింది.

ఆ దాడి తర్వాత బంగ్లాదేశీ అధికారులు మిలిటెంట్ల శిబిరాలను అణిచివేయడం ప్రారంభించారు.

తాజాగా కోర్టు తీర్పు తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోలమ్ సర్వార్ ఖాన్ మాట్లాడుతూ... వారిపై నమోదైన అభియోగాలు ఎలాంటి సందేహాలకూ తావులేకుండా నిరూపితమయ్యాయని అన్నారు.

అయితే, ఈ ఏడుగురూ మళ్లీ అప్పీలుకు వెళ్తారని నిందితుల తరపు న్యాయవాది తెలిపారు. బంగ్లాదేశ్‌లో ఉరివేయడం ద్వారా మరణశిక్షను అమలుచేస్తారు.

శిక్ష పడిన ఏడుగురూ జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) గ్రూపు సభ్యులు.

ఈ దాడులకు సూత్రధారుల్లో ఒకరిగా భావిస్తున్న నూరుల్ ఇస్లాం మార్జాన్ తీవ్రవాద వ్యతిరేక పోలీసుల కాల్పుల్లో 2017 జనవరిలో మరణించినట్లు అధికారులు తెలిపారు.

ఈ దాడుల తర్వాత బంగ్లాదేశీ దళాలు చేపట్టిన ఆపరేషన్లలో దాదాపు 100కు పైగా ఇస్లామిక్ తీవ్రవాదులు మరణించగా, 1000 మందిని అరెస్టు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ దాడుల తర్వాత బంగ్లాదేశీ దళాలు చేపట్టిన ఆపరేషన్లలో దాదాపు 100కు పైగా ఇస్లామిక్ తీవ్రవాదులు మరణించగా, 1000 మందిని అరెస్టు చేశారు.

దాడి ఎలా జరిగింది?

2016 జులై 1 సాయంత్రం, తుపాకులు చేతబట్టిన ఐదుగురు వ్యక్తులు ఢాకాలోని హోలీ ఆర్టిసాన్ కెఫేలోకి ప్రవేశించారు.

లోపల ఉన్నవారిపై ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించి, కెఫేలో ఉన్నవారిని నిర్బంధించారు.

ఈ దాడిలో మిలిటెంట్ల చేతిలో మరణించినవారిలో చాలా మంది విదేశీయులే.

వారిని అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఇద్దరు పోలీస్ అధికారులు మరణించడంతో సైన్యాన్ని రంగంలోకి దింపారు.

12 గంటలపాటు సాగిన ఆపరేషన్ తర్వాత కమాండోలు ఐదుగురు మిలిటెంట్లనూ హతమార్చి, లోపల బందీలుగా ఉన్న 13 మందిని రక్షించారు.

ఈ దాడిలో 9మంది ఇటాలియన్లు, ఏడుగురు జపనీయులు, ఓ అమెరికన్, ఓ భారతీయుడు మరణించారు.

ఈ దాడుల తర్వాత బంగ్లాదేశీ దళాలు చేపట్టిన ఆపరేషన్లలో దాదాపు 100కు పైగా ఇస్లామిక్ తీవ్రవాదులు మరణించగా, 1000 మందిని అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)