సినిమా ఇండస్ట్రీ: 'ఎవరి నట్లు, బోల్టులు ఎలా బిగించాలో నాకు బాగా తెలుసు', డిప్యూటీ సీఎం డీకే శివకుమార్

ఫొటో సోర్స్, x.com/iamRashmika/Getty
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రముఖ నటి రష్మిక మందన్నపై కర్ణాటకలో పెద్ద వివాదం చెలరేగింది. రష్మిక పై అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవికుమార్ గౌడ గనిగ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
కన్నడిగులను రష్మిక అవమానించారని, ఆమెకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని రవికుమార్ గౌడ గనిగ అన్నారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది.
ఈ వివాదంపై నటి రష్మిక ఇంకా స్పందించాల్సి ఉంది.
మరోవైపు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


ఫొటో సోర్స్, https://x.com/DKShivakumar
డీకే శివకుమార్ ఏమన్నారు?
మార్చి 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 16వ బెంగళూరు ఇంటర్నేరేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతోంది.
దీని ప్రారంభ వేడుకలకు కన్నడ మూలాలున్న నటీనటులు హాజరు కాకపోవడం ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది.
ఈ విషయంపై కార్యక్రమ ప్రారంభ వేదికపైనే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
''ఈ రోజు ఈవెంట్కు సినీ ప్రముఖులలో కేవలం పదిమంది మాత్రమే వచ్చారు. ఇదేమీ సిద్ధరామయ్య (ముఖ్యమంత్రి) లేదా డీకే శివకుమార్ ప్రైవేటు కార్యక్రమం కాదు. లేదా సాధు కోకిల, కిషోర్ కుటుంబ కార్యక్రమం కూడా కాదు.'' అని అసంతృప్తి వ్యక్తం చేశారు.
''ఫిలిం చాంబర్, అకాడమీకి దీన్ని హెచ్చరిక అనుకుంటారో, విజ్జప్తి అనుకుంటారో మీ ఇష్టం. ఇది నా కార్యక్రమం కాదు. మీది. ప్రభుత్వ అనుమతులు, మద్దతు లేకుండా సినిమా నిర్మాణం పూర్తికాదని గుర్తుంచుకోండి. ఎవరికి నట్లు, బోల్టులు ఎలా బిగించాలో నాకు బాగా తెలుసు'' అని అన్నారు డీకే శివకుమార్.

ఫొటో సోర్స్, https://biffes.org/
‘‘రష్మికను ఆహ్వానించేందుకు ఆమె ఇంటికి మా ఎమ్మెల్యే 10-12 సార్లు వెళ్లారు..’’
కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గౌడ గనిగ ఏఎన్ఐతో మాట్లాడుతూ రష్మిక మందన్నపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
''రష్మిక మందన్న ‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ మూవీతో కెరీర్ను ప్రారంభించి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కు రావడానికి సుముఖత చూపలేదు. ఆమెను నిరుడు ఆహ్వానించడానికి మా ఎమ్మెల్యే ఒకరు 10-12 సార్లు ఆమె ఇంటికి వెళ్లారు. కన్నడ ఇండ్రస్ట్రీలో పుట్టి పెరిగిన ఆమె, కన్నడను అవమానిస్తూ ఫిలిం ఫెస్టివల్కు రావడానికి నిరాకరించారు. పైగా నా ఇల్లు హైదరాబాద్లో ఉంది. నాకు కర్ణాటక ఎక్కడుందో తెలియదు. నాకు టైం లేదని అన్నారట.'' అని రవికుమార్ అన్నారు.
‘‘ఆమెకు తగిన గుణపాఠం నేర్పించాల్సిన అవసరం ఉంది కదా’’ అని ఆయనన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
బీజేపీ ఏమంటోంది?
కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు.
''నటికి గుణపాఠం చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేయడం.. ఆ పార్టీ గూండా సంస్కృతికి నిదర్శనం'' అంటూ ఎక్స్ లో స్పందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, https://x.com/iamRashmika
రష్మిక తనది హైదరాబాద్ అన్నారా..
‘చావా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 14న ముంబయిలో జరిగిన సందర్భంగా రష్మిక మందన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు.
''నాది హైదరాబాద్. హైదరాబాద్ నుంచి ఇక్కడికి(ముంబయి) ఒంటరిగా వచ్చాను. ఈ రోజు నేను మీ కుటుంబంలో ఒక భాగమయ్యానని అనుకుంటున్నాను.'' అని అన్నారు.
ఈ విషయంపై అప్పట్లో కన్నడిగుల నుంచి పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి.
కర్ణాటకకు చెందిన రష్మిక, హైదరాబాద్ వ్యక్తిగా ఎలా చెప్పుకొంటారని సోషల్ మీడియాలో ప్రశ్నించారు కొందరు యూజర్లు.
రష్మిక మందన్నది కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్ పేట. ఆమె కూర్గ్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నారు.
2016లో ‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ చిత్రం ద్వారా సినిమాల్లోకి వచ్చారు. 2018లో ‘చలో’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు.
తర్వాత ‘గీతగోవిందం‘, ‘డియర్ కామ్రేడ్‘, ‘సరిలేరు నీకెవ్వరు‘, ‘పుష్ప ది రైజ్‘, ‘పుష్ప ది రూల్‘, ‘సీతారామం’, ‘యానిమల్’ సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు సాధించారు.
తాజాగా విడుదలైన ‘చావా‘ సినిమా తో హిందీలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆమె నటించిన ‘సికిందర్‘(హిందీ), ‘కుబేరా’(తెలుగు) సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి.
ఈ వివాదంపై రష్మిక మందన్న పీఆర్ టీమ్ను బీబీసీ సంప్రదించింది. ఆమె స్పందన రాగానే ఇక్కడ అందిస్తాం.

ఫొటో సోర్స్, https://x.com/iamRashmika

ఫొటో సోర్స్, Facebook/Bunny Vasu
గతంలోనూ రష్మికపై వివాదం
గతంలోనూ కన్నడ సినిమాకు సంబంధించి రష్మిక మందన్న వివాదంలో చిక్కుకున్నారు.
మూడేళ్ల కిందట రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార’ మూవీ విడుదలైన తర్వాత ఈ వివాదం చెలరేగినట్లు హిందుస్థాన్ టైమ్స్ కథనం పేర్కొంది.
‘కాంతారా సినిమాను తాను చూడలేదని రష్మిక అనడం వివాదానికి దారితీసింది. తర్వాత తనను సినీరంగానికి పరిచయం చేసిన నిర్మాణ సంస్థ పేరును ఓ ఇంటర్వ్యూలో రష్మిక ప్రస్తావించకపోవడంతో వివాదం పెద్దదయింది’’ అని ఆ కథనం వెల్లడించింది.
రష్మికను కన్నడ సినిమా నుంచి బ్యాన్ చెయ్యాలని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగినట్లు హిందుస్థాన్ టైమ్స్ కథనం పేర్కొంది. తర్వాత రష్మిక, తాను కాంతార సినిమా చూశానని, మూవీ బాగుందని చిత్రయూనిట్కు మెసేజ్ పెట్టినట్లు వెల్లడించడంతో వివాదం సద్దుమణిగినట్లు హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














