జమ్ము-కశ్మీర్: ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం రాజకీయ పార్టీల ‘గుప్‌కర్ మేనిఫెస్టో’

కశ్మీర్ రాజకీయ పార్టీల నేతలు

ఫొటో సోర్స్, TAUSEEF MUSTAFA

ఫొటో క్యాప్షన్, కశ్మీర్ రాజకీయ పార్టీల నేతలు
    • రచయిత, మాజిద్ జహంగీర్
    • హోదా, బీబీసీ కోసం, శ్రీనగర్ నుంచి

జమ్ము కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత బీజేపీ మినహా.. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలోని రాజకీయ పార్టీలన్నీ శనివారం ఒక్కతాటిపైకి వచ్చాయి.

ఆర్టికల్-370ని పునరుద్ధరించడం గురించి ఒక ప్రకటన జారీ చేసిన పార్టీలు దానికోసం కలిసి పోరాడుతామని చెప్పాయి.

‘గుప్‌కర్ మ్యానిఫెస్టో’పై సంతకం చేసిన వాటిలో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ), పీపుల్స్ డెమాక్రటిక్ పార్టీ (పీడీపీ), పీపుల్స్ కాన్ఫరెన్స్, సీపీఎం, కాంగ్రెస్, ఆవామీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఉన్నాయి.

“2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం తీసుకున్నఈ చర్యలు జమ్ము-కశ్మీర్, న్యూదిల్లీ మధ్య బంధాలను మార్చేశాయి’’ అని ‘గుప్‌కర్ మ్యానిఫెస్టో’పై సంతకాలు చేసిన నేతలు అన్నారు.

ఈ ప్రకటనలో 2019 ఆగస్టు 4న రూపొందించిన ‘గుప్‌కర్ మ్యానిఫెస్టో’ను అనుసరిస్తామని అన్ని పార్టీలూ చెప్పాయి.

ఫారూఖ్ అబ్దుల్లా

ఫొటో సోర్స్, HABIB NAQASH

ఫొటో క్యాప్షన్, ఫారూఖ్ అబ్దుల్లా

రాజ్యాంగం ప్రకారం లభించిన జమ్ము-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కాపాడుకోడానికి పోరాటం చేస్తామని ప్రాంతీయ పార్టీలు హామీ ఇచ్చాయి.

గత ఏడాది జమ్ము-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన కేంద్రం దానిని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆర్టికల్-370ని తొలగించిన తర్వాత వందలాది నేతలను అదుపులోకి తీసుకున్నారు. చాలామందిని పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (పీఎస్ఏ) లాంటి చట్టం కింద నిర్బంధంలోకి తీసుకున్నారు.

మగ్గురు మాజీ ముఖ్యమంత్రులు ఫారూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీని ఇదే పీఎస్ఏ చట్టం కింద నిర్బంధించారు. వీరిలో మహబూబా ముఫ్తీని నిర్బంధాన్ని మరో మూడు నెలలుకు పొడిగించారు.

ఆర్టికల్-370 రద్దు చేసిన తర్వాత, అన్ని రకాల సమాచార సాధనాలనూ నిలిపివేశారు. కఠిన ఆంక్షలతోపాటూ, కర్ఫ్యూ కూడా అమలు చేశారు. దీనిపై వ్యతిరేక ప్రదర్శనలు జరగకుండా భద్రతా బలగాలను భారీగా మోహరించారు.

మహబూబా ముఫ్తీ

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

ఫొటో క్యాప్షన్, మహబూబా ముఫ్తీ

ప్రకటనలో ఏమేం చెప్పారు

అన్ని పార్టీల సంయుక్త ప్రకటనలో ఆర్టికల్-370, 35Aలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని విభజించడం ఆమోదయోగ్యం కాదని కూడా చెప్పారు.

2019 ఆగస్టు 5ను దురదృష్టకరంగా వర్ణించిన నేతలు, అది రాజ్యాంగవిరుద్ధం అని, రాజ్యాంగాన్ని అంతం చేసే ప్రయత్నం జరిగిందని అన్నారు.

“మేం ఎవరు అనేదానిని మళ్లీ నిర్వచించే ప్రయత్నం చేశారు. ప్రజలు మాట్లాడకుండా, వారి గొంతు నొక్కేయడానికి, అణచివేత పద్ధతులతో ఈ మార్పులు చేశార”ని తెలిపారు.

గత ఏడాది కశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులందరూ ఈ ‘గుప్‌కర్ మ్యానిఫెస్టో’పై సంతకాలు చేశారు.

ఈ మ్యానిఫెస్టోలో జమ్ము-కశ్మీర్ గుర్తింపు, స్వయంప్రతిపత్తి, భద్రత, ప్రత్యేక హోదాను కొనసాగించడానికి ఎలాంటి చర్యలకైనా కలిసి పోరాడతామని అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా నిర్ణయించాయి.

ఈ సమావేశం శ్రీనగర్‌, గుప్‌కర్ రోడ్లో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత, ఎంపీ ఫారూఖ్ అబ్దుల్లా ఇంట్లో జరిగింది. అందుకే ఈ మ్యానిఫెస్టోకు గుప్‌కర్ మ్యానిఫెస్టో అనే పేరు పెట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)