హైదరాబాద్ ఎన్‌కౌంటర్: నిందితులను చంపేస్తే దేశమంతటా ప్రజలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు?

హైదరాబాద్ ఎన్‌కౌంటర్
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హైదరాబాద్‌లో గతవారం అత్యాచారం, హత్యకు గురైన దిశ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని ఎన్‌కౌంటర్ చేయడంతో భారత్‌లో చాలా మంది సంబరాలు చేసుకుంటున్నారు.

ఎన్‌కౌంటర్ జరిగిన కొద్దిగంటల్లోనే ఘటన జరిగిన ప్రదేశానికి దాదాపు రెండు వేల మంది వచ్చారు. పోలీస్ చర్యను అభినందిస్తూ, వారిపై పూల వర్షం కురిపించారు.

పోలీస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. స్వీట్లు పంచుకున్నారు. దిశ హత్యకు గురైన ప్రాంతం వద్ద పూలతో నివాళి అర్పించారు.

దిశ ఇంటి పక్కల వారు గుమిగూడి సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. టపాసులు పేల్చారు.

ఇక సామాజిక మాధ్యమాల్లోనూ ఇదే తీరు కనిపించింది. పోలీస్‌లకు మద్దతుగా పోస్టులు కనిపించాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ట్విటర్‌లో అనేక రకాల హ్యాష్‌ట్యాగ్‌లతో ఈ ఎన్‌కౌంటర్‌పై దాదాపు 3 లక్షల ట్వీట్లు వచ్చాయి. చాలా ట్వీట్లు పోలీసుల చర్యకు మద్దతు తెలుపుతూ వచ్చినవే.

అయితే, ఇలాంటి ఎన్‌కౌంటర్లకు ప్రజల నుంచి మద్దతు రావడానికి కారణాలున్నాయి.

భారతీయ న్యాయ వ్యవస్థలో న్యాయం అందడానికి చాలా ఏళ్లు, దశాబ్దాలు పడుతుంది.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత బాధితుల ఇంటిపక్కల వాళ్లు స్వీట్లు పంచుకున్నారు.
ఫొటో క్యాప్షన్, దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత బాధితురాలి ఇంటిపక్కల వాళ్లు స్వీట్లు పంచుకున్నారు.

దేశంలోని వివిధ కోర్టుల్లో లక్షలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో అత్యాచారానికి సంబంధించిన కేసులే 150,000 ఉన్నాయి. అందుకే న్యాయ వ్యవస్థ మీద ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది.

దీనినికి సంబంధిచి 2012 డిసెంబర్‌లో దిల్లీలోని ఒక బస్సులో మహిళ (నిర్భయ)పై జరిగిన సామూహిక అత్యాచారం ఒక ఉదాహరణ.

ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో పతాక శీర్షికగా మారింది. దిల్లీతో పాటు వివిధ ప్రాంతాల్లో రోజుల తరబడి ప్రదర్శనలు జరిగాయి. నిందితులకు కఠిన శిక్షలు విధించేలా కొత్త చట్టాన్ని తీసుకరావాలని డిమాండ్లు వినిపించాయి.

ఈ ఘటన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేసే విషయంలో న్యాయ వ్యవస్థ పనితీరు ఆశించినంత వేగంగా లేదు.

దోషులకు మరణశిక్ష పడినప్పటికీ, శిక్షను ఆలస్యం చేయడానికి చట్టంలోని ప్రతి లొసుగులను వారు ఉపయోగించారని ఏడేళ్ల తర్వాత నిర్భయతల్లి ఆశా దేవి ఆరోపించారు.

ఎన్‌కౌంటర్ తర్వాత సైబరాబాద్ పోలీసులను ప్రశంసించిన మొదటి వ్యక్తులలో ఆమె కూడా ఒకరు కావడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.

దారుణ నేరాలకు బాధితులుగా మారి, వ్యవస్థల నుంచి న్యాయం అందక నిరాశకు గురైన అనేక మంది భారతీయులకు ప్రతిరూపంగా నిర్భయ తల్లి ఆశా దేవి కనిపిస్తున్నారు.

దిశ హత్యకు గురైన ప్రాంతం వద్ద పూలతో నివాళి అర్పించారు.
ఫొటో క్యాప్షన్, దిశ హత్యకు గురైన ప్రాంతం వద్ద పూలతో నివాళి అర్పించారు.

హైదరాబాద్ అత్యాచార ఘటన తర్వాత చాలా మంది న్యాయవ్యవస్థ పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము చెల్లిస్తున్న పన్నులతో అత్యాచార నిందితులను ఏళ్ల తరబడి మేపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వ్యవస్థపై విశ్వాసం క్షీణిస్తుండంతో చాలా మంది తక్షణ న్యాయం కోసం డిమాండ్ చేయడం, అలా చేసిన వారికి మద్దతు ఇవ్వడం జరుగుతోంది.

శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌కు చాలా మంది మద్దతు ఇవ్వడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు.

టపాసులు కాల్చుతున్న స్థానికులు

ఈ ఘటన తర్వాత హైదరాబాద్ పోలీసులను 2010లో వచ్చిన తమిళ సినిమా సింగంతో పోల్చుతూ #Singham హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది.

అయితే, కొంతమంది శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌ను ప్రశ్నిస్తున్నారు. విచారణ చేయకుండా అనుమానితులనే కాల్చిచంపారని అంటున్నారు.

''చట్టాన్ని పూర్తిగా విస్మరించిన పోలీసుల నుంచి మేము కోరుకునే సమాధానం ఇది కాదు" అని హైదరాబాద్ లోని కౌన్సిల్ ఫర్ సోషల్ డెవల్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్ కల్పనా కన్నబిరన్ బీబీసీతో అన్నారు.

''అవాంఛిత హత్యలు, ప్రతీకార రక్తపాతం ద్వారా న్యాయం జరగదు. బాధిత కుటుంబాల శోకం, దుఃఖము ఆధారంగా న్యాయం నిర్ణయించకూడదు'' అని పేర్కొన్నారు.

దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్

మాజీ పోలీస్ అధికారి ప్రకాశ్ సింగ్ బీబీసీతో మాట్లాడుతూ, ''ఇలాంటి ఎన్‌కౌంటర్‌లను పూర్తిగా నివారించాలి. కొందరు న్యాయ నిపుణులు దీన్ని రాజ్యాంగ విరుద్ధం అని అభివర్ణిస్తారు. దీని వల్ల నిజంగా న్యాయం జరుగుతుందా అని ప్రశ్నిస్తారు'' అని తెలిపారు.

పోలీసులు నిజంగా సరైన వ్యక్తులనే అరెస్టు చేశారా లేక ప్రజాగ్రహాన్ని శాంతింపచేయడానికి కొంతమంది పేద డ్రైవర్లను బలిపశువులను చేశారా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఓ వ్యక్తి స్థానిక టీవీ చానెల్‌లో మాట్లాడుతూ, ''తమ ఆయుధాలను లాక్కోవడానికి ప్రయత్నించడంతో వారిని కాల్చి చంపాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవు. నిజంగా ఆ నలుగురేనా?'' అని ప్రశ్నించారు. అయితే, ఎన్‌కౌంటర్ తర్వాత ఇటువంటి స్వరాలు చాలా తక్కువే వినిపించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)