ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల పోలింగ్: నిబంధనల ఉల్లంఘన, అధికారుల నిర్లక్ష్యంపై ఈసీ హెచ్చరికలు..

ఫొటో సోర్స్, I &PR Ranagareddy
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతుండగా, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి (కంటోన్మెంట్) ఉపఎన్నిక జరుగనుంది.
సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అవకతవకలు జరుగకుండా ఎన్నికల అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. వీటికి సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు.
పోలింగ్ ముంగిట నిర్లక్ష్యంగా వ్యహరించిన పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలంగాణలో కేసీఆర్ కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయకుండా జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి.

ఫొటో సోర్స్, UGC
సిరా గురించి సీరియస్
ఓటర్ల చేతి వేలికి వేసిన సిరా గుర్తు చెరిపేసి, మరోసారి ఓటు వినియోగించుకోవాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు.
ఎన్నికల అధికారులు ఉపయోగించే చెరగని సిరా ఇతరులకు కూడా అందుబాటులో ఉందని సాగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అది పూర్తిగా తప్పుడు ప్రచారం అని, ఇతర సిరాను ఉపయోగించి ఓటర్లకు మార్కు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Laxman
చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని స్పష్టం చేశారు. ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని, ఇతరులెవరూ దీన్ని పొందలేరని ఆయన స్పష్టం చేశారు.
ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఫొటో సోర్స్, I &PR Ranagareddy
పోలీస్ అధికారులపై చర్యలు
పోలింగ్ ముంగిట ఎన్నికల విధుల నిర్వహణలో అలసత్వం చూపారంటూ పలువురు పోలీస్ అధికారుల మీద ఈసీ కన్నెర్ర చేసింది.
నంద్యాల జిల్లా కేంద్రంలో అల్లు అర్జున్ పర్యటన సందర్భంగా నిబంధనలు పాటించలేదంటూ జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డిపై సీరియస్ అయ్యింది. ఆయనపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఎన్నికల కోడ్ అమలు చేయడంలో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్ ఫైల్ చేయాలని ఈసీ ఆదేశించింది. ఎస్పీతో పాటు ఎస్డీపీవో రవీంద్రనాథ్, సీఐ రాజారెడ్డిపై కూడా శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఉత్తర్వులు అందాయి.

ఫొటో సోర్స్, UGC
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత డీజీపీ, విజయవాడ సీపీ, గుంటూరు ఐజీ, అనంతపురం డీఐజీ సహా పలువురు ఎస్పీలను విధుల నుంచి బదిలీ చేశారు.
ఈ నేపథ్యంలో తాజాగా నంద్యాల ఎస్పీ మీద చర్యలు, తిరుపతి జిల్లాలో ఒకేసారి పలువురు ఇన్ స్పెక్టర్లను బదిలీ చేయడం కీలక పరిణామంగా మారింది.
ప్రశాంతంగా పోలింగ్ ముగించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఈసీ చెబుతోంది.

ఫొటో సోర్స్, TelanganaCEO
కేసీఆర్ కుటుంబం పోటీలో లేని తొలి ఎన్నిక
తెలంగాణలో 3 కోట్లకు పైగా (3,32,32,318) ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించేందుకు అవకాశం ఉంది. వీరిలో ఇప్పటివరకు 20,163 మంది ఇంటి వద్దనే ఓటు వేయగా, 1.88లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకున్నారు
మొత్తం తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల పరిధిలో 525 మంది బరిలో ఉన్నారు.
అత్యధికంగా సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి 45 మంది పోటీ పడుతున్నారు.
అత్యల్పంగా ఆదిలాబాద్ లోక్ సభ నుంచి 12 మంది పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) ఆవిర్భావం తర్వాత కేసీఆర్ కుటుంబం నుంచి ఒక్కరు కూడా పోటీలో లేకుండా చట్టసభలకు జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే కావడం విశేషం.

ఫొటో సోర్స్, I & PR, RangaReddy
ఇక ప్రముఖుల విషయానికి వస్తే సికింద్రాబాద్ నుంచి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కరీంనగర్ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ పోటీలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- పాముల సెక్స్: సంభోగం తరువాత ఆడ అనకొండ మగపామును ఎందుకు చంపుతుంది?
- బ్లూ కార్నర్: ప్రజ్వల్ రేవణ్ణ కోసం ఈ నోటీస్ ఎందుకు జారీ చేశారు, దీనివల్ల ఏమవుతుంది?
- పెనైల్ క్యాన్సర్: పురుషాంగం తొలగించడానికి కారణమవుతున్న ఈ క్యాన్సర్ ఎలా వస్తుంది?
- శామ్ పిట్రోడా: ‘ఆఫ్రికన్’ కామెంట్లపై సొంత పార్టీ ఎలా స్పందించింది... ప్రధాని చేసిన విమర్శలేంటి?
- గుడ్డు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














