గంగానదిలో తేలిన 100కి పైగా శవాలు.. కరోనా లెక్కల్లో రాకుండా నదిలో పడేస్తున్నారా

ఫొటో సోర్స్, SATYAPRAKASH/BBC
- రచయిత, సీటు తివారి
- హోదా, బీబీసీ కోసం
బిహార్లో గంగానదిలో పెద్ద సంఖ్యలో శవాలు తేలుతూ రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరణించిన కోవిడ్ రోగులను ఇలా నీటిలో వదిలేస్తున్నారని కొందరు ఆరోపిస్తుండగా, ఇవి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చాయని బక్సర్ జిల్లా అధికారులు చెబుతున్నారు.
బిహార్లోని బక్సర్ జిల్లా చౌసా బ్లాక్లో ఓ దహన వాటిక దగ్గర 40 మృతదేహాలు పడి ఉన్నాయి. ఈ విషయాన్ని అధికారులు బీబీసీకి ధ్రువీకరించారు.
కానీ, అక్కడ 100కి పైగా మృతదేహాలను తాము చూశామని స్థానిక జర్నలిస్టులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, SATYAPRAKASH/BBC
‘జంతువులు పీక్కు తింటున్నాయి’
సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో ఆ మృతదేహాలను జంతువులు పీక్కు తింటున్నట్లు ఫొటోలలో కనిపించింది. ఇవి తమ రాష్ట్రానివి కావని బిహార్ అధికారులు చెబుతున్నారు.
''30 నుండి 40 మృతదేహాలు గంగానదిలో గుర్తించాం. ఈ మృతదేహాలు ఉత్తర్ప్రదేశ్ నుండి వచ్చినట్లు తెలుస్తోంది. ఘాట్ వద్ద ఉన్న పండిట్లు, సిబ్బందితో మాట్లాడాను. ఈ మృతదేహాలు ఇక్కడివి కాదని వారు చెప్పారు'' అని చౌసా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అశోక్ కుమార్ బీబీసీకి తెలిపారు.
కానీ, స్థానిక జర్నలిస్ట్ సత్యప్రకాశ్ మాత్రం అధికారుల వాదనను ఖండించారు.
''ఇప్పుడు గంగా నదిలో ప్రవాహం లేదు. పైగా పశ్చిమంవైపు గాలి వీస్తోంది. తూర్పు గాలికి ఇది సమయం కాదు. అలాంటప్పుడు శవాలు ఎలా కొట్టుకు వస్తాయి'' అని సత్య ప్రకాశ్ అన్నారు.
''నేను ఆదివారం (మే 9న) మొదటిసారి వీటి గురించి తెలుసుకున్నా. సోమవారం నాటికి చాలా వరకు శవాలు తగ్గాయి. బక్సర్లో ఉన్న చరిత్రావన్ ఘాట్కు చారిత్రక ప్రాముఖ్యం కూడా ఉంది.

ఫొటో సోర్స్, ANI
శవాలను వదిలేస్తున్నారా?
కానీ, కరోనా కారణంగా అక్కడ శవాలను కాల్చడానికి స్థలం దొరకడం లేదు. అందుకే అక్కడికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌసా శ్మశాన వాటికకు శవాలను తీసుకువస్తున్నారు.
కానీ, ఈ ఘాట్ వద్ద కట్టెలతో కాల్చే సదుపాయం లేదు. అలాగే, పడవ సర్వీసులు కూడా నిలిపేశారు. పడవలు ఉన్నప్పుడు శవాలను పడవల్లో తీసుకెళ్లేవారు. ఇప్పుడు ఇలా నీటిలో వదిలేస్తున్నారు'' అని సత్యప్రకాశ్ అన్నారు.
గత కొద్ది రోజులుగా ఇక్కడికి డజన్ల కొద్దీ శవాలు కొట్టుకొస్తున్నట్లు బక్సర్ ఎస్డీఓ కేకే ఉపాధ్యాయ్ వెల్లడించినట్లు ఏఎన్ఐ పేర్కొంది. ఈ ప్రాంతంలో శవాలను ఇలా నిమజ్జనం చేసే సంప్రదాయం లేదని, మృతదేహాలకు అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించినట్లు ఏఎన్ఐ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అలాగే, ఈ మృతదేహాలు వారణాసి, అలాహాబాద్ల నుంచి వచ్చాయా, మరెక్కడి నుంచయినా వచ్చాయా అన్నదానిపై విచారణ జరుపుతామని ఉపాధ్యాయ్ వెల్లడించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా అధికారులను అప్రమత్తం చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మృతదేహాలు ఎందుకు కొట్టుకొస్తున్నాయి
''గంగానదిలో అప్పుడప్పుడు ఒకట్రెండు శవాలు కొట్టుకు రావడం సహజమే. కానీ గత 15 రోజులుగా ఇక్కడికి ఇరవై శవాల వరకు వచ్చాయి.
ఈ శవాలన్నీ కరోనా సోకిన బాధితులవే అయ్యుంటాయి. కానీ అధికారులు అంగీకరించరు. కానీ వాస్తవాలు ప్రజలకు తెలుసు'' అని ఘాట్ దగ్గర ఉండే దీన్ దయాళ్ పాండే అనే పండిట్ మీడియాకు చెప్పారు.
మొత్తం మీద ఈ వ్యవహారంపై రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం బిహార్ అధికారులు ఈ డెడ్బాడీలకు అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కోవిడ్ సోకిన వారి మృతదేహాలను ఖననం చేసేందుకు రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు వసూలు చేస్తున్నట్లు స్థానిక జర్నలిస్టులు చెబుతున్నారు.
''ప్రైవేటు ఆసుపత్రులలో మృతదేహాలను అంబులెన్స్ నుంచి బయటకు తీయడానికి రెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఖననం చేసేందుకు డబ్బులేక కొందరు శవాలను నదిలో వదిలి పెడుతున్నారు'' అని స్థానికుడు చంద్రమోహన్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బిహార్లో పరిస్థితి ఎలా ఉంది?
ఇక, బిహార్లో మే 9 నాటికి 1,10,804 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 80.71 శాతం. బక్సర్ జిల్లాలో 1216 యాక్టివ్ కేసులు ఉండగా, 26 మంది మరణించారు. రాష్ట్ర ఆరోగ్య కమిటీ గణాంకాల ప్రకారం, ఇప్పటి వరకు రాష్ట్రంలో 80,38,525 మందికి కోవిడ్ టీకాలు ఇచ్చారు. అత్యంత యాక్టివ్ కేసులు పట్నాలో నమోదవుతున్నాయి.
అంబులెన్స్ ఫీజు, ప్రైవేట్ హాస్పిటల్ ఫీజులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రేట్లు నిర్ణయించింది. కానీ, వాటిని కఠినంగా అమలు చేయడం లేదు. బిహార్లో రోజుకు 10,000 కేసులు వస్తుండగా, 60 మందికి పైగా చనిపోతున్నారు. నిన్న ఆదివారం రాష్ట్రంలో 11,259 కేసులు రాగా 67 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇవి కూడా చదవండి:
- మహిళలు మితిమీరి వ్యాయామం చేస్తే సంతానోత్పత్తి సమస్యలు తప్పవా?
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- కుంభమేళాను మీడియా ఎలా చూపిస్తోంది... తబ్లీగీ జమాత్ విషయంలో ఏం చేసింది?
- ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ వేరియంట్ 1000 రెట్లు స్పీడా... అందుకే ఏపీ ప్రజలంటే ఇతర రాష్ట్రాలు భయపడుతున్నాయా
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- సైనోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్వో ఆమోదం.. ఇప్పటికే కోట్ల మందికి పంపిణీ
- కరోనా వైరస్: పిల్లల్లో సులభంగా, వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- లవ్ జిహాద్: మతాంతర ప్రేమను భయపెడుతున్న భారత చట్టం
- టైటానిక్: ఆనాటి ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ ఆరుగురు చైనీయులు ఏమయ్యారు... జాతి వివక్ష వారిని వెంటాడిందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








