భారత్-చైనా ఉద్రిక్తతలు: చైనా చర్యలపై భారత్కు నిఘా సమాచారం అందలేదా?

ఫొటో సోర్స్, Yawar Nazir/Getty Images
- రచయిత, జుగల్ పురోహిత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్ నిఘా విభాగాల పనితీరుపై సమీక్ష నిర్వహించాల్సిన అవసరముందని సైనిక నిఘా విభాగం మాజీ అధిపతి, విశ్రాంత జనరల్ అమర్జీత్ బేదీ అభిప్రాయపడ్డారు. చైనా సంక్షోభం ముగిసిన వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు.
గల్వాన్ లోయలో చైనా చర్యలపై ముందుగానే భారత్ సైన్యానికి నిఘా విభాగం నుంచి హెచ్చరికలు అందుండాల్సిందని బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివరించారు.
"చైనా సైనికుల కదలికలపై మన సైనికులకు ముందుగానే సమాచారం అందుండాల్సింది. ఈ సంక్షోభం ముగిసిన వెంటనే.. దీనిపై సమగ్ర విచారణ జరగాలి. అసలు సైన్యానికి ఎందుకు నిఘా సమాచారం అందలేదో తెలుసుకోవాలి. మన వ్యవస్థను మెరుగు పరచుకోవడం భవిష్యత్తుకు చాలా అవసరం. ఈ విచారణ సైన్యంతోపాటు ఇతర నిఘా సంస్థల్లోనూ నిర్వహించాలి. కార్గిల్ యుద్ధం తర్వాత కూడా ఇలాంటి విచారణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు" అని ఆయన అన్నారు.
చైనా అనుసరించిన దూకుడు విధానాలు, భారతీయ సైనికులను దారుణంగా హతమార్చిన తీరును గమనిస్తే.. ఈ దాడి పక్కా ప్రణాళిక ప్రకారం జరిగినట్లు అనిపిస్తోందని బేదీ వివరించారు.
"నాకు తెలిసినంతవరకు చైనా దీని కోసం చాలా కాలం ముందే ప్రణాళికలు సిద్ధంచేసి ఉండొచ్చు. బహుశా మార్చి-ఏప్రిల్ల నుంచే దీని కోసం సిద్ధమవుతూ ఉండొచ్చు" అని ఆయన అభిప్రాయపడ్డారు.
గల్వాన్ లోయలో దాడిని పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన దాడిగా భారత విదేశాంగ శాఖ కూడా పేర్కొంది.
పక్కా ప్రణాళిక ప్రకారం చేసే దాడులపై సైన్యానికి సమాచారం అందించే సామర్థ్యం భారత్ నిఘా సంస్థలకు లేదా?
ఈ ప్రశ్నకు సమాధానంగా.. "ఇది నిఘా సంస్థలు లేదా పర్యవేక్షణ సంస్థల వైఫల్యంగా చూడలేం. మనం ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం.. అయితే ఇదివరకు కుదిరిన ఒప్పందాల ప్రకారం చైనా నడుచుకుంటుందని భావించాం. కానీ అలా జరగలేదు" అని బేదీ చెప్పారు.
మార్చి వరకు భారత్ సైనిక నిఘా విభాగం అధిపతిగా బేదీ పనిచేశారు. ఆ సమయంలో చైనా ప్రణాళికల గురించి ఏమైనా సమాచారం ఉందా?
ఈ ప్రశ్నకు స్పందిస్తూ.. "మౌలిక పెట్టుబడులు, సైనిక విన్యాసాలు ఇతర అసాధారణ చర్యలకు సంబంధించి చైనాలో జరుగుతున్న అన్ని చర్యలపై సమాచారం ఉంది. అయితే మార్చి నాటికి చైనా సైనికులు యుద్ధ విన్యాసాలు చేస్తున్నట్లు కొన్ని సంకేతాలు వచ్చాయి. ఆ విషయాన్ని మేం ఇతర విభాగాలకు తెలియజేశాం"అని బేదీ వివరించారు.

ఫొటో సోర్స్, TPG
చైనా నిఘా సంస్థలు, పర్యవేక్షణ విభాగాల సామర్థ్యం గురించి జనరల్ బేదీ ఏమనుకుంటున్నారు?
ఈ ప్రశ్నకు స్పందిస్తూ.. "నిస్సందేహంగా చైనా తమ వనరులను భారీగా పెంచుకుందని చెప్పొచ్చు. కొంతకాలంగా చైనా తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంటూ వస్తోంది. భారత్తో పోలిస్తే.. చైనా దగ్గర నాలుగు రెట్లు ఎక్కువగా ఉపగ్రహాలున్నాయి. భారత్ కంటే చైనా ముందుందని దీన్నిబట్టి స్పష్టమవుతోంది. అయితే మనం కూడా అంత తీసికట్టుగా ఏమీలేము. భారత్ కూడా కొంతకాలంగా తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ వస్తోంది" అని బేదీ వివరించారు.
చైనా-భారత్ల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు చెలరేగిన ప్రస్తుత తరుణంలో సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాల సమాచారాన్ని మన ఉపగ్రహాలు స్పష్టంగా అందించగలవా?
"గత ఎనిమిది-తొమ్మిది సంవత్సరాల్లో మన భూభౌగోళిక వనరులు చాలావరకు మెరుగుపడ్డాయి. అయితే మనం అనుకున్న స్థాయికి ఇంకా చేరుకోలేదు. కాలాలు, వాతావరణాలతో సంబంధం లేకుండా అన్ని సమయాల్లోనూ క్షేత్ర స్థాయి సమాచారం అందించేలా మన ఉపగ్రహాలు ఉండాలి" అని బేదీ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్ సేవింగ్' మెడిసిన్కు, భారత్కు ఉన్న బంధం ఏంటి?
- పెంగ్విన్ సినిమా రివ్యూ: కీర్తి సురేశ్ అద్భుత నటనతో సాగిన క్రైమ్ థ్రిల్లర్
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం: జీన్స్, మొబైల్.. ఇంకా వేటి ధరలు పెరగొచ్చు?
- చైనాలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 'బెగ్గింగ్'
- కరోనావైరస్ వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతున్న చైనా కంపెనీలు
- కరోనావైరస్ కోరల్లో చైనా ఆర్థిక వ్యవస్థ.. దశాబ్దాల కాలంలో తొలిసారి కుదేలు
- 996 విధానం అంటే ఏంటి? ‘ఆలీబాబా’ జాక్ మా దీన్ని ఎందుకు సమర్థిస్తున్నారు?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- భారీగా పతనమవుతున్న చైనా కరెన్సీ యువాన్.. కారణాలివే
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును చొప్పిస్తున్న చైనా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









