మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మహీ, రైనా

ధోనీ,రైనా

ఫొటో సోర్స్, Instagram/sureshraina3

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.

ఈ మేరకు ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటనలో దాదాపు 16 ఏళ్ల పాటు భారత క్రికెట్‌లో సాగిన ఆయన శకం ముగిసింది. అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ధోనీ రికార్డులు సృష్టించారు.

ధోనీ

ఫొటో సోర్స్, Instagram

‘‘మీ అందరి ప్రేమకు నా ధన్యవాదాలు. ఈ సాయంత్రం 7.29గం.ల నుంచి నేను రిటైర్‌ అయినట్లుగా పరిగణించండి’’ అని ఆయన తన ఇన్‌స్టాగ్రాంలో పోస్టులో వెల్లడించారు.

"మే పల్‌ కా దో పల్ కా షాయర్‌ హు ''అనే హిందీ పాటతో కూడిన వీడియో ద్వారా తన కెరీర్‌లోని ఎత్తుపల్లాలను ఇన్‌స్టా‌గ్రాంలో వివరించారు ఆయన.

అలాగే తన కెరీర్‌లో మధుర స్మృతులను 4.07 ని.ల వీడియో ద్వారా పంచుకున్నారు.

రైనా

ఫొటో సోర్స్, Instagram

కాగా ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికే మరో క్రికెటర్ సురేశ్ రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించారు.

''ధోనీ నీతో ఆడడాన్ని ఇష్టపడ్డాం. నా హృదయం గర్వంతో ఉప్పొంగుతుండగా నీ ఈ ప్రయాణంలో నీతో కలవాలని నిర్ణయించుకున్నాను. జై హింద్'' అంటూ ధోనీతో కలిసి భోజనం చేస్తున్న ఫొటో ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్ట్ చేసి రిటైర్మెంట్ ప్రకటించారు సురేశ్ రైనా.

ధోనీ

ఫొటో సోర్స్, Getty Images

మూడు ప్రధాన ఐసీసీ ట్రోఫీలు ముద్దాడిన ఏకైక కెప్టెన్

మూడు ప్రధాన ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్‌గా మహేంద్ర సింగ్‌ ధోనీ చరిత్రలో నిలిచిపోయారు.

2007లో ఐసీసీ టీ-20 వరల్డ్‌ కప్‌, 2011లో ఐసీసీ వరల్డ్‌ కప్‌, 2013లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని కెప్టెన్‌ ధోనీ ఆధ్వర్యంలోని జట్లు గెలుచుకున్నాయి.

భారత్ తరఫున 350 వన్డేలు ఆడిన ధోనీ, 50 కంటే ఎక్కువ సగటుతో 10,773 పరుగులు చేశారు.

వన్డే క్రికెట్‌లో ధోని 10 సెంచరీలు, 73 అర్ధ సెంచరీలున్నాయి.. వికెట్ కీపర్‌గా 321 క్యాచ్‌లు తీసుకొని 123 మంది ఆటగాళ్లను స్టంప్ అవుట్‌ చేశారు.

టీ-20 క్రికెట్‌లో భారత్ తరఫున 98 మ్యాచ్‌లు ఆడిన ధోనీ, 37 పైగా సగటుతో 1617 పరుగులు చేశారు.

టెస్ట్‌ క్రికెట్‌లో 2014లోనే ధోనీ రిటైరయ్యారు. 90 టెస్టుల్లో 38కి పైగా సగటుతో 4876 పరుగులు చేసిన ధోనీ, టెస్టుల్లో 256 క్యాచ్‌లు, 38 స్టంప్‌లు చేశారు. బ్యాట్స్‌ మన్‌గా 6 సెంచరీలు, 33 అర్ధసెంచరీలు చేశారు.

వెల్లువెత్తుతున్న ట్వీట్లు

కాగా ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయన క్రికెట్‌కు, భారత జట్టుకు చేసిన సేవలను.. ఆయన రికార్డులను గుర్తు చేస్తూ ప్రస్తుత క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు, ఇతర ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు.

సచిన్ ధోనీ

ఫొటో సోర్స్, Twitter

‘‘భారత క్రికెట్‌కు నీ సేవలు చిరస్మరణీయం ధోనీ. నీతో కలిసి 2011 వరల్డ్‌ కప్‌ గెలవడం నా జీవితంలో అత్యంత అద్భుతమైన ఘట్టం’’ అని సచిన్‌ ట్వీట్ చేశారు.

ధోనీ రిటైర్మెంట్ తరువాత నెక్స్ట్ ఇన్నింగ్స్ కూడా అద్భుతంగా సాగాలని సచిన్ ఆకాంక్షించారు.

గంగూలీ

ఫొటో సోర్స్, Ani

‘‘ధోనీ రిటైర్‌మెంట్‌తో భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసింది. ఆతనొక అద్భుతమైన ఆటగాడు. అతని నాయకత్వ లక్షణాలు ఎవరితోనూ పోల్చలేనివి’’ అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నారు.

కోహ్లీ, ధోనీ

ఫొటో సోర్స్, Twitter

‘‘ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు కెరీర్‌ నుంచి రిటైర్‌కావాల్సిందే. కానీ మనకు సన్నిహితులైన వారు ఆట నుంచి వెళ్లిపోతుంటే ఆ బాధ ఎక్కువగా ఉంటుంది. ధోనీ క్రికెట్‌కు చేసిన సేవలు ప్రతి ఒక్కరి గుండెల్లోనూ నిలిచిపోతాయ’’ని విరాట్‌ కోహ్లీ ట్వీట్ చేశాడు.

గొప్ప వ్యక్తి క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడంటూ విఖ్యాత కామెంటరేటర్ హర్ష భోగ్లే ట్వీట్ చేశారు.

అద్భుతమైన కెరీర్ ఉన్న ధోనీకి అభినందనలు.. క్రికెట్ మైదానంలో అడుగు పెట్టిన గొప్ప కెప్టెన్లలో నీవొకడివి. నీ నెక్స్ట్ ఇన్నింగ్స్ కూడా విజయవంతంగా సాగాలని మాజీ కోచ్ కృష్ణమాచారి శ్రీకాంత్ ట్వీట్ చేశారు.

టీమిండియా ఆటగాళ్లు శిఖర్ ధావన్ తదితరులూ ధోనీకి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేశారు.

కాగా ధోనీకి గౌరవంగా ఒక ఫేర్‌‌వెల్ మ్యాచ్‌ నిర్వహించాలని బీసీసీఐని ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్ కోరారు. ఆ మ్యాచ్‌కు ఝార్ఖండ్ రాష్ట్రం స్పాన్సర్ చేస్తుందని ఆయన ముందుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)