జగన్ : ‘కరోనావైరస్ సాకుతో ఎన్నికలు వాయిదా వేయడమేంటి’

జగన్

ఫొటో సోర్స్, facebook/andhrapradesh cmo

కరోనావైరస్ భయానకమైనదేమీ కాదని.. వయోధికులు, అనారోగ్యంతో ఉన్నవారికి మాత్రమే కరోనావైరస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది కానీ మిగతా ప్రజలకు అంత ప్రమాదమేమీ లేదని ఏపీ సీఎం జగన్ అన్నారు.

కరోనావైరస్‌ను సాకుగా చూపించి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేశారని, ఒకవైపు ఎన్నికలు వాయిదా వేసి మరోవైపు అధికారులను బదిలీ చేశారని జగన్ అన్నారు. ఇదేం విచక్షణాధికారమని ఆయన ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

‘‘రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను చంద్రబాబు నియమించారు. ఆయన చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారు. ఆయన వ్యాఖ్యలు బాధ కలిగించాయి.

కరోనావైరస్ వల్ల ఎన్నికలు వాయిదా వేస్తున్నామని రమేశ్ కుమార్ చెప్పారు. ఆ సాకు చూపుతూనే, గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లను, మాచర్ల సీఐ సహా కొందరు అధికారులను తప్పిస్తూ ప్రకటన చేశారు.

చాలా ఆశ్యర్యం కలుగుతోంది. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు, ఏమైనా చర్యలు తీసుకోవచ్చు. కానీ, ఎన్నికలు నిరవధికంగా వాయిదా వేసి ఈ చర్యలన్నీ ఎలా తీసుకుంటారు? ఎన్నికలైనా జరపండి. ఈ సమయంలో ఏవైనా చర్యలు తీసుకోండి. మేమేమీ మాట్లాడం. విచక్షణ అధికారాలు అంటూ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రభుత్వాలు ఉండి ఎందుకు?’’ అని జగన్ ప్రశ్నించారు.

‘ఎవరో ఇచ్చిన ఆదేశాలను ఎన్నికల కమిషనర్ చదువుతున్నారు’

‘‘ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేదాకా ఇళ్ల పట్టాల పంపిణీని నిలిపివేయాలని కలెక్టర్లకు రమేశ్‌కుమార్ నిన్న (శనివారం) ఆదేశాలు ఇచ్చారు.

ఎంపీటీసీ స్థానాల్లో 2 వేల మంది వైసీపీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారన్న వార్త జీర్ణించుకోలేక, చంద్రబాబు నాయుడు పతనమవుతున్నారని ప్రజలు ఎక్కడ అనుకుంటారో అని భావించి ఈ రోజు పొద్దున్నే తాజా ఆదేశాలు ఇచ్చారు.

ఈ ఎన్నికల కమిష‌న్‌లో ఎవరికీ ఈ ఆదేశాల గురించి తెలియదు. ఎవరో ఇచ్చిన ఆదేశాలను రమేశ్ కుమార్ చదువుతున్నార’’ని ముఖ్యమంత్రి ఆరోపించారు.

రమేశ్ కుమార్‌కు పదవి ఇచ్చింది చంద్రబాబే కావొచ్చు. వాళ్లిద్దరిదీ ఒకే సామాజిక వర్గం అయ్యుండొచ్చు. కానీ, ఇలా వ్యవహరించడం భావ్యమేనా? అని ప్రశ్నించారు.

జగన్

ఫొటో సోర్స్, facebook/ysjagamohanreddy

‘అవన్నీ చెదురుమదురు ఘటనలు’

‘రాష్ట్రంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కలిపి 10,243 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటికి 54,594 మంది నామినేషన్లు వేశారు. 43 చోట్ల మాత్రమే చెదురుమదురు ఘటనలు జరిగాయి.

2,794 వార్డులు, డివిజన్లు ఎన్నికలు జరుగుతున్నాయి. 15,185 నామినేషన్లు వేశారు. ఇందులో 14 చోట్ల మాత్రమే చెదురమదురు ఘటనలు జరిగాయి.

ఇదివరకు ఏ ఎన్నికల్లోనైనా ఇంత కన్నా తక్కువ చెదురుమదురు ఘటనలు జరిగాయా?

పోలీసులు ఎక్కడా ఉపేక్షించకుండా చర్యలు తీసుకున్నారు. మీడియా విష ప్రచారం చేస్తోంద’’ని ముఖ్యమంత్రి విమర్శించారు.

‘కరోనావైరస్ ప్రభావం ఇంకా పెరిగితే ఏం చేస్తారు’

‘‘ఏకగ్రీవాలు కొత్తేం కాదు. ఇదివరకు ఎన్నికల్లో జరగలేదా? ప్రజలు మెచ్చేలా పాలన అందిస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుంటే చంద్రబాబు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు. వ్యవస్థల్లో తనకున్న తొత్తుల ద్వారా ఎందుకు దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు?

ఈ ఎన్నికలు జరిగితే, కేంద్రం నుంచి రూ.5వేల కోట్లు రాష్ట్రానికి వస్తాయి. జరగకపోతే రావు. దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు?

ఎన్నికలు వాయిదా వేస్తే, పరిస్థితి మెరుగవుతుందా? అప్పుడు కరోనావైరస్ ప్రభావం ఇంకా తీవ్రం అవుతుంది. ఎన్నికలు వాయిదా వేసి, ఏం సాధిస్తారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని అడ్డుకుంటున్నార’’ని ఆగ్రహించారు.

చూస్తూ ఊరుకోం..

రమేశ్‌కుమార్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు, ఎన్నికల కమిషనర్‌తో మాట్లాడమని గవర్నరును కోరినట్లు జగన్ చెప్పారు.

‘‘రమేశ్ కుమార్‌ మారకపోతే, ఈ విషయాన్ని పైస్థాయికి తీసుకెళ్లి ఆయన బండారాన్ని బయటపెడతా’’మన్నారు.

Sorry, your browser cannot display this map