గుజరాత్: 'నా భర్త వీర్యం సేకరించేందుకు అనుమతి ఇవ్వండి'

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, సుశీలా సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గుజరాత్ హైకోర్టు ఆదేశాల ప్రకారం వడోదరలోని స్టెర్లింగ్ హాస్పిటల్‌ కోవిడ్-19కు గురైన ఒక రోగి వీర్యం సేకరించి దానిని సంరక్షించింది.

తన భర్త వీర్యం సేకరించి సంరక్షించాలన్న భార్య కోరిక మేరకు కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

అయితే వీర్యం సేకరించి సంరక్షించిన తర్వాత గురువారం ఆయన చనిపోయారు.

అంతకు ముందు మహిళ తరఫు న్యాయవాది నిలయ్ హెచ్ పటేల్ బీబీసీతో ఈ విషయంపై మాట్లాడారు.

"మహిళ భర్త కోవిడ్-19తో చాలా అనారోగ్యానికి గురయ్యారు. దాంతో, ఆమె తన భర్త వీర్యాన్ని సంరక్షించాలని అనుకున్నారు. అదే విషయం ఆమె ఆస్పత్రివారికి చెప్పారు. ఆస్పత్రిలో వైద్యులు దానికి మీ భర్త అనుమతి అవసరం అన్నారు. కానీ, అక్కడ ఒక సమస్య వచ్చింది. బెడ్ మీదున్న ఆమె భర్త దానికి అనుమతించే పరిస్థితిలో లేరు. అలాంటి పరిస్థితుల్లో మహిళ కోర్టుకు వెళ్లాల్సొచ్చింది" అని చెప్పారు.

"ఈ దంపతులకు సుమారు ఎనిమిది నెలల క్రితం పెళ్లైంది. ఇద్దరూ కెనడాలో ఉండేవారు. కానీ తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో ఆయన భార్యతోపాటూ వడోదర వచ్చారు. అక్కడ ఆయనకు కోవిడ్ వచ్చింది. ఆయన సుమారు 30 ఏళ్లుంటాయి" అని నిలయ్ చెప్పారు.

భర్త వీర్యం కోసం కోర్టుకెళ్లిన మహిళ

ఫొటో సోర్స్, PA Media

స్టెర్లింగ్ ఆస్పత్రి జోనల్ డైరెక్టర్ అనిల్ నంబియార్ కూడా బీబీసీతో ఇదే విషయంపై మాట్లాడారు. కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆయన దాదాపు 45 రోజుల క్రితం తమ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని చెప్పారు.

"గత కొన్ని రోజుల నుంచీ ఆయన అవయవాలు పనిచేయడం మానేశాయి. ఆ విషయం మేం రోగి కుటుంబ సభ్యులకు చెప్పాం. ఆయన బతికే అవకాశాలు చాలా తక్కువని చెప్పాం. ఆ తర్వాత రోగి భార్య తన భర్త వీర్యం సేకరించవచ్చా అని అడిగారు. ఆమె, అలా అడగడంతో మా డాక్టర్ల టీమ్ ఆ ప్రక్రియ సాధ్యమేనా, చట్టపరంగా ఏమేం చేయగలం అనేది చర్చించింది" అని తెలిపారు.

డాక్టర్ అనిల్ నంబియార్

ఫొటో సోర్స్, DR. ANIL NAMBIYAR

"రోగి అనుమతి లేకుండా అలా చేయడం తప్పు అవుతుంది. మేం చాలా చర్చించిన తర్వాత TESE ప్రక్రియ ద్వారా రోగి శరీరం నుంచి వీర్యం తీయవచ్చనే నిర్ణయానికి వచ్చాం. కానీ దానికి అనుమతి ఎలా తీసుకోవాలి అనే ప్రశ్న తలెత్తింది. ఆ తర్వాత మహిళ కోర్టుకు వెళ్లారు. కోర్టు కొన్ని నిమిషాల్లోనే దానికి అనుమతి ఇచ్చింది. మేం కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీర్యం సేకరించి దాని సంరక్షణ ప్రక్రియ పూర్తి చేశాం" అన్నారు నంబియార్.

ఇప్పుడు ఐవీఎఫ్ లేదా ఎఆర్టీ ప్రక్రియ ద్వారా పిల్లల్ని ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి అనేది ఆ మహిళపైనే ఆధారపడి ఉంటుంది.

ఐవీఎఫ్ టెక్నాలజీ ద్వారా అండం, శుక్రకణాలను ప్రయోగశాలలో పరీక్ష నాళికలో కలుపుతారు. ఆ తర్వాత పిండాన్ని తల్లి గర్భంలో ప్రవేశపెడతారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)