ఆంధ్రప్రదేశ్: మద్యానికి బదులు హ్యాండ్ శానిటైజర్ తాగి 13 మంది మృతి

శానిటైజర్ తాగుతున్న దృశ్యం

ఫొటో సోర్స్, ugc

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి 13 మంది చనిపోయారు. జిల్లాలోని కురిచేడు మండల కేంద్రంలో 10 మంది, పామూరులో మరో ముగ్గురు మత్తు కోసం శానిటైజర్ తాగి మరణించారు.

మరణించిన వారిలో కొందరు స్థానికంగా భిక్షాటనతో బతుకుతున్నారు. వారు మద్యానికి అలవాటు పడడం, మద్యం దొరక్కపోవడంతో శానిటైజర్ తాగినట్లు గ్రామస్థులు తెలిపారు.

కురిచేడులో మరణించినవారిని అనుగొండ శ్రీను, భోగెం తిరుపతయ్య, గుంటక రామిరెడ్డి, కడియం రమణయ్య, రాజారెడ్డి, బాబు, ఛార్లెస్, అగష్టీన్, కొనగిరి రమణయ్యగా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.

శానిటైజర్

ఫొటో సోర్స్, Getty Images

కురిచేడు ప్రాంతంలో కరోనావైరస్ కేసులు ఎక్కువగా ఉండడంతో మద్యం దుకాణాలు మూసేశారు. లాక్ డౌన్ కొనసాగుతోంది.

దీంతో మద్యం అలవాటున్న కొందరు శానిటైజర్ తాగడం ప్రారంభించారు. శానిటైజర్‌ను నాటుసారాతో కలిపి తాగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇలా తాగినవారిలో ఒక వ్యక్తి రాత్రికి రాత్రి తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. తరువాత మరికొందరు అనారోగ్యం పాలయ్యారు.

వీరిని దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి చేరుకోక మునుపే కొందరు, చేరుకున్న తరువాత కొందరు మరణించారు.

''కొద్దికాలంగా, మద్యం షాపులు క్లోజ్ చేసినప్పటి నుంచి తాగుతున్నారు. బావి దగ్గర కుర్రాళ్లు కూడా తాగుతున్నారు. మొదట ఇద్దరు మొదలు పెట్టారు, తరువాత మిగతా వారు ప్రారంభించారు'' అంటూ మీడియాకు చెప్పారు స్థానికులు కొందరు.

పోలీసులు వారు తాగిన సీసాలను స్వాధీనం చేసుకున్నారు. తాగిన పదార్థంలో ఏం కలిసింది? అనే కోణంలో శాంపిళ్లను పరీక్షకు పంపారు. కొందరికి చికిత్స అందిస్తున్నారు.

చికిత్స పొందుతున్న వ్యక్తి

ఫొటో సోర్స్, ugc

శానిటైజర్ కడుపులోకి వెళితే చనిపోతారా?

శానిటైజర్ లో ఎక్కువ భాగం ఆల్కహాల్ ఉంటుంది. అందుకే మద్యం దొరకని వారు ఇది తాగారు.

''నిజానికి శానిటైజర్ అతి తక్కువ మోతాదులో అంటే 20-30 మిల్లీ లీటర్లు కడుపులోకి వెళ్లినా మరీ అంత ప్రమాదం జరగదు. కానీ, ఎక్కువ మోతాదులో తాగితే రకరకాల సమస్యలు వస్తాయి.

అన్న వాహిక, పొట్ట, జీర్ణ వ్యవస్థ, చిన్నపేగులకు గాయాలు అవుతాయి. ఇది కరోజివ్ ఏజెంట్. అంటే యాసిడ్ లాగా అన్నమాట. కొన్ని సందర్భాల్లో పొట్ట, పేగులు చితికిపోయే అవకాశం కూడా ఉంది.'' అని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ రామాంజనేయులు బీబీసీకి వివరించారు.

''దానికితోడు కల్తీ శానిటైజర్ తో ఇంకా ప్రమాదం. ఎందుకంటే కల్తీల్లో మిథనాల్ ఉంటుంది. అది తాగినా, పీల్చినా ప్రమాదమే. పీలిస్తే ఊపిరితిత్తులు, శ్వాస వ్యవస్థకు ప్రమాదం. పొట్టలోకి వెళ్లినప్పుడు అసిసోడిస్ ఫామ్ అవుతుంది.

లాక్టిక్ యాసిడ్ బయటకు వస్తుంది. రక్తంలో ఆమ్లాలు (యాసిడ్స్) పెరుగుతాయి. లాక్టిక్ యాసిడ్ వంటివి కిడ్నీల ద్వారా బయటకు వెళ్లవు. దీంతో శరీరంలో పొటాషియం పెరుగుతుంది. ఆయాసం వస్తుంది. ఒక్కసారిగా గుండె ఆగిపోవచ్చు.

మెటబాలిక్ చర్యలు తీవ్రమై కణాలు దెబ్బతింటాయి. అప్పటికప్పుడు మరణించే అవకాశం ఉంటుంది. మొత్తానికి చెప్పాలంటే చాలా తక్కువ మోతాదులో శానిటైజర్ పొట్టలోకి వెళ్తే ఏం కాదు కానీ, మద్యం తాగే పరిమాణంలో పొట్టలోకి వెళ్లినప్పుడు అత్యంత ప్రమాదకరం.'' అన్నారు డాక్టర్ రామాంజనేయులు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)