అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం: జీన్స్, మొబైల్.. ఇంకా వేటి ధరలు పెరగొచ్చు?

అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం ప్రభావంతో ఫోన్, గొడుగు, సెక్స్ టాయ్స్ సహా అనేక వస్తువుల ధరలు సమీప భవిష్యత్తులో పెరిగిపోయే ఆస్కారముంది. చైనా తయారీ ఉత్పత్తులపై అమెరికా అధిక పన్నులు వేస్తుండటం వల్ల ఈ ఉత్పత్తుల ధరలు పెరగొచ్చు.
కొన్ని ఎగుమతులు లేదా దిగుమతులపై పన్నులు విధించడం ద్వారా ఒక దేశంపై మరో దేశం పైచేయి సాధించడానికి చేసే పోరాటమే వాణిజ్య యుద్ధం. ఆర్థికంగా శక్తిమంతమైన రెండు దేశాలు ఇలా తలపడితే దాని ప్రభావం ఇతర దేశాలపైనా పడుతుంది.
దేశాల మధ్య వాణిజ్య యుద్ధాల వల్ల వస్తువుల ధరలు పెరుగుతాయని, అంతిమంగా వినియోగదారులే నష్టపోతారని ఎక్కువ మంది ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
వాణిజ్య యుద్ధానికి కారణమేంటి?
ఎక్కువ ఉత్పత్తులు అమెరికాలోనే తయారవ్వాలని, దేశంలో పారిశ్రామికాభివృద్ధి జరగాలని, ఉపాధి అవకాశాలు ఏర్పడాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు. అమెరికా-చైనా మధ్య వాణిజ్య లోటును తగ్గించాల్సి ఉందని అంటున్నారు.
చైనాకు అమెరికా చేసే ఎగుమతుల కంటే కంటే చైనా నుంచి అమెరికా చేసుకొనే దిగుమతులే ఎక్కువ.
ఉక్కు , అల్యూమినియం లాంటి పరిశ్రమల నుంచి వచ్చే ఉత్పత్తులపై అమెరికా పన్నులు వేస్తోంది. మరిన్ని ఉత్పత్తులపైనా వీటిని విధించే అవకాశం ఉంది.
అమెరికా చర్యలకు ప్రతిగా చైనా చర్యలు చేపడుతోంది. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై పన్నులు వేస్తోంది.

ఎవరికి ప్రయోజనం?
ఈ వాణిజ్య యుద్ధంతో అమెరికా, చైనాలకు సరఫరాల్లో లోటు ఏర్పడుతుంది. తక్కువ ధరలకు అమెరికా, చైనాలకు వస్తువులను సరఫరా చేయగల దేశాలకు ఈ వాణిజ్య యుద్ధం వల్ల పరోక్షంగా ప్రయోజనం ఉండొచ్చు. ఉదాహరణకు బంగ్లాదేశ్లో కాటన్ పరిశ్రమ, మెక్సికోలో ఆటబొమ్మల పరిశ్రమ, వియత్నాంలో దుస్తులు కుట్టే పరిశ్రమ లబ్ధి పొందొచ్చు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









