నాదెండ్ల మనోహర్: ‘పవన్‌ కల్యాణ్‌కు రాజకీయంగా సహకారం అందించడానికి చిరంజీవి సిద్ధం’ - ప్రెస్ రివ్యూ

పవన్ కల్యాణ్, చిరంజీవి

ఫొటో సోర్స్, facebook/AlwaysRamCharan

జనసేన అధినేత, తన తమ్ముడు పవన్‌ కల్యాణ్‌కు రాజకీయంగా సహకారం అందించడానికి ప్రముఖ నటుడు చిరంజీవి సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారని ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనంలో పేర్కొంది.

జనసేన క్రియాశీలక కార్యకర్తలకు రూ.ఐదు లక్షల ప్రమాద బీమా, కిట్లు అందజేసేలా విజయవాడలో బుధవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మనోహర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ''చిరంజీవితో పవన్‌ కల్యాణ్‌, నేను కొద్దిరోజుల క్రితం సమావేశమయ్యాం. ఆ సమయంలో మళ్లీ సినిమాల్లో నటించాలని పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి సూచించారు. అలాగే, పవన్‌ కల్యాణ్‌కు రాజకీయంగా అండదండలు అందజేస్తానని భరోసా ఇచ్చారు'' అని తెలిపారు.

కార్యకర్తలంతా ఆదర్శవంతులుగా, నిజాయతీపరులుగా ఉంటూ పార్టీ చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, నాయకత్వానికి అండగా ఉండాలని మనోహర్‌ సూచించారు.

''పవన్‌ కల్యాణ్‌ పిలుపు మేరకు రైతులకు అండగా నిలవడానికి తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో ప్రతి నాయకుడు, కార్యకర్త పాల్గొనాలి. అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం ఎప్పుడు నిర్వహించినా ముట్టడించడానికి సిద్ధంగా ఉండాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు పోటీ చేయాలి. ప్రతిచోటా నామినేషన్‌ దాఖలు చేయాలి. ప్రభుత్వం ఏకగ్రీవాలు చేయాలని కుట్రలు చేస్తోంది. ఇంతకుముందు దౌర్జన్యాలు చేసి 25 శాతం ఏకగ్రీవాలు చేశారు. ఇప్పుడు మాత్రం వెనక్కి తగ్గేది లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని పార్టీ శ్రేణులకు పట్టణ నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలి'' అని నాదేండ్ల మనోహర్‌ పిలుపునిచ్చారు.

నోట్లు

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణ పీఆర్సీ.. ఉద్యోగులకు 7.5 శాతం ఫిట్‌మెంట్

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి మూలవేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలు చేయాలని వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) సిఫారసు చేసిందని సాక్షి పత్రిక ఒక కథనంలో పేర్కొంది.

2018 జూలై 1 నుంచి వేతన సవరణ అమలు చేయాలని సూచించింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పొడిగించాలంటూ మరో కీలక సిఫారసు కూడా చేసింది. ఈ మేరకు చిత్తరంజన్‌ బిస్వాల్‌ నేతృత్వంలోని తెలంగాణ తొలి పీఆర్‌సీ గత డిసెంబర్‌ 31న సమర్పించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం బహిర్గతం చేసింది.

కనీస వేతనాన్ని నెలకు రూ.రూ.13,825 నుంచి రూ.19 వేలకు పెంచాలని, గరిష్ట వేతనాన్ని రూ.1,10,850 నుంచి రూ.1,62,070కు పెంచాలని పీఆర్సీ సిఫార్సు చేసింది.

కాగా, పీఆర్సీ కమిషన్ నివేదికపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. నివేదికకు వ్యతిరేకంగా బీఆర్కే భవన్ ఎదుట ఉద్యోగ సంఘాల ధర్నాకు దిగడమేకాక పీఆర్సీ ప్రతులను చించేశాయి. ఇక ధర్నా నేపథ్యంలో పోలీసులకు, ఉద్యోగ సంఘాలకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దాంతో పోలీసులు పలువురు ఉద్యోగ సంఘం నేతలను అరెస్ట్ చేశారు. ఇక ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో బీఆర్కే భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

చైనాలోని ఒక థియేటర్‌లో క్రిమి నివారణ రసాయనాలు చల్లుతున్న సిబ్బంది

ఫొటో సోర్స్, Getty Images

ఫిబ్రవరి 1 నుంచి సినిమా హాళ్లు ఫుల్‌..

కరోనాపై కేంద్రం బుధవారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసిందని, కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతినిచ్చిందని నమస్తే తెలంగాణ ఒక కథనంలో పేర్కొంది.

ఫిబ్రవరి 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. థియేటర్లలో ఇప్పటివరకు 50 శాతం సీటింగ్‌కే అనుమతి ఉన్నదని, ఇకపై సీటింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని కేంద్రం పేర్కొన్నది. తాజా మార్గదర్శకాల ప్రకారం స్విమ్మింగ్‌ పూల్స్‌ ఉపయోగించడంపై ఎలాంటి నిబంధనలు ఉండవు.

రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాలపై ఆంక్షలను పూర్తిగా తొలిగించారు. సామాజిక, మతపరమైన కార్యక్రమాల్లో, క్రీడలు, విద్యాసంస్థల్లో ఇప్పటివరకు ఉన్న నిబంధనల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త మార్గదర్శకాలను జారీచేయవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

పెట్రోల్ బంక్

ఫొటో సోర్స్, Getty Images

మళ్లీ పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు

దేశంలో ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. దిల్లీలో బుధవారం పెట్రోలు, డీజిల్‌పై మరో 25 పైసలు పెరిగింది.

హైదరాబాద్‌లో 26 పైసలు పెరగడంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.89.77గా ఉంది.

ముంబయిలో అత్యధికంగా 92.86కి చేరింది. కోల్‌కతాలో రూ.87.69, చెన్నైలో రూ.88.82కి చేరింది.

ఇక డీజిల్‌ ధర హైదరాబాద్‌లో రూ.83.46, ముంబయిలో రూ.83.30, కోల్‌కతాలో రూ.80.08, చెన్నైలో రూ.81.71కి చేరింది.

కొత్త ఏడాదిలో పెట్రోల్, డీజిల్‌ ధరలను చమురు కంపెనీలు క్రమం తప్పకుండా పెంచుతూ వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)