మాస్కో మ్యూజిక్ హాల్లో దాడి, 115 మంది మృతి.. యుక్రెయిన్, అమెరికా ఏమన్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
రష్యా రాజధాని మాస్కో పరిసర ప్రాంతంలోని ఒక కన్సర్ట్ హాల్లో కొందరు సాయుధులు జరిపిన దాడిలో 115 మంది చనిపోయారని రష్యా భద్రతా సంస్థలు చెప్పాయి.
మరో వందల మంది గాయపడ్డారని తెలిపాయి. మృతుల్లో పిల్లలు కూడా ఉన్నారు.
క్రాస్నోగోర్స్క్ నగరం శివార్లలోని క్రోకస్ సిటీ హాల్ అనే కన్సర్ట్ హాల్లో రాక్ సంగీత ప్రదర్శన ప్రారంభం కావడానికి ముందు ఈ ఘటన జరిగింది.
దీనిని ఉగ్రవాద దాడిగా రష్యా విదేశీ వ్యవహారాలశాఖ పేర్కొంది.
ఈ దాడిలో తమ ప్రమేయం లేదని యుక్రెయిన్ చెప్పింది.
టెలిగ్రామ్ మెసేంజింగ్ యాప్లో రష్యన్ ఇన్వెస్టిగేషన్ కమిటీ, "మృతుల సంఖ్య 115కి చేరింది. ఎమర్జెన్సీ బృందాలు శిథిలాల కింద మరిన్ని మృతదేహాలను గుర్తించాయి" అని తెలిపింది.

ఫొటో సోర్స్, MAXIM SHIPENKOV/EPA-EFE/REX/SHUTTERSTOCK
కన్సర్ట్ హాల్ వద్ద ఉన్నవారిని తప్పుదోవ పట్టించేలా ‘కామఫ్లాజ్’ దుస్తులు ధరించి వచ్చిన నలుగురు గన్మెన్ విచక్షణరహితంగా కాల్పులు జరిపారు.
రష్యన్ రాక్ గ్రూప్ ‘పిక్నిక్’ ఇచ్చే సంగీత ప్రదర్శన కోసం ఆరు వేల మందికి పైగా ప్రేక్షకులు కన్సర్ట్ హాల్కు వచ్చారు.
కార్యక్రమ వేదికపైకి బ్యాండ్ చేరుకోవడానికి కొన్ని నిమిషాల ముందు ఈ దాడి జరిగింది.
దాడిలో భవనం పైకప్పులో కొంత భాగం కూలిపోయింది. భవనంలో అగ్నికీలలు ఎగసిపడ్డాయి.
దాడికి పాల్పడినవారిని పట్టుకొనేందుకు ఘటనా స్థలంలో రష్యా నేషనల్ గార్డ్ ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.
రష్యా ఉన్నతాధికారులు కూడా క్రాస్నోగోర్స్క్ నగరానికి వెళ్లారు.

ఫొటో సోర్స్, REUTERS/MAXIM SHEMETOV
ఈ దాడి తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ చెప్పినట్లు ఆన్లైన్లో ఒక ప్రకటన కనిపించింది. ఇది ధృవీకృతం కాలేదు.
రష్యాపై ఇస్లామిక్ స్టేట్ దాడి చేయాలనుకొందనే నిఘా సమాచారం అమెరికా అధికారులకు అందిందని వారిని ఉటంకిస్తూ అమెరికాలో బీబీసీ పార్ట్నర్ సర్వీస్ అయిన సీబీఎస్ తెలిపింది.
జనసమ్మర్దంగల ప్రదేశాలకు వెళ్లొద్దని రష్యాలోని తమ పౌరులను అమెరికా రాయబార కార్యాలయం రెండు వారాల క్రితం హెచ్చరించింది.
మాస్కోలో జనసమ్మర్ద ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవాలని ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారనే సమాచారం తమకు ఉందని తెలిపింది.
ఇప్పుడు దాడి జరిగిన కన్సర్ట్ హాల్ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లొద్దని శుక్రవారం సాయంత్రం ఎంబసీ మరోసారి హెచ్చరించింది.

ఫొటో సోర్స్, CONTRIBUTOR/GETTY IMAGES
రష్యాలో కన్సర్ట్ హాల్లో దాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఇది హేయమైన ఉగ్రవాద దాడి అని ఆయన చెప్పారు.
రష్యా ప్రభుత్వానికి భారత్ సంఘీభావం తెలుపుతోందని మోదీ, ఎక్స్లో పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇవి కూడా చదవండి:
- రష్యా ఆర్మీలో హెల్పర్ పని అని తీసుకెళ్లి సైన్యంలో చేర్చారు.. హైదరాబాద్ యువకుడి మరణంపై కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?
- అనంత్ అంబానీ: వేల జంతువులతో రిలయన్స్ నిర్వహిస్తున్న ‘వంతారా’ జూలో ఏం జరుగుతోంది?
- రవిచంద్రన్ అశ్విన్: బ్యాటర్ కావాలనుకుని బౌలర్గా మారి రికార్డులు నెలకొల్పిన ఆటగాడు
- మాల్దీవులు: చైనాతో కీలక ఒప్పందం కుదుర్చుకున్న ముయిజ్జు, భారత్ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)















