తెలంగాణ: సుంకిశాల వివాదమేంటి, అక్కడేం జరుగుతోంది?

ఫొటో సోర్స్, MEIL
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న అంశం సుంకిశాల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో నిర్మించిన ఇన్టేక్ వెల్ రిటైనింగ్ (సైడ్) వాల్ కూలడం.. అది కొన్ని రోజుల వరకు బయటకు రాకపోవడం...రాజకీయ దుమారం రేపింది.
గోదావరి నదిపై కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల చుట్టూ నిన్నమొన్నటి వరకు నడిచిన తెలంగాణ ‘జల’ రాజకీయం ఇప్పుడు కృష్ణా నది వైపు తిరిగింది.
ఆగస్టు 2న సుంకిశాల ప్రాజెక్టు ఇన్టేక్ వెల్లో రిటైనింగ్ వాల్ కూలిపోయిన వీడియోలు ఐదు రోజుల తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సైడ్ వాల్ కూలిన ఘటనకు బాధ్యులను చేస్తూ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్కు చెందిన నలుగురు ఇంజినీర్లను సస్పెండ్ చేస్తూ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి దాన కిశోర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ను కూడా బదిలీ చేశారు.

అసలేం జరిగిందంటే...
ఆగస్టు 2 ఉదయం 7 గంటల సమయంలో సుంకిశాల ప్రాజెక్టులోని ఇన్టేక్ వెల్ రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా కూలిపోయింది. ఇది కూలుతున్న వీడియో ఒకటి ఆగస్ట్ 7న సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
దీన్ని ఎవరూ తీశారనే విషయంపై స్పష్టత లేదు. కానీ సరిగ్గా కార్మికులు లేని సమయంలో ఘటన జరగడం వల్ల ప్రాణనష్టం తప్పిందని చెప్పవచ్చు.
గోడ కూలిన ఘటనపై హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ప్రాథమిక విచారణ చేసింది.
‘‘ఇన్టేక్ వెల్కు ఉన్న మిడిల్ టన్నెల్కు అమర్చిన గేట్, సైడ్ వాల్ కూలిపోయాయి. నాగార్జున సాగర్ నుంచి ఊహించని స్థాయిలో వరద రావడంతో ఈ ఘటన జరిగింది. సాగర్ రిజర్వాయర్లోని నీరు ఒక్కసారిగా చొచ్చుకు వచ్చి టన్నెల్ గేట్, సైడ్ వాల్ కూలిపోయి ఇంటెక్ వెల్ నిండిపోయింది’’ అని ప్రాథమిక విచారణలో తేలినట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

ఫొటో సోర్స్, UGC
అసలు ఏమిటీ సుంకిశాల ప్రాజెక్టు?
వ్యవసాయ అవసరాలు, విద్యుదుత్పత్తి, తాగునీరు.. ఇలా వివిధ అవసరాల కోసం నీటి ప్రాజెక్టులు నిర్మిస్తుంటారు. సుంకిశాల ప్రాజెక్టును పూర్తిగా తాగునీటి అవసరాల కోసం చేపట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. 2050 నాటికి హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది.
ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలకు రోజుకు 602 మిలియన్ గ్యాలన్ల (ఎంజీడీ) నీరు అవసరం. ఇందులో నాగార్జున సాగర్ నుంచి ఇప్పటికే 270 ఎంజీడీల నీటిని తీసుకువస్తున్నారు.
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులో భాగంగా అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా నీటిని కోదండాపూర్ వద్ద పంపు హౌస్కు తరలిస్తున్నారు. అక్కడ నీటిని ట్రీట్ చేసిన తర్వాత నగరానికి తరలిస్తున్నారు.
నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. ఒకవేళ ప్రాజెక్టు నీటిమట్టం డెడ్ స్టోరేజీ (510 అడుగులు)కు చేరితే నీరు తరలించడం సాధ్యం కావడం లేదు.
కృష్ణా నదికి వరుసగా రెండు, మూడేళ్లు వరదలు రాకపోతే నాగార్జున సాగర్లో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరితే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని తరలించడం కష్టమవుతోంది.
ఈ ఇబ్బందులు అధిగమించేందుకు సుంకిశాల ప్రాజెక్టుకు 2016లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సంకల్పించింది. 2021 మార్చి 16న మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి పనులు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కోదండాపూర్ వరకు 2325 ఎంఎం వ్యాసంతో రెండు వరుసల్లో పైపులైన్లు నిర్మించడం, సంపు నిర్మాణం, పంపుహౌస్కు అనుసంధానించే మూడు సొరంగాలు తవ్వడం, తదితర పనులు చేయాలి.
ముందుగా రూ.1450 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రతిపాదించగా.. 2022 అక్టోబరు నాటికి రూ.2214 కోట్లకు అంచనాలు పెరిగాయి.
‘‘వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు 2011లోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తయారు చేసింది. 2012లో అప్పటి ప్రభుత్వం వద్దకు ఆ నివేదిక చేరింది. రూ.840కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. దీనికి జైకా నుంచి రుణం తీసుకునేందుకు కూడా ప్రతిపాదించారు. కానీ అప్పట్లో అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీరు బాగా వస్తుండటంతో సుంకిశాల ప్రాజెక్టు అంతగా అవసరం లేదని ప్రభుత్వం భావించింది. అందుకే పనులు ప్రారంభం కాలేదు’’ అని జలమండలికి చెందిన మాజీ ఇంజినీర్ ఒకరు బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, MEIL
మూడు మార్గాల్లో నీటి రాక
ప్రస్తుతం పనుల్లో భాగంగా భారీ ఇన్టేక్ వెల్ నిర్మించారు. దీని ఎత్తు 590 అడుగులుగా జలమండలి చెబుతోంది.
ఇన్టేక్ వెల్లోకి నీటిని తరలించేందుకు వీలుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి మూడు టన్నెల్స్ (సొరంగాలు) నిర్మించారు.
నాగార్జున సాగర్లో 455 అడుగుల ఎత్తులో నీరు ఉంటే తీసునేందుకు వీలుగా మొదటి టన్నెల్ ఉంటుంది.
రెండో టన్నెల్ 5౦4 అడుగుల ఎత్తు వరకు నీరు ఉంటే తీసుకునేలా ఉంది.
మూడో టన్నెల్ సాగర్లో నీటి మట్టం 547 అడుగుల ఎత్తు వరకు చేరినా తీసుకునేలా ఉంది.
వీటి ద్వారా సాగర్లో నీటి మట్టం ఆధారంగా ఇన్టేక్ వెల్లోకి నీరు చేరుతుంది. ఈ వెల్కు సంబంధించిన సైడ్ వాల్ నిర్మాణంలో ఉంది.
ఇటీవల రెండో టన్నెల్ నుంచి వరద వచ్చి గేటు కొట్టుకుపోవడంతోపాటు సైడ్ వాల్లోని ఒక బ్లాక్ కూలిపోయింది.
‘‘ఇది కచ్చితంగా వైఫల్యమే. డిజైన్లలో లోపం కారణంగానే ఘటన జరిగిందని తెలుస్తోంది. భూమి నాణ్యత పరీక్షలు చేసే ప్రాజెక్టు మొదలుపెట్టారా లేదా అన్నది తేలాలి. ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతంలో షెల్ రాక్ ఉంది. అంటే రాతిపొరలు ఒకదాని మీద ఒకటి ఉన్నాయి. దీనివల్ల భూమి నాణ్యతలో తేడా ఉంటుంది. అందుకే భూమి నాణ్యత పరీక్షలపై స్క్రూటినీ జరగాల్సిన అవసరం ఉంది’’ అని జలమండలి మాజీ ఇంజినీరు ఒకరు బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, MEIL
సైడ్ వాల్ నిర్మాణం ఎవరి బాధ్యత?
సైడ్ వాల్ కూలింది సరే, మళ్లీ ఖర్చు భరించి నిర్మించాల్సిన బాధ్యత ఎవరిపై ఉందనే ప్రశ్న ఇప్పుడు వస్తోంది.
ఇది కచ్చితంగా నిర్మాణ పనులు చేస్తున్న మేఘా ఇంజినీరింగ్ కంపెనీపైనే ఉంటుందని అంటున్నారు నీటి పారుదల శాఖ రిటైర్డ్ ఇంజినీర్ నైనాల గోవర్ధన్.
‘‘పనులు చేస్తున్న సమయంలో ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు తిరిగి నిర్మించే బాధ్యత నిర్మాణ కంపెనీపైనే ఉంటుంది. ఇప్పటి వరకు 70శాతం పనులు పూర్తయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది మార్చిలోగా పనులు పూర్తవుతాయని జలమండలి అధికారులు చెబుతూ వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టు పూర్తి కావడం కష్టమే అనిపిస్తోంది. ఎందుకంటే, సాగర్లో నీటి మట్టం 510 అడుగులకు తగ్గితేనే ప్రాజెక్టు పనులు చేసే వీలుంటుంది. ఈ ఏడాది వరదలు రావడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. నీరు అధికంగా ఉంటే పనులు చేయడం సాధ్యపడకపోవచ్చు’’ అని గోవర్దన్ చెప్పారు.
మరోవైపు, ఈ ఘటనపై మేఘా ఇంజినీరింగ్ సంస్థను ఈ-మెయిల్ ద్వారా బీబీసీ వివరణ కోరింది. వారి నుంచి సమాధానం ఇంకా రాలేదు.

ఫొటో సోర్స్, MEIL
రాజకీయ దుమారం
సుంకిశాల ఘటనపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
సైడ్ వాల్ కూలిపోయినా సరే ఐదు రోజుల వరకు ప్రభుత్వం బయటకు చెప్పకుండా దాచిపెట్టిందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
‘‘హైదరాబాద్ తాగునీటి అవసరాల దృష్ట్యా మా ప్రభుత్వం సుంకిశాల ప్రాజెక్టును చేపట్టింది. గతంలో కోట్ల విజయభాస్కరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మొదటగా ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా మరుగున పడిన ప్రాజెక్టును ముఖ్యమంత్రిగా కేసీఆర్ తిరిగి తెరపైకి తీసుకొచ్చి పట్టాలెక్కించారు. రాబోయే 50ఏళ్లకు తగ్గ నీటి అవసరాలు తీర్చేలా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాం. ఆగస్టు 2న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు సైడ్ వాల్ కూలిన ఘటన జరిగితే ఎందుకు ప్రభుత్వం బయట పెట్టలేదు? ఈ విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచిందనే విషయంపై సమాధానం చెప్పాలి’’ అని కేటీఆర్ మీడియాతో చెప్పారు.

ఫొటో సోర్స్, @Bhatti_Mallu
ప్రభుత్వం ఏం చెబుతోంది?
సుంకిశాల ప్రాజెక్టు వ్యవహారంపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు.
‘‘సుంకిశాల ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదలుపెట్టిన ప్రాజెక్టు కాదు, మేం కట్టించింది కూడా కాదు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులతోపాటు సుంకిశాల ప్రాజెక్టు పాపం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. సుంకిశాల ప్రాజెక్టుకు 2021 జులైలో అగ్రిమెంట్ చేసుకుని.. 2023 జులై నాటికి టన్నెల్ సైడ్ వాల్ వరకు పూర్తి చేశారు. సాగర్లో నీళ్లొచ్చాయి కనుక కూలింది అంటున్నారు. దీన్ని బట్టి అప్పటి డిజైన్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో అర్థమవుతోంది’’ అని భట్టి విక్రమార్క చెప్పారు.
మరోవైపు బీజేపీ శాసనసభా పక్షం కూడా సుంకిశాల ప్రాజెక్టును సందర్శించి సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














