విశాఖపట్నం వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి.. సచివాలయ సిబ్బందికి ఉద్యోగ సంఘ నేతల సూచన

విశాఖపట్నం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్‌కు కార్యనిర్వాహక రాజధాని(ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌)గా ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించిన విశాఖపట్నానికి తరలేందుకు సచివాలయ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు.

బుధవారం(18.03.2020) జరిగిన సచివాలయ ఉద్యోగుల సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటి సమావేశంలో ఈ విషయంపై చర్చించారు.

మే నెలాఖరు నాటికి విశాఖ వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని ఉద్యోగ సంఘ నాయకులు సచివాలయ సిబ్బందికి సూచించారు.

అమరావతి నుంచి కార్యనిర్వాహక రాజధానిని విశాఖ తరలించాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దికాలం కిందట నిర్ణయించింది.

ప్రభుత్వ నిర్ణయంతో సచివాలయం విశాఖపట్నానికి తరలనుండడంతో ఉద్యోగులూ అక్కడికి వెళ్లాల్సి వస్తోంది.

సమావేశంలో నిర్ణయాలు

విశాఖ వెళ్తున్న నేపథ్యంలో తమ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పారు. దీనికి సంబంధించి ఏమైనా సమస్యలుంటే సంఘం దృష్టికి తేవాలని సూచించారు.

ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు

* ఇళ్ల స్థలాలు

* 2015-19 మధ్య ఇళ్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేసినవారికి వడ్డీలేని రుణాలు.

* విశాఖలో పాఠశాలలో అడ్మిషన్లు

* భార్య లేదా భర్త ఉద్యోగస్తులైతే (కేంద్రం, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ సంస్థలు లేదా శాఖలు) వారి బదిలీలు, అంతర్రాష్ట్ర బదిలీలు, స్థానిక హోదా

* షిఫ్టింగు అలవెన్స్

* బ్యాచిలర్లు, కుటుంబాలకు వసతి

* అమరావతిలో ఇళ్లు లేదా స్థలాలు కొనని వారికి ప్రత్యేక లోన్లు

* ౩౦ శాతం ఇంటి అద్దె భత్యం

* రవాణా సౌకర్యం, ఇతర అంశాలు.

సీఎం జగన్

ఫొటో సోర్స్, FACEBOOL/ANDHRAPRADESH/CMO

సానుకూలంగా ప్రభుత్వం

ఉద్యోగులకు ఉండే సాధారణ సమస్యలు అంటే.. అక్కడ వసతి కల్పించడం, స్కూల్ అడ్మిషన్లు, ఇంటి స్థలాలు, భాగస్వామి బదిలీలు వంటి వాటిపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది.

''మాకున్న సౌకర్యాలు ఐదు రోజుల పని, ౩౦ శాతం అద్దె అలవెన్సు విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగానే ఉంది. ఇక అమరావతి పరిసరాల్లో పనిచేస్తున్న స్పౌజ్ ట్రాన్సఫర్లు, తెలంగాణలో ఉండిపోయిన వారి బదిలీల విషయంలో ప్రభుత్వం డేటా అడిగింది. అది మ్యూచువల్ గా చేయవచ్చేమో ఆలోచిస్తోంది. స్కూల్ అడ్మిషన్లు ఎంత మందికి కావాలి? అమరావతిలో ఇప్పటికే ఇళ్లు కట్టుకున్న వారు ఎంత మంది? బ్యాచిలర్ ఎకామిడేషన్ ఎందరికి అవసరం వంటివి కూడా డాటా ఇవ్వమన్నారు.'' అని సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షులు వెంకట్రామి రెడ్డి బీబీసీతో చెప్పారు.

జూన్ మొదటి వారంలో వెళ్లాల్సి ఉంటుందని తాము అనుకుంటున్నామని, అదే విషయం ఉన్నతాధికారులు చెప్పామన్నారాయన. కోర్టు కేసులు వంటి అంశాలు ఈ తరలింపును ప్రభావితం చేస్తాయని ఇప్పటివరకు రాజధాని తరలింపు విషయంలో అందరి కంటే ఎక్కువ ప్రభావితం అయ్యే వారిలో సచివాలయ ఉద్యోగులు కూడా ఉన్నారని అన్నారు.

కాగా సచివాలయ ఉద్యోగులు తొలి నుంచీ ప్రభుత్వం ఎక్కడ రాజధాని అంటే అక్కడ పనిచేయడానికి తాము సిద్ధం అని చెబుతూ వస్తున్నారు. కొందరికి భిన్నాభిప్రాయం ఉన్నా, సచివాలయ ఉద్యోగ సంఘం నుంచికానీ, విడిగా కానీ ఎవరూ బాహాటంగా నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు. అయితే ఇప్పటికే అమరావతిలో ఇళ్లు లేదా స్థలం కొనుక్కున్న వారు మాత్రం తమకు కలిగే నష్టం భర్తీ చేసేలా సౌకర్యాలు కల్పించాలని కోరుతూ వచ్చారు. అటు ప్రభుత్వం కూడా సచివాలయ ఉద్యోగులు ఏది అడిగితే అది ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉన్నట్టు కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)